సత్కార్యం
ABN, Publish Date - Apr 27 , 2025 | 12:59 AM
రాజధాని అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన పనుల్లో మరో సత్కార్యానికి కూడా శ్రీకారం చుట్టారు. రాష్ట్ర రాజధాని కోసం తమ విలువైన భూములను త్యాగం చేసిన రైతులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతులమీదుగా సన్మానించనున్నారు. ఈ సన్మానం అందుకునే 30 మంది రైతుల ప్రాథమిక జాబితా ఇప్పటికే ఎంపిక చేయగా, త్వరలో ఖరారు చేయనున్నారు.
అమరావతి రైతులకు ప్రధాని చేతులమీదుగా సత్కారం
పునర్నిర్మాణ శంకుస్థాపన సభలో చేయాలని నిర్ణయం
మొత్తం 30 మంది రైతుల ప్రాథమిక ఎంపిక
ఇంకా మార్పులు చేర్పులు చేసే అవకాశం
ఆనందం వ్యక్తం చేస్తున్న అమరావతి రైతులు
తుది దశకు చేరిన సభా ఏర్పాట్లు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : రాజధానికి భూములను త్యాగం చేసిన రైతులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా సన్మానించాలని ప్రభుత్వం భావిస్తోంది. అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమం నిమిత్తం వచ్చేనెల 2వ తేదీన ప్రధాని రానుండగా, భూములిచ్చిన రైతుల్లో 30 మందిని ఎంపిక చేసిసన్మానం చేయించాలనే ఆలోచన చేస్తున్నారు. ప్రాథమికంగా రైతులను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇలా ఎంపికైన వారిలో వెంకటపాలెం నుంచి బి.నరసింహారావు, ఎర్రబాలెం నుంచి ఆకుల ఉమామహేశ్వరరావు, రాజశేఖర్రెడ్డి, కృష్ణాయపాలెం నుంచి కిరణ్, మందడం నుంచి శ్రీనివాసరావు, బుజ్జి, బెజవాడ రమేశ్, వెలగపూడి నుంచి గద్దె భాను, కారుమంచి నరేంద్ర, ఉద్దండరాయునిపాలెం నుంచి చలపతిరావు, లింగాయపాలెం నుంచి ఆనుమోలు గణేశ్, రాయపూడి నుంచి సాహెబ్ జాన్, దొండపాడు నుంచి గిరిజ, వరప్రసాద్, కొమ్మినేని శివయ్య, తుళ్లూరు నుంచి గోవిందమ్మ, కోటా అప్పారావు, బెంగళూరు సాంబశివరావు, అనంతవరం నుంచి బండి దుర్గ, నెక్కల్లు నుంచి చిన్ని, రాయపూడి నుంచి చిలకా బసవయ్య, ఉద్దండరాయునిపాలెం నుంచి పులి చిన్నా, గుజ్జర్లపూడి అనిత, పువ్వాడ సుధాకర్, వెంకటపాలెం నుంచి లంక శైలజతో పాటు జమ్ముల శ్యామ్కిషోర్, కొమ్మినేని సత్యనారాయణ ఉన్నారు. ఈ జాబితాను అధికారికంగా ఖరారు చేయలేదు. మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంది.
తుదిదశకు చేరుకుంటున్న ఏర్పాట్లు
అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపన సభ ఏర్పాట్లు తుదిదశకు చేరుకుంటున్నాయి గ్యాలరీలు, వేదికల పనులు పూర్తికావచ్చాయి. మోదీ కూర్చునే వేదికపై 20 మంది అతిథులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ వేదిక పక్కనే వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు 30 మంది కూర్చునేలా మరో వేదికను సిద్ధం చేస్తున్నారు. ప్రధాన వేదిక దిగువన ముందు వరసన ప్రజాప్రతినిధులు, అధికారులు కూర్చోవటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదు వేల మంది రైతులు కూర్చునేలా గ్యాలరీలు సిద్ధమవుతున్నాయి.
రూ.30,885 కోట్ల పెట్టుబడులు
అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన పనుల నేపథ్యంలో రాజధానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని సీఆర్డీఏ అధికారులు అంచనా వేస్తున్నారు. రాజధాని పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడానికి ముందే.. అంటే ఇప్పటికే రూ.30,885.5 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఎడ్యుకేషన్, ఆర్అండ్డీ విభాగంలో బిట్స్ అమరావతి, ఎక్స్ఎల్ఆర్ఐ, వీఐటీ ఏపీ, ఏఐఐఎంఎస్ వంటి సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యాయి. ప్రభుత్వ రంగంలో సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, విదేశీ భవన్, హడ్కో, హెచ్సీఎల్ వంటి సంస్థలు ముందుకొచ్చాయి. ఆరోగ్య రంగంలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, బసవతారకం కేన్సర్ ఆసుపత్రి, ఈఎస్ఐసీ, బ్యాంకింగ్ రంగంలో ఆర్బీఐ, నాబార్డు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలు ఏర్పాటు కానున్నాయి. ఆతిథ్య రంగంలో హిల్టన్, మారియట్, నోవాటెల్, క్రౌన్ ప్లాజా వంటి సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. కాగా, అమరావతి పునర్నిర్మాణ పనుల తర్వాత భారీ ఎత్తున పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా క్వాంటమ్ వ్యాలీ సెక్టార్లో భారీ పెట్టుబడులు రావచ్చని భావిస్తున్నారు. దేశంలోనే మొదటిసారిగా సూపర్ కంప్యూటర్ వ్యవస్థ ఏర్పాటుకానుంది. క్వాంటమ్ వ్యాలీలో ఐబీఎం, టీసీఎస్, ఎల్అండ్టీ, ఐఐటీ మద్రాస్ వంటి సంస్థలు భాగస్వామ్యం కానున్నాయి. సీఐఐ నేతృత్వంలో ప్రపంచస్థాయి గ్లోబల్ లీడ ర్షిప్ సెంటర్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా ఏర్పాటు కానుంది.
Updated Date - Apr 27 , 2025 | 12:59 AM