అంతంత మాత్రమే..
ABN, Publish Date - Apr 26 , 2025 | 11:58 PM
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. అయినప్పటికీ నేటికి పలు కారణాల వల్ల ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్యం అందడం లేదు.
సమస్యల్లో ప్రభుత్వాస్పత్రులు
వేధిస్తున్న వైద్యుల కొరత
వైద్యశాఖలో కఠినతర నిబంధనలు
క్షేత్రస్థాయిలో అమలుకాని పరిస్థితి
ఉద్యోగులకు ఎఫ్ఆర్ఎస్ కష్టాలు
చాలీచాలని భవనాల్లో విధులు
ఇబ్బందుల్లో డీఎంహెచ్వో కార్యాలయ సిబ్బంది
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. అయినప్పటికీ నేటికి పలు కారణాల వల్ల ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్యం అందడం లేదు. ముఖ్యంగా ప్రభుత్వాస్పత్రులు సమస్యల సుడిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైద్యుల కొరత వేధిస్తోంది. ఉమ్మడి జిల్లాలో 30 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్యశాఖలో రాష్ట్ర ప్రభుత్వం కఠినతర నిబంధనలు అమలు చేస్తుండటంతో వైద్యులు నిరాశ చెందుతున్నారు. ఉద్యోగులు ఎఫ్ఆర్ఎస్తో ఇక్కట్లు పడుతున్నారు. గతంలో క్షేత్రస్థాయి వారికి మినహాయింపు ఉండేది. ప్రస్తుతం దాని తొలగించి అందరికీ వర్తింపజేస్తున్నారు.
కర్నూలు హాస్పిటల్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు వైద్యసేవలు అంతంత మాత్రమే లభిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆస్పత్రుల్లో అనేక మార్పులు తెస్తున్నా క్షేత్రస్థాయిలో అమలుకాని పరిస్థితి నెలకొంది. పీహెచ్సీ (ప్రాథమిక ఆరోగ్య కేంద్రం)ల్లో పనిచేసే వైద్యాధికారులు మొక్కుబడిగా వైద్యశాలలకు వెళ్లిపోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పీహెచ్సీలో వైద్యుల కొరత వేధిస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన సేవలు అందించేందుకు ఒక్కొక్క పీహెచ్సీకి ఇద్దరు వైద్యులను నియమించారు. నంద్యాల జిల్లాలో 59 పీహెచ్సీలకు 19 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 14 మంది పీజీ కోర్సు చదవడానికి వెళ్లారు. కర్నూలు జిల్లాలోని 35 పీహెచ్సీల్లో 11 వైద్యుల పోస్టులు ఖాళీఉండగా.. 9 మంది పీజీ చదువుల కోసం వెళ్లడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో 30వైద్యుల పోస్టులు ఖాళీలు ఏర్పడటంతో గ్రామీణ ప్రాంతాల్లో సేవలు స్థంబించాయి.
ఎఫ్ఆర్ఎస్ కత్తి
ఉద్యోగులు ఖచ్చితమైన వేళకు విధులకు హాజరయ్యేలా వైద్యఆరోగ్య శాఖలో ఇటీవల ముఖహాజరు గుర్తింపు (ఎఫ్ఆర్ఎస్) నిబంధనలకు తీవ్రతరం చేశారు. ఆలస్యంగా విధులకు వచ్చిన వైద్యసిబ్బంది, విధులకు గైర్హాజరైన వారు, నెట్వర్క్ సమస్యతో ఎఫ్ఆర్ఎస్ వేయకపోయిన వారికి ఆన్లైన్లో ఉన్నతాధికారులు నోటీసులు జారీచేస్తున్నారు. 100మీటర్ల నుంచి 50 మీటర్ల ఎఫ్ఆర్ఎస్ పరిధిని తగ్గించడంతో వైద్యసిబ్బందికి కష్టాలు రెట్టింపయ్యాయి. ఇటీవల ఐఫోన్లో ట్యాంపరింగ్ చేసి ఎఫ్ఆర్ఎస్ వేసినట్లు కర్నూలు జిల్లాలో 7 మంది వైద్యసిబ్బందిని గుర్తించి నోటీసులు జారీచేశారు. ఇక గ్రామీణ ప్రాంతంలో సరైన నెట్వర్క్లేని కారణంగా మారుమూల ప్రాంతాల్లో ఎఫ్ఆర్ఎస్ను ఉద్యోగులు నమోదు చేయడం లేదు. గతంలో క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులకు బయోమెట్రిక్, ఎఫ్ఆర్ఎస్ మినహాయింపు ఇచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చాక మూడుసార్లు ఆలస్యంగా వచ్చిన ఉద్యోగులకు జీతాలు నిలుపుదల చేయడంతో ఆందోళన చెందుతున్నారు. క్షేత్రస్థాయి ఉద్యోగులకు ఎఫ్ఆర్ఎస్ నుంచి మినహాయింపు ఇవ్వాలి.
