పెరగనున్న పుర ఆదాయం
ABN, Publish Date - May 28 , 2025 | 12:15 AM
పురపాలక సంఘం ఆదాయాన్ని పెంచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. పట్టణ పరిధిలో నూతనంగా నిర్మించిన, అదనంగా నిర్మంచిన వాటిని గుర్తించేందుకు సిబ్బంది సర్వే ప్రారంభించారు.
ఆస్తి పన్నుల మదింపుపై సర్వే
పాత, తక్కువ ఉన్న భవనాల పన్నుల పెంపు
ఆదోని టౌన్, మే 27(ఆంధ్రజ్యోతి): పురపాలక సంఘం ఆదాయాన్ని పెంచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. పట్టణ పరిధిలో నూతనంగా నిర్మించిన, అదనంగా నిర్మంచిన వాటిని గుర్తించేందుకు సిబ్బంది సర్వే ప్రారంభించారు. ఆస్తిపన్నులలో తేడాలను గమనించి, నిర్మాణ పరిధి కన్నా తక్కువగా పన్నులు చెలిస్తున్నట్లు గమనిస్తే గెజిట్ ప్రకారం సరి చేయడానికి అధికారులు చర్యలు తీసుకోనున్నారు.
పాత పన్నులే చెల్లింపు..
పాత, మట్టి భవనాల స్థానంలో, నూతన గృహాలు నిర్మించుకున్న యజమానుల పాత పన్నులే చెల్లిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని అధికారుల దృష్టికి రాకపోవడం, మరికొన్ని చోటా నాయకుల జోక్యం ఉండటంతో పుర ఆదాయానికి గండి పడుతోంది.
పన్నుల పరిధిలో లేనివి
అధికారిక లెక్కల ప్రకారం పట్టణంలో 35,500 నివాసిత, వాణిజ్య, పారిశ్రామిక నిర్మాణాలు ఉన్నాయి. 37 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 2 లక్షల జనాభా ఉన్న పట్టణంలో 35,500 అసెస్మెంట్లు మాత్రమే ఉన్నాయి. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యవేక్షించని కారణంగా చాలా వాటికి పన్నులు వేయలేదని తెలుస్తోంది.
పన్నులు భారీగా పెరిగే అవకాశం
ప్రస్తుతం మున్సిపాలిటీకి ఏడాదికి రూ.12 కోట్లు ఆస్థిపన్నుల నుంచి ఆదాయం వస్తోంది. స్థానిక నాయకుల ప్రమేయం, ఒత్తిడి లేకుండా, పకడ్భం దీగా సర్వే చేస్తే రూ.2.5కోట్ల మేర పెరిగే అవకాశం ఉందని పుర అధికారులు అంచనాలు వేస్తున్నారు.
ప్రభుత్వ ఆదేశాలతో సర్వే
ప్రభుత్వ ఆదేశాలతో ఆస్థిపన్నుల పై సర్వే నిర్వహించి, ముదింపు చేస్తున్నాం. పన్నులు లేని వారిని పన్నుల పరిధిలోకి తీసుకువచ్చి, తక్కువ చెల్లిస్తున్న వారి పన్నులను సరిచేస్తాం. ప్రజలు సహకరిస్తే, పుర ఆదాయం పెరిగే అవకాశం ఉంది. - నాసిర్ అహ్మద్, ఆర్వో, పురపాలక సంఘం, ఆదోని.
Updated Date - May 28 , 2025 | 12:15 AM