కాలువలు కబ్జా
ABN, Publish Date - Jul 04 , 2025 | 11:38 PM
ఆక్రమణలకు హద్దేముంది? సాగునీటి కాలువలపై కూడా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
ఎమ్మిగనూరు, పెద్దహరివాణంలో ఎల్లెల్సీ డిస్ట్రిబ్యూటరీ కాలువపై షెడ్లు
సి. బెళగల్లో చెరువు కాలువ కబ్జా
కర్నూలులో దర్జాగా హంద్రీ ఆక్రమణలు
తొలగించాలని టెలీ కాన్ఫరెన్స్లో జేసీ నవ్య ఆదేశం
అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం
ఆక్రమణలకు హద్దేముంది? సాగునీటి కాలువలపై కూడా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. కైకలూరు పట్టణంలోని ఓ కాలువపై అక్రమంగా వంతెన నిర్మించిన కేసులో రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆక్రమణలు గుర్తించి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగానే శుక్రవారం జాయింట్ కలెక్టర్ బి. నవ్య జిల్లాలో హంద్రీ, ఎల్లెల్సీ, మైనర్ ఇరిగేషన్ చెరువుల ఆక్రమణలను తొలగించాలని జలవనరుల శాఖ ఇంజనీర్లను ఆదేశించారు. తాత్కాలిక నిర్మాణాలు, షెడ్లు తొలగించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆ వివరాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.
కర్నూలు, జూలై 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నిత్యం కరువుతో తల్లడిల్లే పశ్చిమ ప్రాంతం జలజీవనాడి తుంగభద్ర దిగువ కాలువ. ఎమ్మిగనూరు పట్టణం, కర్నూలు నగరంతో పాటు వివిధ ప్రధాన గ్రామాల్లో ఈ కాలువ ప్రవహిస్తుంది. ఒక్కప్పుడు పట్టణాలు, గ్రామాలకు దూరంగా ఉన్న డిస్ట్రిబ్యూటరీ (డీపీ) కాలువలు జనవాసాలు పెరగడంతో నివాసాలు మధ్యలోకి వచ్చాయి. ఎమ్మిగనూరు పట్టణంలో టీబీపీ ఎల్లెల్సీ డీపీ-79 కాలువ ఎస్ఎస్ ట్యాంక్ నుంచి లక్ష్మణ్ సినిమా థియేటర్, ఓంశాంతి కూడలి, వ్యవసాయ మార్కెట్ యార్డు మీదుగా ముగతి వరకు ప్రవహిస్తుంది. కాలువ వెడల్పు 10 అడుగులు, కుడి గట్టు 33 అడుగులు, ఎడమ గట్టు 13 అడుగులు కలిపి 56 అడుగుల వెడల్పుతో ఉన్న డీపీ-79 కెనాల్ ఎక్కడికక్కడ ఆక్రమణలకు గురై కుచించుకుపోయింది. ఇప్పుడు ఈ కాలువ 10-15 అడుగులు కూడా లేదు. బళ్లారి-జడ్చర్ల వయా ఆదోని, ఎమ్మిగనూరు జాతీయ రహదారి-167 ఈ కాలువ పక్కనే ఉంది. దీంతో వాణిజ్య పరంగా డిమాండ్ పెరిగింది. రాజకీయ అండదండలతో కాలువ గట్లను ఆక్రమించేశారు. తాత్కాలిక రేకుల షెడ్లు నిర్మించుకొని వివిధ వ్యాపారాలు చేస్తున్నారు. కొందరు రాజకీయ బడాబాబులే ఆక్రమించి రేకుల షెడ్లు వేసి బాడుగకు ఇచ్చారని తెలుస్తున్నది. లక్ష్మణ్ సినిమా థియేటర్, ఓంశాంతి సర్కిల్, మార్కెట్ యార్డు సర్కిల్ వద్ద కాలువపై ఆక్రమణలు దాదాపు వందకు పైగా ఉన్నాయని సమాచారం. ఆదోని మండలం పెద్దహరివారం గ్రామంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఆదోని-సిరుగుప్ప ప్రధాన రహదారిలో డిమాండ్ ఉండడ డంతో ఎల్లెల్సీ డీపీ-65 కాలువ (ఫీల్డ్ ఛానల్) గట్టను కొందరు ఆక్రమించి 10-15 తాత్కాలిక షెడ్లు హంద్రీ ఇరువైపు 338 ఆక్రమణలుసుకున్నట్లు గుర్తించారు. మండల కేంద్రం సి. బెళగల్లో చెరువు స్థలం, ఫీల్డ్ ఛానల్ కబ్జా చేసి తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసుకున్నారని ఇరిగేషన్ అధికారులు గుర్తించారు.
