Medical Council Chairman: కోర్టు నిర్ణయం మేరకు చర్యలు
ABN, Publish Date - Jul 05 , 2025 | 05:26 AM
విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించి ఇంటర్న్షిప్ విషయంలో ఆందోళన చేస్తున్న విద్యార్థుల సమస్యపై హైకోర్టు తీర్పును బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని మెడికల్ కౌన్సిల్ చైర్మన్ దగ్గుమాటి శ్రీహరిరావు వెల్లడించారు.
విదేశాల్లో వైద్య విద్యనభ్యసించిన విద్యార్థుల ఆందోళనపై ఎంసీ స్పందన
విజయవాడ, జూలై 4(ఆంధ్రజ్యోతి): విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించి ఇంటర్న్షిప్ విషయంలో ఆందోళన చేస్తున్న విద్యార్థుల సమస్యపై హైకోర్టు తీర్పును బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని మెడికల్ కౌన్సిల్ చైర్మన్ దగ్గుమాటి శ్రీహరిరావు వెల్లడించారు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో మీడియాతో శుక్రవారం మాట్లాడారు. ‘ప్రస్తుతం ఆందోళన చేస్తున్న విద్యార్థులు విదేశాల్లో వైద్య విద్య చదువుకుని కొవిడ్ సమయంలో ఆన్లైన్లో, ఆఫ్లైన్లో ఇంటర్న్షిప్ చేశారు. ఇక్కడే ఉండి ఆన్లైన్లో ఇంటర్న్షిప్ చేసిన వారికి రెండేళ్లు, చదువుకున్న దేశంలో ఇంటర్న్షిప్ చేసిన వారికి ఏడాది సమయం జాతీయ మెడికల్ కౌన్సిల్ ఇచ్చింది. దీనిపై కొంతమంది విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు అక్కడ పెండింగ్లో ఉంది. జాతీయ మెడికల్ కౌన్సిల్, హైకోర్టు ఇచ్చే తీర్పును బట్టి ప్రస్తుతం ఆందోళన చేస్తున్న విద్యార్థుల సమస్యకు పరిష్కార మార్గాలను యోచిస్తాం’ అని దగ్గుమాటి తెలిపారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ మాట్లాడుతూ, జాతీయ మెడికల్ కౌన్సిల్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని చెప్పారు. ఈ తరహా కేసులు బిహార్, పంజాబ్, మహారాష్ట్ర, కేరళ హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయన్నారు.
Updated Date - Jul 05 , 2025 | 05:30 AM