Veerayya Chowdary: మూడు మాఫియాల పగ
ABN, Publish Date - Apr 26 , 2025 | 05:35 AM
టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించి, హంతకులు వాడిన స్కూటీని గుర్తించారు. స్కూటీ యజమానిగా ఉన్న వినోద్నే హత్య సుపారీ తీసుకున్న నిందితుడిగా భావిస్తున్నారు.
వీరయ్య చౌదరి హత్య వీరి పనే
ఇసుక, లిక్కర్, రేషన్ మాఫియాల హస్తం
కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు
ఒంగోలు క్రైం, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. హంతకులు వాడిన స్కూటీని గుర్తించారు. స్థానికంగా ఉన్న లిక్కర్ మాఫియా, రేషన్ మాఫియా, ఇసుక మాఫియాకు చెందిన వారే వీరయ్య హత్యకు కుట్ర పన్నినట్లు గుర్తించినట్లు తెలిసింది. వీరి వెనుక కొందరు రాజకీయ నేతలూ ఉన్నట్లు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలుకు చెందిన వీరయ్య చౌదరి మంగళవారం రాత్రి ఒంగోలులో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు దీనిపై తీవ్రంగా స్పందించారు. స్వయంగా వెళ్లి ఆయనకు నివాళులు అర్పించారు. హంతకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. వీరయ్య చౌదరి స్వగ్రామానికి చెందిన అమ్మనబ్రోలుకే చెందిన ఆయన రాజకీయ ప్రత్యర్థిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వీరయ్య రాజకీయంగా ఎదుగుతుండటాన్ని జీర్ణించుకోలేకపోవడం, ‘లిక్కర్’ విక్రయాలకు అడ్డు రావడం వంటి కారణాలతో... నలుగురితో కలిసి ఈ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. అతనితోపాటు రేషన్ బియ్యం అక్రమ రవాణా, ఇసుక అక్రమ రవాణాతో సంబంధమున్న మరో ఇద్దరి మధ్య కొన్నాళ్లుగా జరిగిన ‘కాల్ డేటా’ను పోలీసులు పరిశీలించారు. వారి మధ్య వందలసంఖ్యలో ఫోన్ సంభాషణలు జరిగినట్లు గుర్తించారు.
సుపారీ తీసుకున్న స్కూటీ యజమాని
వీరయ్యను హత్య చేసిన నిందితులు ఉపయోగించిన తెల్ల స్కూటీని చీమకుర్తిలోని ఆర్ఎస్ దాబా వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ స్కూటీ ఒంగోలులోని అన్నవరపాడుకు చెందిన వినోద్ అనే వ్యక్తిదిగా గుర్తించారు. స్కూటీ యజమానే వీరయ్య చౌదరిని హత్య చేసేందుకు కాంట్రాక్టు (సుపారీ) తీసుకున్నట్లు భావిస్తున్నారు. వినోద్ సెల్ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. హత్య అనంతరం స్కూటీపై ఇరువురు దుండగులు పరారయ్యారని, ఒంగోలు నుంచి చీమకుర్తి వెళ్లి స్థానిక ఆర్ఎస్ దాబా వద్ద స్కూటీని వదిలేశారని సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. స్కూటీని వదిలేసిన నిందితులు ఈ నెల 23న రాత్రి 8.15 గంటలకు విజయవాడ నుంచి కనిగిరి వైపు వెళ్లే బస్సు ఎక్కారు.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Apr 26 , 2025 | 05:35 AM