విద్యుత్ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు
ABN, Publish Date - May 20 , 2025 | 11:56 PM
పట్టణంలోని రైతునగరంలో నివసిస్తున్న విద్యుత్ ఏడీఈ రవికాంత్చౌదరి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
రవికాంత్ భార్య లాకర్లో 2.825 కేజీల బంగారు ఆభరణాలు
స్వాధీనం చేసుకున్న అధికారులు
వీటి విలువ సుమారు రూ.2.8కోట్లు ఉంటుందని అంచనా
రైతునగరంలో సుమారు రూ.3కోట్ల విలువైన ఇళ్లు
నంద్యాల టౌన్, మే 20(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని రైతునగరంలో నివసిస్తున్న విద్యుత్ ఏడీఈ రవికాంత్చౌదరి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల రుద్రవరం మండలం చిన్నకంబలూరులో ఆళ్లగడ్డ విద్యుత్ ఏడీఈ రవికాంత్చౌదరి రూ.30వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. మంగళవారం ఏసీబీ డీఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈనెల 16వ తేదీ లంచం తీసుకుంటూ పట్టుబడ్డ విద్యుత్ ఏడీఈ రవికాంత్చౌదరి, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ప్రతాప్ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈనెల 17వ తేదీన ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. అదేరోజు రైతు నగరంలోని రవికాంత్చౌదరి ఇంట్లో సోదాలు చేసి విలువైన పత్రాలు, ఎల్ఐసీ బాండ్లు, ఎఫ్డీలు స్వాధీనం చేసుకున్నారు. ఆయన భార్య ఆరోజు ఊర్లో లేరు. దీంతో మంగళవారం వచ్చారన్న సమాచారం మేరకు సోదాలు చేసి ఆమెను విచారించారు. ఆమె పేరు మీద ఓపబ్లిక్ సెక్టార్ బ్యాంకులో లాకర్లు ఉన్నట్లు గుర్తించారు. అక్కడ సోదాలు చేసి 2.825 కేజీల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో వజ్రాలతో పొదిగిన హారం ఉండడం విశేషం. 41 రకాల బంగారు ఆభరణాలు ఉండగా వీటి విలువ రూ.2.8కోట్లు ఉంటుందని ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపారు. రైతు నగరంలోని ఇళ్లు సుమారుగా 4.4 స్వైయర్ ఫీట్ల్లో ఉందని, వాటి విలువ సమారుగా రూ.2నుంచి 3కోట్లు ఉంటుందని అన్నారు. ఇంకా విచారణ కొనసాగుతుందని తెలిపారు. ఈ సోదాల్లో సీఐలు కృష్ణయ్య, శ్రీనివాసులు, సిబ్బంది దొరబాబు, విశ్వనాథ్, రాముడు, పరుశురాముడు పాల్గొన్నారు.
Updated Date - May 20 , 2025 | 11:56 PM