Jagan liquor scam: కూల్గా కొల్లగొట్టారు
ABN, Publish Date - May 21 , 2025 | 03:21 AM
వైఎస్ జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం రూ.3100 కోట్లకు పైగా ప్రజా ధనం గుబ్బపెట్టింది. ప్రభుత్వ సొమ్మును మద్యం కంపెనీలకు అదనం గా ఇచ్చి, తిరిగి ఆ మొత్తాన్ని రాజకీయ నాయకుల ఖర్చులకు వాడారు.
మద్యం స్కామ్లో మతిపోగొట్టే ‘స్కీమ్’
‘‘అంకుల్... కిలో పంచదార రూ.50. కానీ... నేను మా డాడీతో మీకు రూ.60 గూగుల్ పే చేయిస్తా. ఎక్స్ట్రాగా కొట్టిన రూ.10 నాకు ఇచ్చేయండి!’’... ఇదో చిన్న పిల్లల చిల్లర స్కీమ్! జగన్ హయాంలో దాదాపు నాలుగున్నరేళ్లు నడిచిన ‘లిక్కర్ స్కామ్’ కూడా అచ్చం ఇలాగే జరిగింది. ఇక్కడ షాప్ అంకుల్... లిక్కర్ కంపెనీ! గూగుల్ పే చేసింది ప్రభుత్వ ధనాన్ని! ‘అదనం’గా ఇచ్చిన డబ్బును సొంత జేబులోకి వేసుకున్నది... అప్పటి ప్రభుత్వ పెద్దలు!
ముడుపులే లక్ష్యంగా, ముడుపుల కోసం, ముడుపుల చుట్టూ తిరిగేలా రూపుదిద్దుకున్నదే మద్యం పాలసీ! దానిని రూపొందించింది, అమలు చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో! దాని పాత్రధారులు, సూత్రధారులు ఒక్కొక్కరుగా అరెస్టవుతున్నారు. ఈ వేడి మెల్లగా ‘తాడేపల్లి ప్యాలె్స’నూ తాకుతోంది. అప్పుడు ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ను అరెస్టు చేసిన మద్యం స్కామ్ గులకరాయిలాంటిదైతే... జగన్ హయాంలో జరిగింది పెద్ద కొండంత! ఒక ‘పథకం’ ప్రకారం పకడ్బందీగా సాగిన కుంభకోణమిది! ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేయాలన్నది ఇందులో కీలకం! దాని ద్వారా వేల కోట్లు మింగేశారు! మద్యం కంపెనీలు తమకు వచ్చిన ఆదాయంలోంచి కట్టిన ముడుపులు మాత్రమే కాదు! అంతకుమించి చాలా ఉంది! ప్రజల సొమ్మును మద్యం కంపెనీలకు ‘అదనం’గా చెల్లించి... అదే డబ్బును తిరిగి ‘ప్యాలె్స’కు తరలించిన అత్యంత నీచమైన, దారుణమైన కుంభకోణమిది!
తొలి 6 నెలలు కమీషన్ల కిక్కు
తర్వాత ‘అదనంగా’ పైసా వసూల్
వెయ్యి విలువైన మద్యానికి రూ.1600 చెల్లించడం
అదనంగా ఇచ్చిన రూ.600 సొంతానికి మళ్లించడం
అలా ఇచ్చి, పుచ్చుకున్నది ప్రజా ధనమే
మొత్తం చేతులు మారింది రూ.3113 కోట్లు
అందులో ప్రభుత్వ సొమ్మే అత్యధికం
కొనుగోలు ధర మేరకు ఎమ్మార్పీ కూడా అధికం
మందు బాబుల జేబులూ గుల్ల
కూటమి రాగానే ‘అదనం’ పోయింది.. ధర తగ్గింది
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
అప్పుడెప్పుడో బోఫోర్స్ స్కామ్ నుంచి... తాజాగా ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ దాకా... స్వతంత్ర భారత దేశంలో ఎన్నో కుంభకోణాలు వెలుగు చూశాయి. కానీ... వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి మరేదీ సాటి రాదు! ఇది... ‘మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్’ అని ఆర్థిక నిపుణులే చెబుతున్నారు. ‘సరుకు ఆర్డర్ ఇచ్చారు. కమీషన్లు పుచ్చుకున్నారు. ఇది ఇద్దరి మధ్య జరిగిన వ్యవహారం. మద్యం కంపెనీలు తమ లాభంలోంచి తీసి కొంత మొత్తాన్ని కమీషన్లుగా చెల్లించాయి. ప్రభుత్వ ఖజానాకు వచ్చిన నష్టమేమిటి?’ అని అమాయకంగా ప్రశ్నించేవాళ్లూ ఉన్నారు. కానీ... జగన్ హయాంలో మద్యం స్కామ్ రెండు దశల్లో నడిచింది. మొదటి దశలో... ఒక్కో కేసుకు ఇంత చొప్పున కమీషన్ ఫిక్స్ చేసి, మద్యం తయారీదారుల నుంచి ముడుపులు పిండుకున్నారు. రెండో దశలో నడిచిందే కీలకం! అది... ప్రభుత్వ సొమ్మును మద్యం కంపెనీలకు ‘అదనం’గా ఇచ్చి, అదే మొత్తాన్ని తమ ‘ప్యాలె్స’కు మళ్లించారు. ప్రభుత్వ ధనం అంటే ప్రజా ధనమే! దానినే... సొంతానికి మింగేశారు.
