‘సీమ‘కు సాగునీరందించింది టీడీపీయే
ABN, Publish Date - Jul 18 , 2025 | 11:22 PM
రాయలసీమకు సాగునీరు అందించిన ఘనత టీడీపీదేనని రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.
రైతుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న దివంగత ఎన్టీఆర్
వైసీపీ పాలనలో ప్రాజెక్టు గేట్లకు గ్రీస్ కూడా పెట్టలేదు
రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి
‘గాలేరు-నగరి’కి ఐదువేల క్యూసెక్కుల నీటి విడుదల
పాములపాడు, జూలై 18 ( ఆంధ్రజ్యోతి) : రాయలసీమకు సాగునీరు అందించిన ఘనత టీడీపీదేనని రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని బనకచెర్ల క్రాస్ హెడ్ రెగ్యు లేటర్ వద్ద నందికొట్కూర్, శ్రీశైలం ఎమ్మెల్యేలు జయసూర్య, బుడ్డా రాజశేఖరరెడ్డితో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించి బటన్ నొక్కి ‘గాలేరు-నగరి’కి ఐదువేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. గంగమ్మకు పసుపు, కుంకుమ, చీర, పూలు సారె సమర్పించి జలహారతి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ మాట్లాడుతూ రాయలసీమలో తెలుగుంగను ఏర్పా టుచేసి వేల ఎకరాల బంజరు భూములను సాగులోకి తీసుకొచ్చి రైతుల హృదయాలలో చెరగని ముద్రవేసుకొన్న మహనీయుడు దివంగత ఎన్టీ రామారావు అని అన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి 25 వేల క్యూసెక్కులు నీరు విడుదల చేస్తుండటంతో వాటిని వీబీఆర్కు 20వేలు, జీఎన్ఎస్ఎస్కు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. గోరుకల్ రిజర్వాయురు నీటి సామర్థ్యం 5టీఎంసీలు ఉండేదని, 2014-2019 టీడీపీ హయాంలో కోట్ల రూపాయలు వెచ్చించి 13 టీఎంసీలకు పెంచి ఆ ప్రాంత రైతులకు సాగు, త్రాగు నీటిని అందించిన ఘనత ఒక్క టీడీపీకే దక్కిందన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రాజెక్టుల గేట్లకు కనీసం గ్రీస్కు కూడా పెట్టలేదని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.22కోట్లు మరమ్మతు లకు కేటాయించిందన్నారు. కడప, చిత్తూరు, పులివెందుల, గండికోటతో పాటు ఇతర ప్రాంతాలకు తెలుగుగంగ ద్వారా కొన్నివేల ఎకరాలకు బనకరెర్ల క్రాస్ హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటిని విడుదల చేస్తామన్నారు. కార్యక్రమంలో సీఈ కబీర్బాషా, ఎస్ఈ శుభకుమార్, ఈఈ వేణుగో పాల్, డీఈ, ఎఈలు, ఆర్డీవో నాగజ్యోతి, డీఎస్పీ రామాంజినాయక్, సీఐ సురేశ్కుమార్ రెడ్డి, ఎస్ఐలు సురేశ్బాబు, సురేశ్, టీడీపీ నాయకులు తిమ్మారెడ్డి, వెంకటేశ్వర్లు యాదవ్, మధు, లింగేశ్గౌడ్, పూసలక్రిష్ణ, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 18 , 2025 | 11:22 PM