AP High Court: హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దేవానంద్ ప్రమాణం
ABN, Publish Date - Jul 29 , 2025 | 04:05 AM
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ సోమవారం ప్రమాణం చేశారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాలులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ ఆయనతో ప్రమాణం చేయించారు.
నలుగురు అదనపు జడ్జీలకుశాశ్వత న్యాయమూర్తుల హోదా
జస్టిస్ హరినాథ్, జస్టిస్ కిరణ్మయి, జస్టిస్ సుమతి, జస్టిస్ విజయ్ పేర్లను సిఫారసు చేసిన సుప్రీం కొలీజియం
అమరావతి, జూలై 28(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ సోమవారం ప్రమాణం చేశారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాలులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ ఏడాది మే 26న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని కొలీజియం.. జస్టిస్ దేవానంద్ను మద్రాస్ హైకోర్టు నుంచి ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్రానికి సిఫారసు చేయడం.. అందుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడం తెలిసిందే. రాష్ట్ర హైకోర్టులో 37మంది న్యాయమూర్తుల నియామకానికి ఆమోదం ఉండగా.. జస్టిస్ దేవానంద్ చేరికతో సంఖ్య 29కి చేరింది. సోమవారం జరిగిన ప్రమాణస్వీకారానికి హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు ఏజీ సాంబశివప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, అదనపు సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ, ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ద్వారకానాథరెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.చిదంబరం, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పార్థసారథి, జస్టిస్ దేవానంద్ కుటుంబ సభ్యులు, ఏపీ, మద్రాస్ హైకోర్టు న్యాయవాదులు, మద్రాస్, పుదుచ్చేరి బార్ కౌన్సిల్ అధికారులు, తదితరులు హాజరయ్యారు. జస్టిస్ దేవానంద్కు పలువురు న్యాయవాదులు, బంధువులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు.
తమిళనాడు, పుదుచ్చేరి బార్ కౌన్సిల్ ప్రతినిధులకు సన్మానం
జస్టిస్ దేవానంద్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తమిళనాడు, పుదుచ్చేరి బార్ కౌన్సిల్ ప్రతినిధుల బృందం హాజరైంది. ఈ బృందాన్ని ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షుడు నల్లారి ద్వారకానాథరెడ్డి ఆధ్వర్యంలో సన్మానించారు. జ్ఞాపికలు అందజేశారు. తమిళనాడు, పుదుచ్చేరి బార్ కౌన్సిల్ చైర్మన్ పీఎస్ అమల్రాజ్, వైస్ చైర్మన్ వి.కార్తికేయన్, మద్రాస్ హైకోర్టు పీపీ హసన్ మహ్మద్ జిన్నా, తమిళనాడు హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యదర్శి ఆర్.కృష్ణకుమార్, కార్యనిర్వాహక సభ్యుడు రమేశ్ ఈ బృందంలో ఉన్నారు. ఈ సందర్భంగా న్యాయవాదుల రక్షణ బిల్లును తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని ప్రతినిధుల బృందం తెలిపింది.
Updated Date - Jul 29 , 2025 | 04:06 AM