‘పీఆర్’ ఉద్యోగుల్లోటెన్షన్
ABN, Publish Date - May 27 , 2025 | 12:27 AM
రాయలసీమ పరిధిలోని పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో బదిలీ టెన్షన్ తారస్థాయికి చేరుకుంది.
సీనియారిటీకి ప్రాధాన్యమిస్తారా?
ఇన్చార్జిలు, ఎఫ్ఏసీల స్థానాలను మార్చేరా.?
నేడు ‘అనంత’లో ఉద్యోగులకు కౌన్సెలింగ్
నంద్యాల, మే 26 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ పరిధిలోని పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో బదిలీ టెన్షన్ తారస్థాయికి చేరుకుంది. తాజా ప్రభుత్వ బదిలీ ఉత్తర్వులు ప్రకారం.. రాయలసీమ జోన్-4 పరిధిలోని ఉమ్మడి కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో పంచాయతీ రాజ్శాఖలో వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీకి సంబందించిన కౌన్సెలింగ్ మంగళవారం అనంతపురం జిల్లాలోని పంచాయతీ రాజ్శాఖ ప్రధాన కార్యాలయంలో జరుగునుంది. దీంతో ఆయా ఉద్యోగులందరూ ఉదయాన్నే సదరు కౌన్సెలింగ్కు హాజరుకానున్నారు. ఈ కౌన్సెలింగ్ ఆ శాఖ ఈఎన్సీ బాలునాయక్ అధ్వర్యంలో జరుగనుంది. ఈ క్రమంలో ఎవరిని ఎక్కడకు బదిలీ చేస్తారోనన్న ఆందోళన అందరిలో నెలకొంది. అయితే సీనియారిటీ ప్రాతిపాదికన కౌన్సెలింగ్ నిర్వహిస్తారా..? లేక ఎఫ్ఏసీ, ఓడీల రూపంలో పనిచేస్తున్న వారిని ఆయా స్థానాల నుంచి కదిలిస్తారా..? అర్హులకు తగిన న్యాయం జరుగుతుందా? అన్న సందేహాలు ఆ శాఖ వర్గాల్లో ఉంది. రాయలసీమలోని జోన్-4 పరిధిలోని ఉద్యోగులను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తే 26 మంది డీఈఈలు ఉండగా 161 మంది ఏఈ, ఏఈఈలు ఉన్నారు. డీఈఈలు అనంతపురంలో ఏడుగురు, కడపలో 9 మంది, చిత్తూరులో ఐదుగురు, కర్నూలులో ఐదుగురు చొప్పున ఉన్నారు. అదేవిఽ దంగా ఏఈలు, ఏఈఈ లను పరిశీలిస్తే అనంతపురంలో 49 మంది, చిత్తూరులో 59, కడపలో 33 మంది, కర్నూలు 20మంది ఉన్నారు. నిబంధనల మేరకు ఐదేళ్లు దాటిన డీఈఈలు 11 మంది ఉండగా ఏఈలు, ఏఈఈలు 19 మంది ఉన్నారు. వీరితో పాటు టెక్నికల్ ఆఫీసర్స్, ఏటీఓలు, జేటీఓలు, సూపరింటెం డెంట్లకు బదిలీలు ఉంటాయి. సీనియర్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్ల పరంగా కొందరు కౌన్సెలింగ్కు హాజరవుతారు. అంతేకాకుండా రిక్వెస్ట్ బదిలీ కూడా కొన్ని ఉంటాయని సమాచారం.
