రోడ్డు సరే.. మట్టికుప్పలేంటి..?
ABN, Publish Date - Jun 01 , 2025 | 12:01 AM
తారు రోడ్డు ఏర్పాటు చేశారు. మరి రోడ్డు పక్కన ఉన్న రాళ్లు, మట్టి కుప్పలను పట్టించుకోకపోవడం ఏమిటం టూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
దువ్వూరు, మే 31 (ఆంధ్రజ్యోతి): తారు రోడ్డు ఏర్పాటు చేశారు. మరి రోడ్డు పక్కన ఉన్న రాళ్లు, మట్టి కుప్పలను పట్టించుకోకపోవడం ఏమిటం టూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్థితి దువ్వూరు మండలం మూడిండ్లపల్లెలో నెలకొంది. ఇక్కడ ఆర్అండ్బీ పరిధిలోని రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరై తారు పనులు పూర్తి చేశారు. వాటిని పూర్తి చేసి మూడు నెలలు అవుతున్నా రోడ్డు పక్కన వేసిన రాళ్లకుప్పలను అలాగే వదలివేయడంతో వర్షాకాలంలో ఆ రాళ్లకుప్పలు రోడ్డుపైకి వచ్చి రోడ్డు దెబ్బతినే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మం డలంలోని గరుగుల మెట్ట వద్ద నుంచి మూడిండ్లపల్లె వరకు తారు రోడ్డు, అక్కడి నుంచి చిన్నబాకరాపురం వరకు రోడ్డు ప్యాచింగ్ పనులు చేశారు. ఈ సమయంలో ఇరువైపుల లూజుమట్టిని తొలగించి గ్రావెల్తో నింపి చదును చేయాల్సి ఉంది. రోజులు గడిచినా సదరు అసంపూర్తి పనులు చేయించేందుకు అధికారులు శ్రద్ధ చూపడంలేదని ఈ ప్రాంతవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు పడే సమయం ఆసన్నమైంది. వానలు పడితే వర్షపునీరు రోడ్డుమీద నిలబడే అవకాశం ఉంది. ఇలా జరిగితే తారు రోడ్డు అనతికాలంలోనే దెబ్బతినే అవకాశం ఉందని ప్రజలు వాపోతున్నారు.
ఆర్అండ్బీ డీఈ ఏమన్నారంటే: త్వరలోనే రోడ్డు పక్కన వేసిన రాళ్లకుప్పలను తొలగిస్తామని ఆర్అండ్బీ డీఈ శివకుమార్ తెలిపారు. రోడ్డు పక్కన వేసిన రాళ్ల కుప్పల విషయమై ఆర్అండ్బీ డీఈ శివకుమార్ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా పెండింగ్ పనిని కాంట్రాక్టర్తో తొందరలోనే పూర్తి చేయిస్తామని పేర్కొన్నారు.
Updated Date - Jun 01 , 2025 | 12:01 AM