శిథిలావస్థలో డీహెచ్ఎంవో భవనం..
కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయానికి భవనం శిథిలావస్థకు చేరింది. మొదటి అంతస్తులో పెచ్చులూడి పడుతున్నాయి. దీంతో కొన్ని గదులకు అధికారులు తాళాలు వేసి చాలీచాలని భవనాల్లో బిక్కుబిక్కుమంటున్నారు. డీఎంహెచ్వో ఆఫీసు నిజంగా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయం కాదు. రీజనల్ ట్రైనింగ్ సెంటర్ (ఫిమేల్)కు చెందిన నర్సుల హాస్టల్. డీఎంహెచ్వో ఆఫీసు మొదట మలేరియా ఆఫీసులో ఉండేది. అక్కడ భవనాలు పైకప్పు ఊడిపడుతుండటంతో ఖాళీచేసి ఆర్టీసీ ఫిమేల్ ట్రైనింగ్ సెంటర్కు చెందిన నర్సుల హాస్టల్లో చేరారు. ప్రస్తుతం ఇదే డీఎంహెచ్వో ఆఫీసుకు కొనసాగుతుంది. 1998లో ప్రస్తుతం డీఐవో ఆఫీసుపై అంతస్థులులో డీఎంహెచ్వో ఆఫీసు కట్టించాలని ఆదేశాలు జారీ చేసినా వాటిని ఎక్కడా అమలు చేయకపోవడంతో పాతభవనంలోనే ఆఫీసులో కొనసాగిస్తున్నారు. పక్కనున్న అనంతపురం, కడప, చిత్తూరు ప్రకాశం జిల్లాలో డీఎంహెచ్వో ఆఫీసులకు కొత్త భవనాలు ఉన్నాయి. కానీ ఎంతోఘన చరిత్ర రాష్ట్ర పూర్వ రాజధానిగా ఉన్న కర్నూలులో మాత్రం డీఎంహెచ్వో కార్యాలయానికి కొత్త భవనం లేదు.
ఎల్పీసీలు ఇవ్వాలి
ప్రతి పీహెచ్సీలో 14 మంది మాత్రమే సిబ్బంది ఉండాలన్న గత ప్రభుత్వం చేసిన జీవో.నెం.143
ప్రకారం ఎంపీహెచ్ఈవో, సీహెచ్వోల్లో ఒక్కరు మాత్రమే పీహెచ్సీలో ఉండాలి. గత ఏడాది 143 జీవో ప్రకారం కౌన్సిలింగ్ జరిపి రీడిప్లాయిమెంటు కింద బదిలీచేసి నేటివరకు ఎల్పీసీలు ఇవ్వలేదు. పనిచేసేది కర్నూలు జిల్లాలో.. మరో జిల్లాలో జీతం తీసుకుంటున్నారు. జీవో.నెం.143 ప్రకారం ఎంపీహెచ్ఈవో ఉన్న పీహెచ్సీలకే రెగ్యులర్ సీహెచ్వోలుగా పదోన్నతులపై పోస్టింగ్ ఇవ్వడం, వైద్యఆరోగ్యశాఖ ఆంతర్యం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ 14 ప్యాట్రాన్ ప్రకారం సిబ్బంది ఉంటే రిడిప్లాయ్ కింద ఉన్న ఎంపీహెచ్ఈవో ఉండాలా..? లేదా పదోన్నతి పొందిన సీహెచ్వో ఉండాలా వైద్య శాఖ అధికారులు స్పష్టత ఇవ్వాలి.
Updated Date - Apr 26 , 2025 | 11:58 PM