తిరుగుబాటు లేఖ
ABN, Publish Date - Jun 26 , 2025 | 12:55 AM
గాంధీ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గం నిర్ణయాలపై బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ తిరుగుబాటు చేసింది. భూముల కొనుగోళ్ల పేరుతో సంస్థ రియల్ ఎస్టేట్ వ్యాపార పోకడలకు పోవటం, ప్రణాళికలు లేకుండా బ్రాంచీల విస్తరణ, అవసరాన్ని మించి సిబ్బందిని తీసుకోవటం వంటి చర్యలు సంస్థ మనుగడకు ప్రమాదకరంగా మారబోతున్నాయంటూ ఉద్యోగుల సంఘం పేరుతో బ్యాంకు సభ్యులకు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా లేఖలు రావటం కలకలం రేపుతోంది. ఈ లేఖలతో బ్యాంకు సభ్యుల్లో ఆందోళన ఏర్పడింది. దీంతో బ్యాంకు ఆర్థిక పరిస్థితులపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
గాంధీ కో-ఆపరేటివ్ బ్యాంక్లో ఉద్యోగుల ఉద్యమం
పాలకవర్గ నిర్ణయాలకు వ్యతిరేకంగా లేఖ విడుదల
బ్యాంకు సభ్యులందరికీ పంపడంపై చర్చ
బ్యాంకుకు నష్టమొస్తే ఉద్యోగులు బాధ్యులు కాదని వెల్లడి
ఆర్థిక పరిస్థితులపైనా ఆందోళన
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారా అని ప్రశ్న
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ‘గాంధీ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు రియల్ ఎస్టేట్ పోకడ లను ఆపకపోతే బ్యాంకు మీద విశ్వాసం ఉంచిన డిపాజిటర్ల పరిస్థితి ఏమిటి? బ్యాంకును నమ్ముకున్న మా (సిబ్బంది) పరిస్థితి ఏంటి? భవిష్యత్తులో జరగబోయే నష్టాలకు బ్యాంకు ఉద్యోగులు ఏమాత్రం బాధ్యత వహించబోం’ అంటూ బ్యాంకు ఉద్యోగుల సంఘం పేరుతో సభ్యులకు లేఖలను పంపడం వివాదాస్పదంగా మారింది. బ్యాంకు ఉద్యోగుల సంఘం తరఫున ముఖ్య కార్యనిర్వహణాధికారికి తాము లేఖ రాసి, ఆ లేఖనే సభ్యులందరికీ పంపించారు. బ్యాంకు ఆర్థిక వ్యవహారాలపై ముఖ్య కార్యనిర్వహణాధికారిని నిలదీయటంతో పాటు పాలకవర్గం తీసుకుంటున్న నిర్ణయాలకు సభ్యులే అడ్డుకట్ట వేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
సారాంశం ఇదీ..
వర్కింగ్ క్యాపిటల్లో రెండు శాతం మించి కానీ, బ్యాంకు ఆర్జించిన మొత్తం లాభంలో 30 శాతం మించి కానీ సిబ్బంది జీతభత్యాలు, ఇతర ఖర్చులు ఉండకూడదని, బ్యాంకు పాలకవర్గం మాత్రం విపరీతమైన ఖర్చులకు తెరతీస్తోందని బ్యాంకు ఉద్యోగుల సంఘం ఆరోపించింది. బ్యాంకు సభ్యులకు సంబంధించిన మహా జనసభలో ప్రవేశపెట్టిన అజెండాలోని అంశాలు సంస్థ ఆర్థిక పరిస్థితిని నష్టపరిచేలా ఉన్నాయని విమర్శించింది. ఇష్టానుసారంగా సిబ్బంది నియామకాలు జరపటాన్ని ప్రశ్నించింది. ఇప్పటికిప్పుడు బాం్యకు శాఖలను ప్రారంభించే పరిస్థితి లేదని కూడా పేర్కొంది. బ్యాంకు శాఖలను ప్రారంభించకుండానే, అందుకు తగిన చర్యలు తీసుకోకుండానే సిబ్బందిని ఏ విధంగా నియమిస్తారని ప్రశ్నించింది. రాబోయే రెండు, మూడేళ్లలో వ్యాపారాభివృద్ధిని అంచనా వేశాక సిబ్బంది నియామకాల గురించి ఆలోచించాలే తప్ప హడావిడిగా ఎవరి కోసం నిర్ణయాలు తీసుకుంటున్నారని నిలదీసింది. ఇటీవల ప్రారంభించిన విశాఖపట్నం, న్యూ గాజువాక బ్రాంచీల్లో వ్యాపారాభివృద్ధే లేదని పేర్కొంది. ఉన్న బ్రాంచీల్లో వ్యాపారాభివృద్ధి చేశాక.. కొత్త వాటిని ప్రారంభించాలని, నియమాకాలు కూడా అప్పుడే జరపాలని పేర్కొంది. బ్యాంకు కేడర్లో లేని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పోస్టును ఇటీవలే సృష్టించారని, పేపర్లో ప్రకటన కూడా ఇచ్చారని ప్రస్తావిస్తూ ఎవరి కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించింది. నగరంలోని ప్రధాన బ్యాంకుకు 25 కిలోమీటర్ల దూరంలోనే పలు బ్రాంచీలు ఉన్నాయని సంఘం గుర్తుచేసింది. నూతన పాలకవర్గం అధికారంలోకి వ చ్చిన రెండేళ్లలో నూజివీడు, హనుమాన్ జంక్షన్లో స్థలాలను కొందని, వీటిని వినియోగంలోకి తీసుకురాకుండా వదిలేసి, మళ్లీ 1,400 గజాలు కొంటామని అనటం ఎంతవరకు సబబు అని ప్రశ్నించింది. బ్యాంకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటం లేదని పేర్కొంది. బ్యాంకు నిధులను ఉపయోగం లేని వాటికి ఖర్చు పెట్టుకుంటూ పోతే భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. బ్యాంకుపై విశ్వాసం ఉంచి డిపాజిట్లు చేసిన వారు, ఉద్యోగుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. తర్వాత ఏం జరిగినా తమది బాఽధ్యత కాదని సభ్యులకు తెలిపింది. రెండు పేజీల ఈ లేఖ గాంధీ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్లోని సభ్యులుగా ఉన్న వేలమంది డిపాజిటర్లకు చేరాయి.
మేము పంపలేదు : ఉద్యోగుల సంఘం
లేఖలతో తమకు సంబంధం లేదని, తాము కేవలం బ్యాంకు సీఈవోకు మాత్రమే లేఖ ఇచ్చామని సంఘ బాధ్యులు చెబుతున్నారు. కానీ, లేఖలో సభ్యులు అడ్డుకోవాలని పిలుపునివ్వడం చూస్తే అది సభ్యుల కోసం కూడా రాశారని తెలుస్తోంది. ఒకవేళ సంఘం లేఖను సభ్యులకు పంపించకపోతే, సీఈవోకు ఇచ్చిన లేఖ ఎలా బయటకు వచ్చిందన్న అంశం కూడా ప్రశ్నార్థకంగా మారింది.
Updated Date - Jun 26 , 2025 | 12:55 AM