Minister Lokesh: అడ్మిషన్లు 18 శాతం పెరిగాయ్
ABN, Publish Date - Jul 29 , 2025 | 04:08 AM
ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల్లో 18 శాతం అడ్మిషన్లు పెరిగాయని మంత్రి లోకేశ్ వెల్లడించారు. యూడైస్ డేటా ఈ విషయాన్ని స్పష్టం చేస్తోందని...
ఇంటర్ ప్రవేశాలపై రోతపత్రికలో అబద్ధాలు
2023-24లో 1,24,818 మంది చేరిక
2025-26లో 1,46,332 మంది చేరారు
నెలాఖరు వరకు అడ్మిషన్లకు గడువుంది
తప్పుడు రాతలపై చట్టపరంగా చర్యలు
జగన్ పత్రిక కథనంపై లోకేశ్ మండిపాటు
అమరావతి, జూలై 28(ఆంధ్రజ్యోతి): ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల్లో 18 శాతం అడ్మిషన్లు పెరిగాయని మంత్రి లోకేశ్ వెల్లడించారు. యూడైస్ డేటా ఈ విషయాన్ని స్పష్టం చేస్తోందని, అయితే జగన్మోహన్ రెడ్డి అవినీతి విషపత్రిక, రోతపత్రికలో కాలేజీలు ఖాళీ అంటూ అబద్ధ్దాలతో కథనాన్ని వండి వార్చారని మండిపడ్డారు. ఇంటర్ అడ్మిషన్లపై సోమవారం ఆయన ఎక్స్లో పోస్టు చేశారు. ‘‘ప్రభుత్వ ఇంటర్ విద్యలో గత ఏడాది కాలంగా మేం తెచ్చిన సంస్కరణల కారణంగా 2025-26లో 18 శాతం అడ్మిషన్లు పెరిగాయి. ఈ నెలాఖరు వరకు ఇంకా అడ్మిషన్లకు గడువుంది. ప్రకాశం జిల్లాలోని కనిగిరి లాంటి మారుమూల కాలేజీల్లో అడ్మిషన్లు రెట్టింపు కావడం ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో పెరిగిన నమ్మకానికి నిదర్శనం. విద్యార్థులు, అధ్యాపకుల్లో మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే తప్పుడు రాతలపై ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది’’ అని అన్నారు. ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో 2023-24లో 1,24,818 మంది చేరగా, 2025-26లో 1,46,332 మంది చేరారని వివరించారు. ఫస్టియర్ విద్యార్థుల సంఖ్య 67,148 నుంచి 74,838కి, సెకెండియర్ విద్యార్థుల సంఖ్య 57,670 నుంచి 71,494కు పెరిగిందని లోకేశ్ తెలిపారు. ఇంటర్ విద్యా శాఖ కూడా జగన్ పత్రిక కథనంపై ఖండన విడుదల చేసింది. కొన్ని కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య పెరిగినా తగ్గినట్లు వార్తలో ప్రచురించిందని తప్పుబట్టింది.
Updated Date - Jul 29 , 2025 | 04:09 AM