గంజాయి రవాణాపై ఉక్కుపాదం
ABN, Publish Date - Apr 17 , 2025 | 12:44 AM
ఏలూరు రేంజ్ పరిధిలో గంజాయి అమ్మే వారిపై, గంజాయి రవాణా చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఏలూరు రేంజ్ ఐజీపీ జీవీజీ అశోక్కుమార్ స్పష్టం చేశారు.
డ్రోన్ కెమెరాల సాయంతో అసాంఘిక కార్యకలాపాలు అరికడతాం: ఏలూరు రేంజ్ ఐజీపీ జీవీజీ అశోక్కుమార్
మచిలీపట్నం టౌన్, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): ఏలూరు రేంజ్ పరిధిలో గంజాయి అమ్మే వారిపై, గంజాయి రవాణా చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఏలూరు రేంజ్ ఐజీపీ జీవీజీ అశోక్కుమార్ స్పష్టం చేశారు. బుధవారం మచిలీపట్నం పోలీసు స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఎప్పటికప్పుడు రికార్డులను కంప్యూటర్ ద్వారా అప్డేట్ చేయాలన్నా రు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తర్వాత విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మత ఘర్షణలకు ఆస్కారం లేకుండా మత సామరస్యానికి విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామాల్లో పల్లెనిద్ర చేస్తూ సమాచార వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరిగితే తక్షణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. గన్నవరం పరిధిలో జరిగిన కేసును సత్వరం విచారించి నిందితులపై చర్యలు తీసుకున్నామన్నారు. డ్రోన్ కెమెరాలతో అసాంఘిక కార్యక్రమాలను అరికడతామన్నారు. మడ అడవులపై డ్రోన్ కెమెరాలు ఉంచి నాటుసారా తయారీదారులపై చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు బ్లాక్ స్పాట్లను గుర్తిస్తున్నామన్నారు. గూడూరు, తరకటూరు ప్రాంతాల్లో ప్రమాదాలను అరికట్టేందుకు ప్లాస్టిక్ డ్రమ్ములు, బారికేడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఆ గ్రామాల్లో రైతులతో మాట్లాడి పశువులను రోడ్డు దాటిచడం పై సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. సైబర్ నేరాల నియంత్రణపై దృష్టి సారిస్తున్నామన్నారు. ఎస్పీ ఆర్.గంగాధరరావు, డీఎస్పీ సీహెచ్ రాజా, సీఐలు నబి, సాయిబాబు, ఎస్సైలు పాల్గొన్నారు.
Updated Date - Apr 17 , 2025 | 12:44 AM