ఆగని ఇసుక దుమారం
ABN, Publish Date - Apr 23 , 2025 | 12:58 AM
ఇసుక టెండర్ల వివాదం రోజుకో దుమారం రేపుతోంది. ఈ టెండర్లలో స్థానికేతర సంస్థలు ఇష్టానుసారంగా పాల్గొనగా, ఇప్పుడు సదరు సంస్థలను కాపాడేలా అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. అస్మదీయ సంస్థలకు లబ్ధి చేకూరలేదన్న ఉద్దేశంతో ఏకంగా టెండర్లనే రద్దుచేసే కుట్ర జరుగుతుండటం, రద్దు చేస్తున్నట్టు ముందే లీకులు విడుదల చేయడం ఈ విషయాన్ని ధ్రువీకరిస్తోంది.
సిండికేట్ రింగ్ బాగోతం బయటపడటంతో తెరవెనుక పన్నాగాలు
రాష్ర్టేతర కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసమే అధికారుల ఆలోచనలు
టెక్నికల్ బిడ్లలో తిరస్కరించని అధికార యంత్రాంగం
ఇతర రాష్ర్టాలకు చెందిన సంస్థలని తెలిసి కూడా పాస్
తాజాగా టెండర్లను రద్దు చేసేసి.. మళ్లీ పిలిచే యోచన
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఇసుక టెండర్ల రచ్చ చల్లారకపోగా, మరింత వివాదాస్పదమవుతోంది. కృష్ణాజిల్లాలోని పామర్రు, పెనమలూరు మండలాల పరిధిలోని చోడవరం, రొయ్యూరు, నార్తు వల్లూరు, లంకపల్లి ఇసుక క్వారీలకు పిలిచిన టెండర్లపై మరింత దుమారం రేగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు వేసిన సంస్థలపై అనర్హత వేటు వేయకపోగా, అసలు టెండర్లనే రద్దు చేయాలని చూడటంపై ఆరోపణలు గుప్పుమంటున్నాయి. సిండికేట్ అయిన కాంట్రాక్టు సంస్థల కనుసన్నల్లో జిల్లా అధికారులు పనిచేస్తున్నారన్న అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.
స్థానికేతర సంస్థలకు వత్తాసు
ఈ టెండర్లలో నిబంధనలకు విరుద్ధంగా స్థానికేతర సంస్థలు పాల్గొనటం ఓ ఎత్తయితే, ఆ సంస్థలను కాపాడేలా అధికా రులు వ్యవహరించటమే ఈ వివాదాలన్నిం టికీ కారణం. పొరుగు రాష్ర్టాలకు చెందిన పలు సంస్థలు స్థానికతతో సంబంధం లేకుండా టెండర్లలో పాల్గొన్న విషయాన్ని జిల్లా యంత్రాంగం కూడా గుర్తించింది. నిబంధనల ప్రకారం.. ఆ సంస్థల టెక్నికల్ బిడ్లను తెరిచిన క్రమంలోనే పక్కన పెట్టాలి. కానీ, వాటిని పాస్ చేశారు. ఈ బాగోతం బహిర్గతమయ్యాక కూడా జిల్లా యంత్రాంగం చర్యలకు ఉపక్రమించలేదు. పైగా టెండర్లను రద్దు చేస్తున్నట్టు లీకులు ఇస్తోంది. జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ఆగ్రహాన్ని తాత్కాలికంగా చల్లార్చటం, అస్మదీయ సంస్థలను కాపాడుకోవటం కోసమే అధికారులు ఇలా చేస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. టెండర్లను పూర్తిగా రద్దు చేసేసి, తర్వాత అస్మదీయ సంస్థలకు అనుగుణంగా నిబంధనలను మార్చేసి మళ్లీ టెండర్లు పిలవాలని చూస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఆ కంపెనీలు ఎక్కడి నుంచి వచ్చాయి?
ఇసుక టెండర్లలో కొన్ని సంస్థలు స్థానికంగా ఫర్మ్ రిజిస్ర్టేషన్ లేకుండా పాల్గొన్నాయి. ఇవి వేరే రాష్ర్టాల్లో వాటి ఫర్మ్ రిజిస్ర్టేషన్స్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. టెండర్లలో స్థానిక జిల్లాకు సంబంధించిన సంస్థలే పాల్గొనాలన్న నిబంధన ఉన్నప్పుడు ఇతర రాష్ర్టాలకు చెందిన సంస్థలకు ఎలా ప్రవేశం కల్పించారన్నదే వివాదాస్పదంగా మారుతోంది.
టెక్నికల్ బిడ్లలో ఎందుకు పాస్ చేశారు?
టెండర్ల ప్రక్రియలో ముందుగా టె క్నికల్ బిడ్లను తెరుస్తారు. ఆ తర్వాతే ఫైనాన్షియల్ బిడ్లను తెరుస్తారు. అర్హతల ప్రకారం వేశారా, లేదా అనే దానికి టెక్నికల్ బిడ్ల పరిశీలన కొలమానంగా భావిస్తారు. ఈ పరిశీలనలోనే స్థానికేతర సంస్థలను పక్కన పెట్టాలి. కానీ, వాటిని పాస్ చేశారు. టెక్నికల్ బిడ్లను పాస్ చేశారంటేనే తప్పు జరిగిందని అర్థమవుతుంది. అర్హత లేని సంస్థలను టెక్నికల్ బిడ్లలో పాస్ చేయటంపై ముందుగా జిల్లా యంత్రాంగం వివరణ ఇవ్వాలి. కానీ, దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి వివరణ రాలేదు.
ఆ సంస్థలే నేరుగా పాల్గొన్నాయా?
వందల కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన స్థానికేతర సంస్థలు నిజంగానే టెండర్లలో పాలు పంచుకున్నాయా..? వీటి పేర్లను ఉపయోగించుకుని ఎవరు లబ్ధి పొందాలనుకుంటున్నారు?.. అనే అనుమానాలు కలుగుతున్నాయి. టెండరులో అందరూ ఒకే రేటు వే స్తే ఆ టెండరును ఎవరికి ఇవ్వాలన్న దానిపై ఓ నిబంధన ఉంది. ఆ సంస్థల వార్షిక టర్నోవర్ను గమనించి, ఏది ఎక్కువగా ఉంటే దానికి టెండరును అప్పగిస్తారు. వార్షిక టర్నోవర్ సరిగ్గా లేని కొన్ని సంస్థలు ఈ టెండర్లలో పాల్గొనేందుకు సదరు బడా సంస్థల అంగీకారంతో ఆ పేర్లను వాడాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
జీఎస్టీలు మార్చిన విషయాన్ని మరిచారా?
ఇసుక టెండర్లలో స్థానికత అని చూపటానికి కేవలం జీఎస్టీలను తాత్కా లికంగా మార్చారు. వాటి ఫర్మ్స్ స్థానికేతరంగా ఉన్నపుడు అప్పుడైనా అనుమా నించి అధికారులు పక్కన పెట్టాలి. కానీ, అధికారులు ఆ పని చేయ లేదు. ఇక్కడ కూడా తప్పు జరిగింది. జీఎస్టీలు అవసరాన్ని బట్టి అడ్రస్ మార్చుకోవటం సహజమే అయినా, సంస్థ స్థానిక హోదాను అవి ప్రతిబింబించవు.
Updated Date - Apr 23 , 2025 | 12:58 AM