దారి దోపిడీ కేసులో నిందితుల అరెస్టు
ABN, Publish Date - Jul 15 , 2025 | 12:39 AM
నాగలాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్దపాడు సమీపంలో దారి దోపిడీ చేసిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
కర్నూలు క్రైం, జూలై 14 (ఆంధ్రజ్యోతి): నాగలాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్దపాడు సమీపంలో దారి దోపిడీ చేసిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ప్రధాన నిందితుడు రమేష్ (వాసవి నగర్, కర్నూలు), మరో ఇద్దరు బాల నేరగాళ్లు ఉన్నారు. డీఎస్పీ బాబు ప్రసాద్, సీఐ చంద్రబాబు నాయుడు, ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. దేవనకొండ మండలం తెర్నేకల్లు గ్రామానికి చెందిన నూర్ బాషా అనే వ్యక్తి ఈ నెల 5వ తేదీన తెల్లవారుజామున హైదరాబాదు నుంచి కర్నూలు వచ్చారు. తెర్నేకల్లు వెళ్లాలని బళ్లారి చౌరస్తా వద్ద నిల్చుని ఉన్నారు. ముగ్గురు వ్యక్తులు కారులో వచ్చి ఎక్కడికి వెళ్లాలని అడిగారు. మెయిన్ రోడ్డులో ఉండే కడివేముల వద్ద దిగుతానని నూర్బాషా చెప్పారు. తాము కూడా బళ్లారి వెళ్తున్నామని, రూ.100కు టికెట్ మాట్లాడుకుని నూర్బాషాను కారులో ఎక్కించుకున్నారు. పెద్దపాడు దాటిన తర్వాత ఆయనను కొట్టి సెల్ఫోన్, ఏటీఎం, క్రెడిట్కార్డు బలవంతంగా లాక్కున్నారు. ఫోన్ పే ద్వారా రూ.12వేల నగదును మరొకరి అకౌంటుకు ట్రాన్స్ఫర్ చేసుకు న్నారు. రూ.6,500 నగదు లాక్కొని నెరవాడ సమీపంలో కారు నుంచి బయటకు తోసేసి వెళ్లిపోయారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. సోమవారం కర్నూలులో ముగ్గురిని అరెస్టు చేసి చేసి వద్ద నుంచి రెండు సెల్ఫోన్లు, ఏటీఎం, క్రెడిట్ కార్డు, దోపిడీ చేసిన రూ.12వేలు, కారు స్వాధీనం చేసుకున్నారు. మద్యానికి బానిసై దోపిడీకి పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Updated Date - Jul 15 , 2025 | 12:39 AM