వానాకాలంలో జాగ్రత్త!
ABN, Publish Date - May 29 , 2025 | 12:49 AM
రుతుపవ నాల రాకతో వర్షాలు ప్రారంభమయ్యాయి. వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చల్లబడి గాలులు వీస్తున్నాయి.
డెంగీ, మలేరియా ప్రబలే అవకాశం
దోమలు వృద్ధి చెందకుండా చూసుకోవాలి
జ్వరం, కళ్లు తిరిగితే నిర్లక్ష్యం చేయవద్దంటున్న వైద్యులు
ఆలూరు, మే28(ఆంధ్రజ్యోతి): రుతుపవ నాల రాకతో వర్షాలు ప్రారంభమయ్యాయి. వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చల్లబడి గాలులు వీస్తున్నాయి. ఈ వాతావరణ మార్పులతో చిన్నారులు, వృద్ధులు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటంతో రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. దీన్ని నివారించేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
సీజనల్ వ్యాధులు
వాతావరణంలో మార్పుల వల్ల ఆస్తమా, ఎలర్జీ, గొంతునొప్పి, తుమ్ములు రావడం, న్యూమో నియా, బ్రాంకైటీస్, ముక్కు కారడం వంటి సమస్యలు వస్తాయి. నీరు నిలిచిన ప్రాంతాల్లో దోమలు వృద్ధి చెంది డెంగీ, మలేరియా ప్రబలే అవకాశం ఉంది. వాంతులు, విరేచనాలు, టైఫాయిడ్ లక్షణాలు కనిపిస్తాయి. మైగ్రేన్ ఉన్న వారికి మరింత ఇబ్బందిగా ఉంటుంది.
వైద్యుల సూచనలు
రోగ నిరోధక శక్తిని పెంచేందుకు విటమిన్ సీ అధికంగా ఉన్న నిమ్మ, నారింజ, బత్తాయి పళ్ల రసాలు, ఆకుకూరలు తీసుకోవాలి.
వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి. దీంతో గాలి నుంచి వచ్చే ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు.
వెచ్చటి దుస్తులు ధరించాలి. వృద్ధులు బయట తిరగకూడదు. రక్తపోటు, మధుమేహ వ్యాధిగ్రస్తులు పరీక్షించుకుంటూ ఉండాలి.
నూనె పదార్థాలు తక్కువగా తీసుకోవాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి
బయటకు వెళ్లే సమయంలో తప్పక మాస్క్ ధరించాలి.
చేతులు కడుకున్నాకే భోజనం చేయాలి.
ఇబ్బందిగా ఉంటే వైద్యులను సంప్రదించాలి
జ్వరం, కళ్లు తిరగడం లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దు. సొంత వైద్యం మాని, వైద్యులను సంప్రదించి వైద్యసేవలు పొందాలి. వైద్యులు సూచించిన మందులను మాత్రమే వాడాలి. సామాజిక మాధ్యమాల్లో చూసిన వాటిని అనుసరించద్దు, అందరి శరీరతత్వాలు ఒకేలా ఉండవు. - డా. వహీద్, వైద్యాధికారి, ఆలూరు
Updated Date - May 30 , 2025 | 03:10 PM