సిమెంటు ఫ్యాక్టరీకి రాజకీయ గ్రహణం
ABN, Publish Date - Jun 18 , 2025 | 12:11 AM
పాణ్యం నియోజక వర్గంలోని బేతంచెర్ల మండల సిమెంటునగర్ గ్రామంలో ఉన్న పాణ్యం సిమెంటు ఫ్యాక్టరీకి రాజకీయ గ్రహణం పట్టుకుంది.
కార్మికుల కష్టాలను పట్టించుకోని యాజమాన్యం
రాజకీయాలకతీతంగా ఫ్యాక్టరీని నడిపించాలని కార్మికుల విజ్ఞప్తి
బేతంచెర్ల, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): పాణ్యం నియోజక వర్గంలోని బేతంచెర్ల మండల సిమెంటునగర్ గ్రామంలో ఉన్న పాణ్యం సిమెంటు ఫ్యాక్టరీకి రాజకీయ గ్రహణం పట్టుకుంది. ఈ ప్యాక్టరీపై రాజకీయ ఆధిపత్యం కొనసాగించేందుకు పాణ్యం రాజకీయ నాయకులు కాటసాని రాంభూపాల్రెడ్డి, ప్రత్యర్థులు బిజ్జం సత్యంరెడ్డి మధ్య జరిగిన పోరులో కార్మికులు నలిగి పోయారు. సిమెంట్నగర్ కార్మిక నాయకుడు సూర్యనారాయణ 1987లో హత్యకు గురయ్యాడు. అప్పటి నుంచి పాణ్యం సిమెంటు ఫ్యాక్టరీ కార్మికుల పరిస్థితి అధ్వానంగా కొనసాగుతుంది. అనంతరం నంద్యాల నంది పైపుల యాజమాన్యం సిమెంటు ఫ్యాక్టరీ నిర్వహణ చేపట్టింది. కార్మికులకు జీతభత్యాలు ఇచ్చి ప్యాక్టరీ నిర్వహించింది. కర్ణాటక బెంగుళూరు ప్రాంతాల్లో ఉన్న పాణ్యం సిమెంటు ప్యాక్టరీకి చెందిన ఆస్తులన్నీ విక్రయించడంతో ఫ్యాక్టరీ అథోగతి పాలైంది. అప్పటి నుంచి కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న కాలంలో ఫ్యాక్టరీని మూసివేశారు. కార్మికుల కుటుంబాల పోషణ కూడా భారమైంది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్న సాగర్ సిమెంటు యాజ మాన్యం ఫ్యాక్టరీ నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. ఈ యాజమాన్యం రిటైర్డు డీఎస్సీ నరసింహారెడ్డి, సిమెంటు నగర్ సర్పంచ్ మరియమ్మ కుమారుడు యాకోబు ఫ్యాక్టరీలో విధులు నిర్వహించే 13 మంది కార్మికులను పనుల్లోకి రాకుండా చేశారు. వైసీపీ కండువా వేసుకున్న వారిని విధుల్లోకి చేర్చుకున్నారు. టీడీపీకి చెందిన వారిని విధుల్లోకి తీసుకోకపోవడంతో వారు ఎన్సీఎల్టీ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఈ 13 మంది కార్మికులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయినా యాజమాన్యం ఒప్పుకోక పోవడంతో వారు ఫ్యాక్టరీ బైటే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ విషయంపై లేబర్ కోర్టును కూడా ఆశ్రయించామని, అక్కడా తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని కార్మికులు తెలిపారు. అంతలోనే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అంత వరకు ఉన్న యాజమాన్యం ఫ్యాక్టరీని మూసివేసింది. అయినా వైసీపీకి చెందిన కార్మికులకు మాత్రం నెలకు రూ. కోటి దాక జీతాలు కింద చెల్లిస్తుందని, మరో రూ.2కోట్లు పెట్టుకుంటే ఫ్యాక్టరీ నడుస్తుందని పలువురు కార్మికులు ఆరోపించారు. ఫ్యాక్టరీలో ఉన్న స్ర్కాప్ అంతా అమ్మడంతో బుగ్గనకు రూ.300 కోట్లు, యాజమాన్యానికి రూ.300 కోట్లు ఆదాయం వచ్చిందని, ఆ తర్వాత ఫ్యాక్టరీ మూసివేశారని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా రాజకీయ పార్టీలతో సిమెంట్ ఫ్యాక్టరీ తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు దీక్షలు చేపట్టారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాణ్యం సిమెంటు ఫ్యాక్టరీని రాజకీయ పార్టీల జోక్యం లేకుండా సజావుగా నడిపించేందుకు చర్యలు తీసుకోవాలని కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Updated Date - Jun 18 , 2025 | 12:12 AM