కంత్రీ కోటీ..శ్వరమ్మ
ABN, Publish Date - Jul 26 , 2025 | 01:13 AM
కుటుంబ నిర్వహణ కోసం తమతమ భర్తలిచ్చిన డబ్బు నుంచి కొంత పక్కన పెట్టారు. చీటీలు వేసి, వాటిని డబుల్ చేసి ఏదో ఒకరోజు తమతమ భర్తల చేతుల్లో పెట్టి సర్ప్రైజ్ చేయాలనుకున్నారు. చివరికి డబ్బులన్నీ పోగొట్టుకుని లబోదిబోమంటున్నారు. రామలింగేశ్వరనగర్ శివశంకర్ రోడ్డులో చీటీలు నిర్వహించి కొద్దిరోజుల క్రితం జెండా ఎత్తేసిన కోటేశ్వరమ్మ కేసులో మహిళల బాధలివి.
నమ్మించి నట్టేటముంచిన చీటింగ్ లేడీ
పేద, మధ్యతరగతి మహిళలతో చీటీలు వేయించి..
పాడుకున్న సొమ్ము తానే తీసుకుని వడ్డీ చెల్లింపు
ఆ వడ్డీని చీటీల సొమ్ముగా తిరిగి మినహాయింపు
మోసం తెలిసి లబోదిబోమంటున్న బాధితులు
రూ.5 కోట్ల వరకు సొమ్ము ఉంటుందని అంచనా
ఇంకా పరారీలోనే కోటేశ్వరమ్మ కుటుంబం
(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : కుటుంబ నిర్వహణ కోసం తమతమ భర్తలిచ్చిన డబ్బు నుంచి కొంత పక్కన పెట్టారు. చీటీలు వేసి, వాటిని డబుల్ చేసి ఏదో ఒకరోజు తమతమ భర్తల చేతుల్లో పెట్టి సర్ప్రైజ్ చేయాలనుకున్నారు. చివరికి డబ్బులన్నీ పోగొట్టుకుని లబోదిబోమంటున్నారు. రామలింగేశ్వరనగర్ శివశంకర్ రోడ్డులో చీటీలు నిర్వహించి కొద్దిరోజుల క్రితం జెండా ఎత్తేసిన కోటేశ్వరమ్మ కేసులో మహిళల బాధలివి. కోటేశ్వరమ్మ రూ.5 కోట్ల వరకు చీటీల సొమ్ముతో విజయవాడ నుంచి పారిపోయిన విషయం తెలిసిందే. దీనిపై బాధితులను కలిసినప్పుడు కొత్తకోణం బయటపడింది. రామలింగేశ్వరనగర్లో ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు ఎక్కువ. ఆ తర్వాత వ్యాపారులు మూడోస్థానంలో ఉంటారు. గాయత్రీ రోడ్డులో సొంతిల్లు ఉన్నప్పటికీ రామలింగేశ్వరనగర్లో అద్దె ఇంట్లో ఉంటున్న కోటేశ్వరమ్మ పదిహేనేళ్లుగా చీటీలు నిర్వహిస్తోంది. ఒకరి ద్వారా మరొకరు.. ఇలా చాలామంది ఆమె వద్ద చీటీలు వేశారు. రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకూ చీటీలు వేసినట్టు బాధితులు చెబుతున్నారు. తాజాగా భర్తతో కలిసి పరారైన కోటేశ్వరమ్మ ఆచూకీ కోసం పటమట పోలీసులు గాలిస్తున్నారు. బకాయిలు ఇవ్వడానికి రేపుమాపు అంటూ వాయిదా వేసిన ఆమె ఒక్కసారిగా ఇంటికి తాళం వేసి షాక్ ఇచ్చింది. కోటేశ్వరమ్మ భర్త ఆర్టీసీ గవర్నరుపేట డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కొన్నినెలలుగా ఆయన సిక్లీవ్లో ఉన్నాడు. కోటేశ్వరమ్మ చేసిన ఘనకార్యంతో పోలీసులు ఆర్టీసీ డిపో మేనేజర్కు లేఖ రాశారు. కోటేశ్వరమ్మ భర్త విధుల్లో చేరిన వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.
సొమ్మంతా ఆమె వద్దే..
మహిళలు చీటీల్లో పాడుకున్న సొమ్మును కోటేశ్వరమ్మ నుంచి తీసుకోలేదు. ఆ సొమ్మును తిరిగి కోటేశ్వరమ్మకే రూ.5కు వడ్డీకి ఇచ్చారు. ఆమె చెల్లించే వడ్డీని చీటీకి జమ చేసేవారు. ఇలా ఒకరిని చూసి మరొకరు లక్షలాది రూపాయలను కోటేశ్వరమ్మ చేతుల్లో పెట్టారు. రూపాయిని రెట్టింపు చేసి భర్తల చేతుల్లో పెట్టడానికి తాము ఇలా చేశామని బాధితులు చెబుతున్నారు. ఇంటి నుంచి పారిపోవడానికి ముందురోజు వరకు కోటేశ్వరమ్మ హామీలిస్తూనే ఉంది. కోటేశ్వరమ్మ కొట్టేసిన మొత్తం రూ.5 కోట్ల వరకూ ఉంటుందని ప్రాథమికంగా చెబుతున్నారు. బాధితులు మొత్తం బయటకు వస్తే అంతకుమించే ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
Updated Date - Jul 26 , 2025 | 01:13 AM