గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే చెరువు శిథిలం
ABN, Publish Date - Jul 10 , 2025 | 01:26 AM
గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే చెరువు శిథిలమవుతోందని ఎమ్మెల్యే పార్థసారథి విమర్శించారు
బసాపురం చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే, అధికారులు
ఆదోని టౌన్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే చెరువు శిథిలమవుతోందని ఎమ్మెల్యే పార్థసారథి విమర్శించారు. బుధవారం సీడీవో(సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, విజయవాడ) పబ్లిక్ హెల్త్ (అనంతపూర్) అధికారులతో కలిసి బసాపురం చెరువును పరిశీలించారు. గత ఎమ్మెల్యే అక్రమ సంపాదనపై చూపిన శ్రద్ధ అభివృద్దిపై చూపలేదన్నారు. చెరువుకు శాశ్వత మరమ్మతులు చేయించిచేందుకు ఉన్నతాధికారులను పిలిపించామన్నారు. సీడీవో ఎస్ఈ శివకుమార్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో మరమ్మత్తులు చేసే అవకాశం లేదని, వచ్చే వేసవిలో తాత్కాలిక మరమ్మత్తులు చేస్తామన్నారు. చెరువు కట్టకు స్టోన్ రివిట్మెంట్ చేయాల్సి ఉందని, డీపీఆర్ సిద్ధం చేస్తామన్నారు. శాశ్వత మరమ్మతులకు ఎక్కువ సమయం పడుతుందని, అంతవరకు ఇసుక బస్తాలను వేసుకోవాలని సూచించారు. సీడీవో, ఈఈ కేదార్నాథ్ రెడ్డి, జెఈ విజయ రాజు, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ రామ్ మోహన్ రెడ్డి, డిప్యూటీ ఎస్ఈ సతీష్, మున్సిపల్ ఇంజనీర్ వెంకట చలపతి, డీఈరామమూర్తి, కౌన్సిల్ చైర్ పర్సన్ లోకేశ్వరి కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Updated Date - Jul 10 , 2025 | 01:26 AM