రీ సర్వే డ్యూటీలో ఉన్నా హాజరు తప్పనిసరి
ABN, Publish Date - Feb 27 , 2025 | 04:07 AM
రీసర్వే, స్వమిత్వ, ఇతర విధుల కోసం గ్రామాలు, మండ లాలు మారి వేరోచోట విధులు నిర్వర్తించే వారికి కూడా హాజరు తప్పనిసరి చేస్తూ...
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
అమరావతి, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): గ్రామ సర్వేయర్లకు హాజరు తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రీసర్వే, స్వమిత్వ, ఇతర విధుల కోసం గ్రామాలు, మండ లాలు మారి వేరోచోట విధులు నిర్వర్తించే వారికి కూడా హాజరు తప్పనిసరి చేస్తూ భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ జి. జయలక్ష్మి ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు వారి హాజరుపై నిర్దిష్టమైన ఆదేశాలివ్వాలని గ్రామ, వార్డు సచివాలయాల విభాగానికి ఆమె లేఖ రాశారు. ఈ నేపథ్యంలో రీ సర్వే విధుల్లో భాగంగా సొంత మండలం లేదా ఇతర మండలాల్లో పనిచేసే వారు స్థానిక గ్రామ, వార్డు సచివాలయాల్లో హాజరు నమోదు చేసుకోవాల్సిందేనని గ్రామ, వార్డు సచివాలయాల విభాగం కార్యదర్శి కాటమేని భాస్కర్ తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. రీ సర్వే పనుల్లో ఉన్నామని, తమకు హాజరు మినహాయించాలని పలువురు సర్వేయర్లు కొంతకాలంగా కోరుతున్నారు. అయితే ఇతర మండలాలకు డిప్యూట్ అయిన వారు రీసర్వే పనులు మానేసి ఇతర కార్యకలాపాల్లో బిజీగా ఉండిపోతున్నారన్న ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలో, రీ సర్వే పనుల కోసం ఇత ర మండలాలకు డిప్యూట్ అయిన వారు స్థానిక గ్రామ, వార్డు సచివాలయాల్లో తప్పనిసరిగా హాజరు వేయాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Updated Date - Feb 27 , 2025 | 04:07 AM