నమో.. నారసింహ...
ABN, Publish Date - Mar 14 , 2025 | 11:43 PM
భక్తుల గోవింద నామస్మరణ, మంగళ వాయిద్యాల మధ్య దేవదేవుని రథోత్సవం శుక్రవారం కన్నులపండువగా సాగింది.
వైభవంగా ప్రహ్లాద వరద స్వామి రథోత్సవం
భక్త జనసంద్రంగా మారిన అహోబిల క్షేత్రం
ఆళ్లగడ్డ(శిరివెళ్ల), మార్చి 14(ఆంధ్రజ్యోతి) : భక్తుల గోవింద నామస్మరణ, మంగళ వాయిద్యాల మధ్య దేవదేవుని రథోత్సవం శుక్రవారం కన్నులపండువగా సాగింది. అహోబిలం బ్రహ్మోత్సవాల్లో భాగంగా దిగువ అహోబిల క్షేత్రంలో శ్రీదేవి, భూదేవి సమేత ప్రహ్లాద వరదస్వామి ఉత్సవమూర్తులు కొలువైన బ్రహ్మరథం ఆలయ మాడవీధుల్లో కదిలి వస్తుండగా భక్తులు తన్మయం చెందారు. శ్రీదేవి, భూదేవి సమేత ప్రహ్లాద వరద స్వామిని పట్టువస్త్రాలు, స్వర్ణాభరణాలు, పూలమాలలతో విశేషంగా అలంకరించి రథంపై కొలువుదీర్చారు. అహోబిలేశుడు ఉభయ దేవేరులతో కలిసి రథాన్ని అధిష్టించి తిరువీధుల్లో విహరిస్తుండగా దిగువ అహోబిల క్షేత్రం భక్త జనసంద్రంగా మారింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో ఉభయ దేవేరులతో కొలువైన జ్వాలా నరసింహస్వామి ఉత్సవమూర్తులకు అభిషేకం, అర్చన, తిరుమంజనం నిర్వహించారు. రాత్రి వైభవంగా పుష్పయాగోత్సవం నిర్వహించారు.
Updated Date - Mar 14 , 2025 | 11:43 PM