కొత్త బస్సులకు గ్రీన్సిగ్నల్
ABN, Publish Date - May 23 , 2025 | 12:38 AM
కొత్తగా కొన్న ఆర్టీసీ బస్సులకు మార్గం సుగమమైంది. ఈ బస్సులొచ్చి చాలాకాలం కావస్తున్నా రిజిసే్ట్రషన్ చేయడానికి రవాణా శాఖ అభ్యంతరం వ్యక్తం చేయటంతో రోడ్లపై తిరగలేని పరిస్థితి ఏర్పడింది.
రెండు నెలల తర్వాత రిజిసే్ట్రషన్ చేసిన రవాణా శాఖ
ఫైర్ ప్రొటెక్టివ్ సిస్టమ్ లేకపోవడం వల్ల మొదట్లో అభ్యంతరం
ఫైర్ డిటెక్టివ్ అలారం ఏర్పాటుకు ఆర్టీసీ అంగీకారం
ఇప్పటికి రిజిసే్ట్రషన్ ప్రక్రియ పూర్తి
త్వరలో రీజియన్ పరిధిలోని డిపోలకు కేటాయింపు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : కొత్తగా కొన్న ఆర్టీసీ బస్సులకు మార్గం సుగమమైంది. ఈ బస్సులొచ్చి చాలాకాలం కావస్తున్నా రిజిసే్ట్రషన్ చేయడానికి రవాణా శాఖ అభ్యంతరం వ్యక్తం చేయటంతో రోడ్లపై తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ఫైర్ ప్రొటెక్టివ్ సిస్టమ్ (ఎఫ్పీఎస్) ఏర్పాటు చేస్తేనే బస్సులకు రిజిస్ర్టేషన్ చేస్తామని రవాణా శాఖాధికారులు చెప్పటంతో కొత్త బస్సులకు రిజిస్ర్టేషన్ ఆగిపోయింది. దాదాపు రెండు నెలలకు పైగా బస్సులకు రిజిస్ర్టేషన్ జరక్కపోవడంతో ఆర్టీసీకి నష్టం జరిగింది. ఎట్టకేలకు కొత్త బస్సులు రోడ్లపైకి వచ్చే దారి ఏర్పడింది. ఫైర్ డిటెక్టివ్ అలారం (ఎఫ్డీఏ) ఏర్పాటుకు ఆర్టీసీ అంగీకరించింది. తొలుత ఎఫ్డీఏ విధానానికి రవాణా శాఖ అధికారులు అంగీకరించలేదు. కానీ, ఎఫ్పీఎస్ ఏర్పాటు చేయాలంటే బస్సు బాడీ బిల్డింగ్ పూర్తి చేసుకున్నాక కుదరదని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు బాడీ బిల్డింగ్ పూర్తయిన బస్సుకే మినహాయింపు ఇస్తూ రవాణా శాఖ అధికారులు రిజిస్ర్టేషన్ చేయటానికి అంగీకరించారు. దీంతో ఆర్టీసీ అధికారులు కొత్త బస్సుల్లో ఫైర్ డిటెక్టివ్ అలారంను ఏర్పాటు చేశారు. బస్సులన్నింటికీ రిజిస్ర్టేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. వాటిని రీజియన్ పరిధిలోని జగ్గయ్యపేట, తిరువూరు, ఆటోనగర్, విజయవాడ బస్ డిపోలకు తరలించారు.
మొత్తం 75 సూపర్ లగ్జరీ బస్సులు
ఎన్టీఆర్ జిల్లాకు తొలిదశలో 75 సూపర్ లగ్జరీ బస్సులు వచ్చాయి. ఈ బస్సులన్నీ హైఎండ్ శ్రేణిలోనివే. వీటికి దాదాపు రెండు నెలల పాటు రిజిస్ర్టేషన్ జరక్కపోవటం వల్ల నష్టం వాటిల్లింది. ఇటీవల రోడ్డు సేఫ్టీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ప్రయాణికులను తరలించే రవాణా వాహనాలకు కచ్చితంగా ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్ (ఎఫ్పీఎస్)ను ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. అయితే, ఈ నిబంధనలు రాక ముందే ఆర్టీసీ కొత్త బస్సులకు ఆర్డర్ ఇచ్చేసింది. ఆ బస్సులు డెలివరీ కావటానికి జాప్యం జరిగింది. చాసిస్లకు బాడీ బిల్డింగ్కు ఇచ్చిన తర్వాత ఆదేశాలు వచ్చాయి. ఈ ఆదేశాల గురించి ఆర్టీసీ అధికారులకు అవగాహన లేకపోవటం వల్ల బాడీ బిల్డింగ్ పూర్తి చేసుకున్న బస్సులను రిజిస్ర్టేషన్ చేయించటానికి పంపగా, రవాణా శాఖ అధికారులు తిరస్కరించారు. ఎఫ్పీఎస్ను ఏర్పాటు చేస్తేనే రిజిస్ర్టేషన్ చేస్తామని చెప్పారు.
ఎఫ్పీఎస్ అంటే..
ఎఫ్పీఎస్ అనేది ప్రయాణికుల భద్రత కోసం ఏర్పాటు చేసే వ్యవస్థ. ఇటీవల కాలంలో బస్సుల నుంచి పొగ వచ్చి కాలిపోతున్న ఉదంతాలను చూస్తున్నాం. ఇలాంటి సందర్భాల్లో ఈ వ్యవస్థ ద్వారా బస్సులో అగ్ని ప్రమాదాలను ముందే గుర్తించి ప్రయాణికులను అప్రమత్తం చేయటంతో పాటు బస్సును కూడా కాపాడవచ్చు. డ్రైవర్ క్యాబిన్, ప్రయాణికుల కంపార్ట్మెంట్లలో ఫైర్ ఎక్స్వింగ్విషర్స్ ఉపయోగిస్తారు. ఇవి అగ్ని ఎంత తీవ్రస్థాయిలో ఉన్నా మంటలను ఆర్పుతాయి. ఒకవేళ ఇంజన్ నుంచి మంటలు వచ్చినా ఫోమ్ను భారీగా వెదజల్లి ఆ బస్సు అగ్నికి ఆహుతి కాకుండా చేస్తాయి. ఒక ఎఫ్పీఎస్ ఏర్పాటుకు రూ.2 లక్షలు ఖర్చవుతుంది. అన్ని బస్సులకు ఈ బడ్జెట్ కేటాయించటం ఇప్పుడు ఆర్టీసీకి ఇబ్బందే. ఈ వ్యవస్థను బస్సు బాడీ బిల్డింగ్ సమయంలోనే ఏర్పాటు చేయాలి. కొత్త బస్సుల్లో ఏర్పాటు చేయాలంటే బాడీ బిల్డింగ్ మొత్తం తొలగించాలి. దీనికి ప్రతిగా ఫైర్ డిటెక్టివ్ అలారం (ఎఫ్డీఏ) ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ అధికారులు హామీ ఇచ్చారు. దీనిని డ్రైవర్ వద్ద ఏర్పాటు చేస్తారు. బస్సులో ఏ భాగం నుంచి పొగలు వచ్చినా అలారం మోగుతుంది. వెంటనే డ్రైవర్ ప్రయాణికులను అప్రమత్తం చేస్తాడు.
Updated Date - May 23 , 2025 | 12:38 AM