ఉద్యోగుల్లో వీడని ఉత్కంఠ..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పంచాయతీ రాజ్శాఖ పరంగా.. రెండో సారి ఉద్యోగుల బదిలీకి సంబందించి తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది ఆగస్టులో మొదటి విడల బదిలీ కౌన్సిలింగ్ జరిగింది. ఆ తర్వాత నేడు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ఆయితే ఐదేళ్లు ఒకే చోట పనిచేసిన ఉద్యోగులకు తప్పనిసరి బదిలీతో రిక్వెస్ట్ బదిలీలకు అవకాశం కల్పించడంతో ఎవర్ని ఎక్కడికి బదిలీ చేస్తారో...? అనే భయం బాధిత వర్గాల్లో నెలకుంది. గత వైసీపీ ప్రభుత్వ హాయాంలో చాలా మంది పైరవీలు చేసి ఇష్టారాజ్యంగా పోస్టింగ్ పొందారనే విమర్శలు లేకపోలేదు. అదే తరహాలో కూటమి ప్రభుత్వంలోను మొదటి విడతలో జరిగిన బదిలీల కౌన్సిలింగ్లతో పాటు ఆ తర్వాత కొందరు ఉద్యోగులు ప్రజాప్రతినిధుల సిఫార్సు లెటర్స్తో పైరవీలు చేసి పోస్టింగ్లు పొందరానే విమర్శలు లేకపోలేదు. తద్వారా సీనియారిటితో పాటు అర్హులైన వారికి అన్యాయం జరిగిందనే ఆరోపణలు ఆశాఖ వర్గాల్లోనే లేకపోలేదు. ఈ నేపథ్యంలో కనీసం నేడు జరిగే బదిలీల కౌన్సిలింగ్ పక్రియలోనైనా అర్హులైన న్యాయం జరిగే విధంగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదిలా ఉండగా.. గత కౌన్సిలింగ్లో పైరవీలు చేసి రూ. లక్షలు ఖర్చులు చేసి ఇన్చార్జి(ఎఫ్ఏసీ, ఓడీలు) డీఈఈ పోస్టింగ్లు పొందిన వారి పరిస్థితి ఆగోమ్యాచారంగా మారింది. తమ పోస్టింగ్ ఉంటుందా..? ఊడుతుందా..? అని ఆందోళన నెలకుంది. ఏది ఏమైనా నేడు జరిగే కౌన్సిలింగ్తో ఆశాఖ ఉద్యోగుల్లో ఉత్కఠం వీడటం లేదని తెలుస్తోంది.
పాతుకు పోయారు..!
పంచాయతీ రాజ్ శాఖలో పీఆర్ఐ, పీఐయూ, క్యూసీ విభాగాలు ఉన్నాయి. ఆయితే ఏళ్ల తరబడి బదిలీలు జరిగినా కూడా చాలా మంది ఉద్యోగులు విభాగాల్లోనే పాతుకుపోతున్నారు. పీఆర్ఐలో పనిచే స్తున్న ఉద్యోగి అదే పీఆర్ఐలోని మరో డివిజన్కు బదిలీ అవుతున్నారే తప్ప... మరోక విభాగమైన క్యూసీ, పీఐయూ విభాగాలకు బదిలీ కావడం లేదు. పీఐయూ, క్యూసీ విభాగాల్లోనే ఇదే తరహాలో వ్యవ హారం సాగుతోంది. ఇదీచాలదన్నట్లు.. నిత్యం ఆఫీస్ విభాగాల్లో కూడా చాలా మంది ఉద్యోగులు ఆఫీస్ విభాగాలకే బదిలీ అవుతుండటం పలు విమర్శలకు తావిస్తోంది. చాలా మంది ఉద్యోగులు సైతం ఫీల్డ్ ఉద్యోగాలకు బదిలీ కాకుండా తమదైన శైలిలో చక్రం తిప్పుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కౌన్సెలింగ్లో కొందరు ఉద్యోగులకు డిప్యుటేషన్ రూపంలో అన్యాయం జరుగుతోందని సమాచారం.
సీనియార్టీకి ప్రాధాన్యమిస్తారా?
కౌన్సెలింగ్లో సిఫార్సులు, ఒత్తిళ్లకు తలొగ్గకుండా అర్హులైన ఉద్యోగులను సీనియారిటీ ప్రాతిపాదికన న్యాయం చేస్తారా? లేదా? అనే సందేహాలు ఉద్యోగుల్లో నెలకొంది. డీఈఈలతో పాటు ఏఈ,ఏఈఈల ఖాళీలలు ఎక్కువగా ఉండటంతో ఆయా పోస్టింగ్లపై ఉత్కంఠ నెలకుంది. పైగా రెగ్యులర్ డీఈఈలు లేకపోవడంతో పైరవీలకు ఆస్కారం ఎక్కువుగా ఉందని ఆశాఖ వర్గాల్లో చర్చసాగుతోంది. వీటికితోడు ఇదివరకే కొందరు ఏఈ,ఏఈఈలు సైతం తమదైన శైలిలో పైరవీలు చేసి ఎఫ్ఏసీ, ఓడీల రూపంలో డీఈఈలుగా పనిచేస్తున్నారు. దీంతో ఆయా వారిని తాజా కౌన్సెలింగ్లో తప్పించి మిగిలిన వారికి న్యాయం చేయాలన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
Updated Date - May 27 , 2025 | 12:27 AM