కమీషన్లతో మొదలుపెట్టి..
జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో సుమారు రూ.3100 కోట్లు చేతులు మారాయి. ప్రభుత్వం ద్వారా మద్యం దుకాణాలు నడపాలన్నది ఒక ‘మాస్టర్ ప్లాన్’. ప్రైవేటు మద్యం దుకాణాలతో ముడుపులు లభించే అవకాశం లేదు. మహాఅయితే... తమ నేతలు, అనుచరులకు షాపులు దక్కుతాయి. వాటి ఆదాయమూ వారికే వస్తుంది. కానీ... ‘మాకేంటి’ అని నాటి ప్రభుత్వ పెద్దలు ఆలోచించారు. అందుకే... ప్రభుత్వ మద్యం షాపులు తీసుకొచ్చారు. 2019 ఏడాది చివరి నుంచే వైసీపీ పెద్దలు మద్యం కంపెనీలతో బేరసారాలు ప్రారంభించారు. ‘సరుకు మీదే. కానీ... షాపులు ప్రభుత్వానివి. వాటిలో మీ మద్యం అమ్మితే కేసుకు ఎంత ఇస్తారు?’ అని ప్రశ్నించారు. లిక్కర్కు రూ.200, బీరుకు రూ.50 చొప్పున తమకు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ ప్రభుత్వ పెద్దలు ఇలా మద్యం కంపెనీలను ముడుపులు అడిగింది లేదు. తొలిసారి ఈ మాట విని... మద్యం కంపెనీలు అవాక్కయ్యాయి. కమీషన్లు ఇచ్చుకోవడం ఇష్టంలేని కంపెనీలు... ఏపీలో వ్యాపారం వదులుకున్నాయి. కొన్ని కంపెనీలు మాత్రం వైసీపీ పెద్దలు అడిగిన మేరకు ముడుపులు సమర్పించుకున్నాయి. ఇందులో భాగంగా చిల్లర, నాసిరకం మద్యం బ్రాండ్లూ రంగ ప్రవేశం చేశాయి. ఇలా మొదటి ఆరు నెలలపాటు కంపెనీలు వైసీపీ నేతలకు కమీషన్లు చెల్లించాయి. అంటే... ఇది తమకు వచ్చే లాభంలోంచి సమర్పించుకున్న ముడుపు! ఇది లిక్కర్ స్కామ్లో మొదటి దశ! అసలు సినిమా... రెండో దశలోనే ఉంది!
ధరలు తగ్గించడమే నిదర్శనం
సాధారణంగా, కాలక్రమంలో వస్తువుల ధరలు పెరుగుతుంటాయి. మద్యం ఉత్పత్తి ధరలు కూడా పెంచాలని కంపెనీలు ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉంటాయి. కానీ... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత దాదాపు 20 బ్రాండ్లు రేట్లు తగ్గించుకున్నాయి. దీనికి అనుగుణంగా ఎక్సైజ్ శాఖ ఎమ్మార్పీలు తగ్గించింది. మాన్షన్ హౌస్ బ్రాందీ క్వార్టర్ సీసాపై రూ.30, హాఫ్ బాటిల్పై రూ.60, ఫుల్ బాటిల్పై రూ.110 తగ్గింది. రాయల్ చాలెంజ్ సెలెక్ట్ గోల్డ్ విస్కీ క్వార్టర్పై రూ.20, ఫుల్పై రూ.80 తగ్గింది. యాంటిక్విటీ బ్లూ విస్కీ ఫుల్ బాటిల్పై ఏకంగా రూ.200 ధర తగ్గింది. ఇంకా చాలా కంపెనీలు దశలవారీగా ధరలు తగ్గించేశాయి. దీనిని బట్టి చూస్తే... గత ప్రభుత్వంలో ఇవన్నీ అదనంగా తీసుకున్నాయని స్పష్టంగా అర్థమవుతోంది. అలా తీసుకున్న మొత్తాన్ని తాడేపల్లి ప్యాలె్సకు కప్పంగా చెల్లించారు. మరోవైపు... జగన్ హయాంలో ప్రభుత్వం నుంచి అదనంగా చెల్లించి మద్యం కొనుగోలు చేయడంతో, ఎక్సైజ్ శాఖ దానికి అనుగుణంగా ఎమ్మార్పీలు పెంచింది. వెరసి... మందు బాబుల జేబులు గుల్ల! వైసీపీ పెద్దల జేబులు కళకళ!
