COVID 19: రాష్ట్రంలో పెరుగుతున్న కొవిడ్ కేసులు
ABN, Publish Date - May 28 , 2025 | 04:28 AM
మంగళవారం రాష్ట్రంలో నాలుగు కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏలూరు, తెనాలి, తణుకు ప్రాంతాల్లో కొత్తగా కేసులు వెలుగులోకి వచ్చాయి.
ఒకేరోజు నలుగురికి కరోనా..? నిలకడగా ఆరోగ్యం
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్)
రాష్ట్రంలో మంగళవారం ఒక్కరోజే నాలుగు కొవిడ్ పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఏలూరు జిల్లా కేంద్రం ఏలూరులో ఇద్దరికి, గుంటూరు జిల్లా తెనాలిలో ఒకరికి కొవిడ్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ నిర్ధారించింది. తణుకులో మరొకరు కరోనా లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారు. నిర్ధారణ కావాల్సి ఉంది. ఈనెల 20న ఏలూరుకు చెందిన ఓ మహిళ (55) కరొనరీ యాంజియోప్లాస్టీ చికిత్స నిమిత్తం విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఆమె వెంట భర్త (63) కూడా ఉన్నారు. చికిత్స అనంతరం ఇంటికి వెళ్లిన ఆమె హఠాత్తుగా జ్వరం, జలుబు బారినపడ్డారు. దీంతో తిరిగి 24న విజయవాడలోని సదరు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఇద్దరికీ పరీక్ష చేయగా కొవిడ్ పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం భార్యాభర్తలు ఆసుపత్రిలోనే ఉన్నారు. వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. కాగా, గుంటూరు జిల్లా తెనాలి, కొత్తపేటలో కొవిడ్ తొలి కేసు నమోదైంది. ఎస్బీఐ రోడ్డులోని అపార్ట్మెంట్లో నివసిస్తున్న వృద్ధుడి(83)కి కొవిడ్ పాజిటివ్ అని తేలడంతో తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. మున్సిపల్, ఆరోగ్య శాఖ అధికారులు కొత్తపేట ప్రాంతాన్ని సందర్శించి శానిటైజ్ చేశారు.
తణుకు పట్టణంలో కరోనా అంటూ ప్రచారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు శివారులో ఒక మహిళకు కరోనా సోకిందంటూ ప్రచారం జరిగింది. ‘ఆ మహిళకు కొవిడ్ లక్షణాలు ఉండటంతో అనుమానంతో రాజమహేంద్రవరం పంపించాం. అక్కడ పరీక్షల ఫలితాలు వచ్చిన తరువాతే నిర్ధారణ చేయగలం. అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందుబాటులో ఉంది. ఎవరూ భయపడవద్దు’ అని జిల్లా వైద్యాధికారి గీతాబాయి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే
అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్కు లోకేష్ సవాల్
Read Latest AP News And Telugu News
Updated Date - May 28 , 2025 | 04:28 AM