ఓర్వకల్లు-లేపాక్షి ఇండస్ట్రియల్ కారిడార్గా అభివృద్ధి
ABN, Publish Date - Jun 24 , 2025 | 12:08 AM
: ఓర్వకల్లు నుంచి అనంతపురం జిల్లా లేపాక్షి వరకు ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు మరోమారు స్పష్టం చేశారు.
త్వరలో కర్నూలులో హైకోర్టు బెంచ్
సుపరిపాలనలో తొలి అడుగుల సమావేశంలో సీఎం చంద్రబాబు
కర్నూలు, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): ఓర్వకల్లు నుంచి అనంతపురం జిల్లా లేపాక్షి వరకు ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు మరోమారు స్పష్టం చేశారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాదైన సందర్భంగా సోమవారం అమరావతిలో ‘సుపరిపాలనకు తొలి అడుగు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లతో పాటు కలెక్టరు, జాయింట్ కలెక్టరు సహా ముఖ్య అధికారులను మాత్రమే ఆహ్వానించారు. జిల్లా నుంచి పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, కలెక్టరు పి. రంజిత్బాషా, ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఎంపీలు బస్తిపాటి నాగరాజు, బైరెడ్డి శబరి ఎమ్మెల్సీ బీటీ నాయుడు, ఎమ్మెల్యేలు బొగ్గుల దస్తగిరి, గౌరు చరిత, కేఈ శ్యాంబాబు, బీవీ జయనాగేశ్వరరెడ్డి తదితరులు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తదితరులు పాల్గొన్న ఆ సమావేశంలో ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన పాలనా సంస్కరణలు, తీసుకొచ్చిన మార్పులను వివరించారు.
త్వరలో కర్నూలు హైకోర్టు బెంచ్
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ త్వరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయబోతున్నట్లు వివరించారు. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నామని వివరించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు నుంచి అనంతపురం జిల్లా లేపాక్షి వరకు ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. నాలుగేళ్లలో సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తామన్నారు.
Updated Date - Jun 24 , 2025 | 12:08 AM