జనం సొమ్ము... ‘జగన్’కే!?
కమీషన్లు తీసుకుంటున్న క్రమంలోనే... నాటి ప్రభుత్వ పెద్దలకు మరో ఆలోచన వచ్చింది. అన్ని కంపెనీల నుంచి పక్కాగా ముడుపులు వసూలు చేసేలా... మద్యం స్కామ్లో రెండో దశ మొదలైంది. మొదటి ఆరు నెలలు కంపెనీలు సొంత డబ్బును ముడుపులుగా చెల్లిస్తే, మిగిలిన నాలుగేళ్ల పాటు ప్రజా ధనమే మద్యం కంపెనీల ద్వారా తాడేపల్లికి వెళ్ళింది. వంద విలువైన మద్యాన్ని జగన్ ప్రభుత్వం 160కి కొనుగోలు చేసింది. అదనంగా చెల్లించిన రూ.60ని కంపెనీల నుంచి వైసీపీ పెద్దలు తిరిగి తీసుకున్నారు. ఉదాహరణకు... మాన్సన్ హౌస్ బ్రాందీని పొరుగునే ఉన్న తెలంగాణ ప్రభుత్వం కేసును రూ.1083తో కొనుగోలు చేయగా... ఏపీ ప్రభుత్వం అదే బ్రాండ్ మద్యం కేసుకు రూ.1695 చెల్లించింది. అదనంగా ఒక్క కేసుకు దాదాపు రూ.600. ఇలా అదనంగా చెల్లించిన మొత్తం తిరిగి తాడేపల్లికి చేరిందన్న మాట! ఇలా... మొత్తం కుంభకోణంలో లిక్కర్పై రూ.2861 కోట్లు, బీరుపై రూ.252 కోట్లు ‘అదనం’గా చేతులు మారాయి. ఇది... మద్యం కంపెనీల సొంత సొమ్ము కాదు! అచ్చంగా... ప్రజా ధనం!
ముడుపులపై మొదట్లోనే ఒత్తిడి
వైసీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే మద్యం కంపెనీలపై ముడుపుల ఒత్తిళ్లు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో మద్యం అమ్ముకోవాలంటే కప్పం కట్టాల్సిందేనని వైసీపీ వర్గాలు తేల్చేశాయి. దానికి అంగీకరించని కంపెనీలకు ఆర్డర్లు ఆగిపోయాయి. రాష్ట్రంలో అత్యధికంగా అమ్ముడుపోయే కింగ్ఫిషర్ బీరు 2018-19లో రాష్ట్రంలో 1.02 కోట్ల కేసులు అమ్మితే, 2023-24లో కేవలం 11.82లక్షల కేసులు అమ్మారు. అంటే 2018-19లో అమ్మినదాంతో పోలిస్తే కేవలం 11.54శాతం మాత్రమే. అదే నాకౌట్, బడ్వైజర్ కంపెనీల బీర్లు అయితే మొత్తంగా కనిపించకుండా పోయాయి. అదే సమయంలో... బ్రిటీష్ ఎంపైర్, బీరా 91 బూమ్, బ్లాక్ బస్టర్ అల్ర్టా కంపెనీల బీర్ల అమ్మకాలు భారీగా పెరిగిపోయాయి. ఇక... పాపులర్ లిక్కర్ బ్రాండ్ మెక్డోవెల్స్ నంబర్-1 బ్రాందీ 2023-24లో కేవలం 5 కేసులు అమ్ముడైంది. ఇంపీరియల్ బ్లూ కేవలం ఏడు కేసులే అమ్మింది. అవే బ్రాండ్లు 2018-19లో 20లక్షలకు పైగా కేసులు అమ్ముడయ్యాయి. ఇక... 2018-19లో ఒక్క కేసు కూడా అమ్ముడుపోని సిరీస్ క్లాసిక్ బ్లూ ఫైనెస్ట్ విస్కీ, గ్రేసన్స్ సిల్వర్ స్ర్టిప్స్, రాయల్ ప్యాలెస్, ఓల్డ్ టైమర్ బ్లూ క్లాసిక్ విస్కీ, గ్రేసన్స్ కింగ్స్వెల్ సెలెక్ట్ ఇండియన్ బ్రాందీలు జగన్ హయాంలో లక్షల కేసులు విక్రయించాయి. దీనికి ఒకటే కారణం... ముడుపులు ఇచ్చేందుకు, తమ ‘అదనపు స్కీమ్’కు సహకరించిన వారికే ఆర్డర్లు!
ఈ వార్తలు కూడా చదవండి..
Tiruvuru Political Clash: తిరువూర్లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్
Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే
Read Latest AP News And Telugu News
Updated Date - May 21 , 2025 | 03:21 AM