ఉచిత విద్యకు కొర్రీలు..!
ABN, Publish Date - Jun 27 , 2025 | 11:56 PM
పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్య అందించాలనే విద్యాహక్కు చట్టానికి జిల్లాలో పలు ప్రైవేటు విద్యా సంస్థలు తూట్లు పొడుస్తున్నాయి.
విద్యార్థులకు ప్రవేశం కల్పించని ప్రైవేట్ స్కూళ్లు
ఆందోళనలో తల్లిదండ్రులు.. డీఈవో కార్యాలయం ముట్టడి
జిల్లాలో 262 స్కూళ్లకు విద్యా శాఖ నోటీసులు
2,235 మంది పేద విద్యార్థులకు ‘ఉచిత విద్య’ ప్రశ్నార్థకం
కర్నూలు, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్య అందించాలనే విద్యాహక్కు చట్టానికి జిల్లాలో పలు ప్రైవేటు విద్యా సంస్థలు తూట్లు పొడుస్తున్నాయి. లేనిపోని కొర్రీలు పెడుతూ విద్యాహక్కు చట్టం కింద ఎంపికైన విద్యార్థులకు పాఠశాలల్లో అడ్మిషన్లు ఇవ్వడం లేదు. ధ్రువీకరణ పత్రాలు సమర్పించినా పలు పాఠశాలల యాజమా న్యాలు కుంటిసాకులతో అవాంతరాలు సృష్టిస్తూ ఉద్దేశపూర్వకంగా తిరస్కరి స్తుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పైసా ఖర్చు లేకుండా తమ పిల్లలకు పదేళ్లు ఉచిత విద్య అందుతుందని భావిస్తే.. ఫ్రీ సీటు అయినా సరే ఫీజులు కట్టాల్సిందేనని యాజమాన్యాలు అంటున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్తును కాపాడాలని శుక్రవారం తల్లిదండ్రులు డీఈవో కార్యాలయాన్ని ముట్టడించారు. డీఈవో శామ్యూల్ పాల్ను నిలదీశారు. విద్యాహక్కు చట్టం(ఆర్టీఐ) కింద ఉచిత విద్య అందించా లని జిల్లాలో తొలి విడతలో 384 పాఠశాలలకు 2,289 మంది విద్యార్థులను కేటాయించారు. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఈ నెల 5లోగా అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించారు. నెల రోజులైనా ఇప్పటి వరకు కేవలం 1,110 మంది విద్యార్థులకే ప్రవేశం కల్పించారు. 1,179 మంది విద్యార్థులకు వివిధ కొర్రీలు పెట్టి అడ్మిషన్లు తిరస్కరిస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. అత్యధికంగా కర్నూలు అర్బన్ పరిధిలో 91 పాఠశాలల్లో 840 విద్యార్థులను కేటాయిస్తే 362 మందికి, కల్లూరు అర్బన్ పరిధిలో 71 పాఠశాలలకు 463 మంది విద్యార్థులను కేటాయిస్తే 160 మందికి, ఆదోనిలో 71 పాఠశాలలకు 320 మందిని కేటాయిస్తే.. 238 విద్యార్థులకే అడ్మిషన్లు ఇచ్చారు. కర్నూలు, కల్లూరు అర్బన్ పరిధిలో 781 మంది విద్యార్థులకు ఉచిత విద్య అందని ద్రాక్షగా మారింది. రెండో విడతలో 173 పాఠశాలలకు 1,059 విద్యార్థులను కేటాయించారు. అత్యధికంగా కర్నూలు అర్బన్ పరిధిలో 52 పాఠశాలలకు 453, కల్లూరు అర్భన్ పరిధిలో 46 పాఠశాలలకు 331 విద్యార్థులను కేటాయించారు. మా పిల్లలకు ఉచిత విద్య అందించాలని గర్జించారు. కుంటిసాకులతో కొర్రీలు పెడతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలతో డీఈవో సమావేశం అయ్యారు. కాగా.. రెండేళ్లుగా తమకు ప్రభుత్వం ఆర్టీఐ బకాయిలు చెల్లించలేదు.. అప్పులు చేసి ఉచిత విద్యను అందించడం ఎలా సాధ్యం..? అని ప్రైవేటు పాఠశాలల యజమానులు కొందరు వాపోతున్నారు.
పుస్తకాలు కూడా ఇవ్వడం లేదు
రెక్కాడితే తప్ప పూటగడవని పేదరికం మాది. మా కూతురు మధుప్రియకు ఒకటో తరిగతిలో అడ్మిషన్ కోసం విద్యా హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తే.. అబ్బాస్నగర్లో ఉన్న రవీంద్ర విద్యానికేతన్ పాఠశాలకు కేటాయించారు. ఈ నెల 5న ధ్రువీకరణ పత్రాలు అందజేశాం. అడ్మిషన్ ఇవ్వడం లేదు. పుస్తకాలైనా ఇవ్వండి సారూ.. అని వేడుకున్నా ఇవ్వడం లేదు.
- లక్ష్మన్న, అబ్బాస్ నగర్, కర్నూలు
తొలి విడత సీట్లు రద్దు చేశారంటున్నారు
మా అబ్బాయి ఎస్. హరితేజ్కు ఎన్ఆర్ పేటలో ఉన్న సెయింట్ జోసఫ్ ఇంగ్లీష్ స్కూల్లో విద్యా హక్కు చట్టం కింద ఒకటో తరగతిలో మే 29న సీటు కేటాయించారు. ఈ నెల 5లోగా అవసరమైన ధ్రువీకరణ పత్రాలు అందజేశాను. ఇప్పటి వరకు అడ్మిషన్ ఇవ్వలేదు. పాఠశాలలో అడిగితే తొలి విడత సీట్లు రద్దు చేశారు అంటున్నారు. ఇదెక్కడి న్యాయం?
- ఎస్.కేశవ్, కీర్తి దంపతులు, ఎన్ఆర్ పేట, కర్నూలు
ఫోన్ చేసినప్పుడు రండి అంటున్నారు
1వ తరగతిలో అడ్మిషన్ కోసం విద్యా హక్కు చట్టం కింద మా అబ్బాయి ప్రదీప్ను డీడీ పాడులో ఉన్న అథినా స్కూల్కు కేటాయించారు. అక్కడికి వెళితే ఫోన్ చేసినప్పుడు రండి అంటున్నారు. మీకు కేటాయించిన సీటు రద్దు అయ్యిందని అంటున్నారు. సరైన సమాధానం చెప్పడం లేదు. ఎంఈవో దృష్టికి తీసుకెళ్లినా రెస్పాండ్ అవ్వడం లేదు.
- ఎం. రాజు, పందిపాడు, బీఆర్రెడ్డి కాలనీ
రెండో విడతలో అందరికి ప్రవేశాలు కల్పిస్తాం
తొలి విడతలో 384 పాఠశాలలకు 2,289 మంది విద్యార్థులను కేటాయిస్తే 1,110 మంది విద్యార్థులకే ప్రవేశం కల్పించారు. 1,179 మంది అడ్మిషన్లు ఇవ్వలేదు. 262 పాఠశాలలకు నోటీసులు జారీ చేశాం. తొలి విడత సీట్లు రద్దు చేశారు. రెండో విడతలో 1,059 మంది విద్యార్థులకు ఉచిత విద్య సీట్లు కేటాయించాం. రెండో విడతలో అందరికీ ప్రవేశం కల్పించేలా చర్యలు తీసుకుంటాం.
- శామ్యూల్ పాల్, డీఈవో, కర్నూలు
Updated Date - Jun 27 , 2025 | 11:56 PM