మూలపాడు పీఏసీఎస్లో నిధులు గోల్మాల్
ABN, Publish Date - May 27 , 2025 | 01:01 AM
ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం (పీఏసీఎస్)లో భారీ ఎత్తున నిధులు గోల్మాల్ అయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలకు బలం చేకూరేలా సోమవారం ఒక్కసారిగా కార్యాలయ ఆవరణలో కొన్ని పత్రాలు దహనమయ్యాయి.
రూ.కోటికి పైగా పక్కదారి పట్టిందంటున్న రైతులు
ఇటీవల రిటైర్ అయిన కార్యదర్శి పనేనని ఆరోపణ
పీఏసీఎస్లో ఒక్కసారిగా తగలబడిన రికార్డులు
ఆధారాలు లేకుండా చేశారనే విమర్శలు
ఇబ్రహీంపట్నం, మే 26 (ఆంధ్రజ్యోతి) : ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం (పీఏసీఎస్)లో భారీ ఎత్తున నిధులు గోల్మాల్ అయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలకు బలం చేకూరేలా సోమవారం ఒక్కసారిగా కార్యాలయ ఆవరణలో కొన్ని పత్రాలు దహనమయ్యాయి. అసలు తగలబెట్టిన కాగితాలు ఏమిటి? నిధులు స్వాహాపర్వం బయటపడే ఆధారాలేనా? అసలు ఇప్పుడెందుకు వాటిని తగలబెట్టాల్సి వచ్చింది.. అనే ప్రశ్నలకు సిబ్బంది నుంచి సమాధానాల్లేవు. ఇక్కడే పనిచేసి, ఈ మధ్యకాలంలో రిటైరైన ఉద్యోగి (కార్యదర్శి) ఈ నిధులు గోల్మాల్ చేశాడని రైతులు ఆరోపిస్తున్నారు. కేవలం రెండు, మూడు నెలల్లోనే ఈ గోల్మాల్ జరిగినట్లు వారు చెబుతున్నారు. తాము సొసైటీ నుంచి తీసుకున్న దీర్ఘకాలిక రుణాలను చెల్లించేశామని, వాటిని మాన్యువల్గా రసీదు రాసిచ్చి, రికవరీ చేసిన బకాయి సొమ్ము బ్యాంకులో జమ చేయకుండా, ఆన్లైన్ చేయకుండా మోసానికి పాల్పడినట్లు చెబుతున్నారు. ఇలా చేసిన ఆ ఉద్యోగి గత నెలాఖరున రిటైరయ్యారని, ఇన్చార్జికి బాధ్యతలు అప్పగించే సమయంలో బ్యాంకు నుంచి తెచ్చిన ఐదు రసీదు పుస్తకాల్లో నాలుగే అప్పగించి, ఒకటి తన వద్దే ఉంచుకున్నాడని ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న ఆడిట్లో ఈ విషయం వెలుగు చూసినట్లు బాధిత రైతులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, నిధులు గోల్మాల్ చేసిన ఉద్యోగిని నిలదీయగా, కొంత నగదు చెల్లించినట్లు తెలుస్తోంది.
పీఏసీఎస్లపై సడిలిపోతున్న నమ్మకం
ఒకప్పుడు పీఏసీఎస్లు అంటే రైతులకు ఎంతో నమ్మకం ఉండేది. కాలక్రమంలో అది సన్నగిల్లుతూ వస్తోంది. వైసీపీ ఐదేళ్ల పాలనలో త్రీమ్యాన్ కమిటీ విధానం పీఏసీఎస్లను ముంచేలా చేసింది. అప్పటివరకు పీఏసీఎస్లకు అధ్యక్షుడు, బాడీ ఉండేది. ఏదైనా జరిగితే వారు జవాబుదారీగా ఉండేవారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎన్నికలు లేకుండా ఏకంగా త్రీ మ్యాన్ కమిటీని పెట్టి ఐదేళ్లలో అనేక అక్రమాలు జరిగేందుకు దారి వేశారు. మూలపాడు పీఏసీఎస్లో జరిగిన కుంభకోణం వెనుక కూడా త్రీమ్యాన్ కమిటీ పాత్ర ఎంతవరకు ఉందనే సందేహాలు కలుగుతున్నాయి. గత ఏడాది రెడ్డిగూడెం మండలం కూనపరాజుపర్వ పీఏసీఎస్లో సుమారు రూ.1.5 కోట్ల నిధులు స్వాహా అయ్యాయి. అప్పట్లో అధికారులు ఆ డబ్బు రికవరీ చేయించారు. అంతకుముందు జి.కొండూరు పీఏసీఎస్లోను ఇలానే గోల్మాల్ వ్యవహారం బయటకు వచ్చింది. ఇప్పుడు మూలపాడు పీఏసీఎస్లో కూడా ఇలాగే జరగడంతో ఉన్నతాధికారులు ఎందుకు మిన్నకుంటున్నారనే అనుమానాలను రైతులు వ్యక్తం చేస్తున్నారు.
తనిఖీ చేశాక చెబుతాం..
ప్రస్తుతం సొసైటీలో ఆడిట్ జరుగుతోంది. రికార్డులు పూర్తిగా తనిఖీ చేశాక మాత్రమే నిధులు స్వాహా అయ్యిందీ, లేనిదీ చెబుతాం. ఇప్పుడు ఏ విషయం చెప్పలేం. ఒకవేళ నిధులు స్వాహా చేసి ఉంటే కచ్చితంగా చర్యలుంటాయి.
- స్వరూప, కేడీసీసీ బ్యాంకు మేనేజర్, ఇబ్రహీంపట్నం
Updated Date - May 27 , 2025 | 01:01 AM