కర్నూలు నగరంలో హంద్రీ నది కుడి గట్టు (రైట్ బ్యాంక్) వైపు 164 ఆక్రమణలు గుర్తించారు. ఓ బడా రియల్టర్ సర్వే నంబరు 424/ఏ, 470/బిలో 15 ప్లాట్లు వేసి పక్కా భవనాలు నిర్మించారని. సర్వే నంబరు.470/బిలో 25 ప్లాట్లలో బెస్మట్టం వరకు నిర్మాణాలు చేపట్టారని, ఇవి ఆక్రమిత స్థలం, బఫర్ జోన్లో ఉన్నాయని ఇరిగేషన్ అధికారులు గుర్తించి నివేదిక ఇచ్చారు. సర్వే నంబరు.740/బి, 498/ఎ, 533, 24 పరిధిలో పలువురు 1.25 సెంట్లలో పక్కాభవనాలు, రేకుల షెడ్లు ఏర్పాటు చేసుకోగా, కొందరికి రెవిన్యూ అధికారులు డి-పట్టా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓ వెంచర్ యజమాని 40 సెంట్లు హంద్రీ నది ప్రభుత్వ పోరంబోకు భూవి ఆక్రమించినట్లు గుర్తించారు. ఎడమ గట్టు (లెఫ్ట్ బ్యాంక్) వైపు 174 ఆక్రమణలు ఉంటే.. మెజార్టీగా ఆర్సీసీ భవనాలు నిర్మించుకున్నారు. సర్వే నంబరు.770/ఎఫ్లో ఓ ఫైనాన్స్ సంస్థ భవనం కొంతభాగం హంద్రీ నది ఒడ్డున ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రెండు నెలలు క్రితం జలవనరుల శాఖ ఎఫ్ఆర్ఎల్ డివిజన్ ఇంజనీర్లు, రెవిన్యూ అధికారులు సర్వే చేసిన హంద్రీ సరిహద్దులు గుర్తించి బౌండరీ పిల్లర్లు పాతారు.
ఆక్రమణలపై జేసీ సీరియస్
కర్నూలు నగరంలో హంద్రీ ఆక్రమణలు, ఆదోని మండలం పెద్దహరివాణం, ఎమ్మిగనూరు పట్టణంలో టీబీపీ ఎల్లెల్సీ డీపీ-65, 79 కాలువలపై తాత్కాలిక ఆక్రమణ తక్షణమే తొలగించాలని జాయింట్ కలెక్టర్ (జేసీ) బి. నవ్య జలవనరుల అధికారులను ఆదేశించారు. కళ్లముందే కాలువ గట్టు ఆక్రమిస్తుంటే కళ్లకు గంతలు కట్టుకున్నారా..? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కైకలూరులో కాలువపై ఆక్రమ వంతెన నిర్మాణంపై హైకోర్టు సీరియస్ కావడంతో జిల్లాలో కాలువలు, నదుల ఆక్రమణలపై జేసీ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాత్కాలిక షెడ్లను తక్షణం తొలగించాలని, పక్కా భవనాలకు నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. అయితే.. నగరంలో మునగాలపాడు నుంచి పరిదంపాడు వరకు కేసీ కాలువ గట్లు ఇరువైపు కబ్జాకు గురయ్యాయి. శాశ్వత భవనాలు నిర్మించుకున్నారు. ఉల్చాల రోడ్డు, రేడియో స్టేషన్, ఆటో నగర్, బాబు జగ్జీవన్రాం కాలనీ ప్రాంతాల్లో రూ.కోట్లు విలువైన టీబీపీ కర్నూలు బ్రాంచి కెనాల్ ఆక్రమణల వల్ల కాల్వ కనుమరుగైంది. వీటిపై జేసీ చర్చించకపోవడం కొసమెరుపు.
నోటీసులు జారీ చేసి తొలగిస్తాం
ఆదోని మండలం పెద్దహరివాణం, ఎమ్మిగనూరు పట్టణాల్లో ఎల్లెల్సీ డీపీ-65, 79 కాలువ గట్లు కబ్జాలకు గురైన మాట నిజమే. తాత్కాలిక షెడ్లు వేసుకొని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. నోటీసులు జారీ చేసి వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం.
పాండురంగయ్య, టీబీపీ ఎల్లెల్సీ ఈఈ ఆదోని, ఎస్ఈ, హంద్రీనీవా కర్నూలు సర్కిల్-1
Updated Date - Jul 04 , 2025 | 11:38 PM