ఉపాధి కూలీల ఆకలి కేకలు
ABN, Publish Date - May 13 , 2025 | 12:34 AM
మండుటెండలో పనిచేస్తే తమ కడుపు కాల్చుతున్నారని, తమకు ఆకలి కేకలు తప్పడం లేదన ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించని ప్రభుత్వాలు
సిబ్బందిదీ అదే పరిస్థితి
హాలహర్వి, మే 12 (ఆంధ్రజ్యోతి): మండుటెండలో పనిచేస్తే తమ కడుపు కాల్చుతున్నారని, తమకు ఆకలి కేకలు తప్పడం లేదన ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో మొత్తం 24గ్రామాలు ఉండగా, 10,345జాబ్ కార్డులు, పనిచేసే జాబ్కార్డులు 8,836 కాగా 15,636 వేల మంది కూలీలు పనులకు వస్తున్నారు. అయితే జనవరి నెల నుంచి ఇంతవరకు చేసిన పనులకు వేతనాలు ఇవ్వడం లేదు. దీంతో ఎలా బతకాలని కూలీలు ప్రశ్నిస్తున్నారు.
అధికారుల ఊకదంపుడు ప్రచారం
వలస వెళ్లొద్దు ఉన్న ఊర్లోనే ఉపాధి కల్పిస్తామని అధికారులు గ్రామాలకు వెళ్లి ఊకదంపుడు ప్రచారం చేస్తున్నారని కూలీలు అంటున్నారు. తీరా పనికి వేస్తే ఇలా నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
సిబ్బందికి కూడా జీతాలు లేవు
ఇటు కూలీలకే కాదు ఉపాధి పథకం కింద పనిచేసే సిబ్బంది మేటీలు, ఫీల్డ్ అసిస్టెంట్లకు కూడా జీతాలు లేవు. దీంతో ఇటు కూలీలకు సమాధానం చెప్పలేక, ఉపాధి సిబ్బంది కూడా తలలు పట్టుకుంటున్నారు. కూలీల సంఖ్య తగ్గితే అధికారులు ఒత్తిడి తెస్తున్నారని, తీరా పనిచేసిన వారికి వేతనాలు ఇవ్వకపోతే వారు ఎలా పనికి వస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేతనాలు, జీతాలు రాకపోవడం వాస్తవమే
ఉపాధి కూలీలకు నాలుగు నెలలుగా వేతనాలు, మూడు నెలలుగా ఉద్యోగులకు జీతాలు రాకపోవడం వాస్తవమే. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడింది. ఈ విషయాన్ని జిల్లా, రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం. - పక్కీరప్ప, ఏపీడీ, ఆలూరు
Updated Date - May 13 , 2025 | 12:34 AM