AP Mining Policy: ఫస్ట్గా కొట్టేయాలని
ABN, Publish Date - Jul 07 , 2025 | 01:39 AM
ఫస్ట్ కమ్ ఫస్ట్! ఇది గనుల శాఖలో అమలవుతున్న విధానం! అంటే... ఎవరు తొలుత దరఖాస్తు చేసుకుంటారో వారికే లీజు దక్కుతుందన్న మాట! ఒకవేళ... మొదటి దరఖాస్తుదారుడికి అర్హతలు లేకుంటే, తర్వాతి దరఖాస్తులను పరిశీలిస్తారు.
గనుల శాఖలో సరికొత్త ‘సమస్య’.. ‘ఫస్ట్ కమ్ ఫస్ట్’ విధానంతో ఆటలు
అస్మదీయ కాంట్రాక్టర్లతో దరఖాస్తులు అప్లోడ్
మరొకరు దరిదాపుల్లో ఉండకుండా ‘సర్వర్ డౌన్’
48 గంటలపాటు కొనసాగిన సాంకేతిక సమస్యలు
ఇద్దరు కిందిస్థాయు అధికారుల బరితెగింపు
ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించిన వైనం
చర్యలు తీసుకోవాలని సర్కారుకు ఫిర్యాదులు
‘సాంకేతిక సమస్య’... తలెత్తిందా? సృష్టించారా? సమస్య వచ్చిందే అనుకుందాం... రెండురోజులపాటు పరిష్కరించలేని పరిస్థితి ఉంటుందా? వందలు, వేల కోట్ల ఆదాయం... లీజులు ఇచ్చే గనుల శాఖలో ‘సర్వర్లు’ అలా పడకేశాయంటే ఏమిటి అర్థం? అసలేం జరిగింది?
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
‘ఫస్ట్ కమ్ ఫస్ట్’! ఇది గనుల శాఖలో అమలవుతున్న విధానం! అంటే... ఎవరు తొలుత దరఖాస్తు చేసుకుంటారో వారికే లీజు దక్కుతుందన్న మాట! ఒకవేళ... మొదటి దరఖాస్తుదారుడికి అర్హతలు లేకుంటే, తర్వాతి దరఖాస్తులను పరిశీలిస్తారు. మరి... మొదటి దరఖాస్తుతోనే ప్రక్రియ ఆగిపోతే? ఇంకెవరూ దరఖాస్తులు వేసే వీలే లేకుండా చేస్తే? మొదటి దరఖాస్తుకే టెండరు దక్కినట్లే! గనుల శాఖలో ఇప్పుడు అదే జరిగింది. దిగువస్థాయి అధికారులు కొందరు భారీ గోల్మాల్కు పాల్పడ్డారు. అస్మదీయ లీజుదారులతో ముందుగా ఆన్లైన్లో దరఖాస్తులను అప్లోడ్ చేయించారు. ఆ తర్వాత వీరికి మరొకరు పోటీరాకుండా ఉండేందుకు... సర్వర్లు పనిచేయకుండా, దరఖాస్తు స్వీకరణ చేపట్టకుండా కుయుక్తులు పన్నారు. జూన్ 30 నుంచి ఈనెల 2వ తేదీ వరకు సర్వర్లు సరిగా పని చేయకుండా వ్యూహాత్మక సాంకేతిక సమస్యలను సృష్టించారు. అస్మదీయ కాంట్రాక్టర్లు, వ్యక్తులు, సంస్థల నుంచి మాత్రమే వందల ఎకరాల భూములపై లీజులు కోరుతూ దరఖాస్తులు అప్లోడ్ చేసి... ‘ఫస్ట్’గా నిలిచారు. కొందరు అధికారులు బరితెగించి... అస్మదీయ కాంట్రాక్టర్లు, సంస్థలను గనుల శాఖ కార్యాలయానికే పిలిపించి.. అక్కడి నుంచే దరఖాస్తులను అప్లోడ్ చేయించినట్లు తెలిసింది.
అనుకూలంగా ‘మార్చుకుని’...
జగన్ ప్రభుత్వంలో గనుల లీజులను వేలం విధానంలో ఇచ్చారు. రాజకీయంగా అండదండలు, ఆర్థిక బలం ఉండి... అవతలి వాళ్లను బెదిరించే వాళ్లే ఈ వేలంలో పాల్గొనేవారు. తమ కర్ర పెత్తనంతో ఇతరులెవరూ పోటీ రాకుండా అడ్డుకున్నారు. దీని వల్ల గనుల శాఖ ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా పడిపోయింది. నోరున్నోడికే గనుల లీజులు దక్కాయి. కూటమి ప్రభుత్వం ఈ విధానంపై సమీక్ష చేసింది. వేలం వల్ల కొందరికే మేలు జరుగుతుందని భావించి దాన్ని రద్దుచేసింది. గతంలో మాదిరిగా... అంటే, ఎవరు ముందు దరఖాస్తు చేసుకుంటే వారికే ప్రాధాన్యం(ఫ్స్టకమ్ ఫస్ట్) ఇచ్చే విధానాన్ని పునరుద్ధరించింది. దీని ప్రకారం సూక్ష్మ ఖనిజాల లీజులు... అంటే గ్రావెల్, రోడ్ మెటల్, మెటల్, ఇతర వాటికి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. జూన్ 30న దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్మెటల్, గ్రావెల్, మెటల్ తదితర లీజులకు ప్రాంతాల వారీగా తొలి రెండు గంటల వ్యవధిలో దరఖాస్తులు సమర్పించారు. ఆ తర్వాత ఆన్లైన్లో సాంకేతిక సమస్యలు ‘వచ్చాయి.’ సర్వర్లో సమస్యల వల్ల దరఖాస్తులు అప్లోడ్ కావడం లేదని, ఎర్రర్ చూపిస్తోందని అనేక మంది గనుల శాఖ పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఇది నిజంగానే సాఫ్ట్వేర్ సమస్య అని ఉన్నతాధికారులు భావించారు. సంబంధిత ఐటీ కంపెనీతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని చెబుతూ వచ్చారు. కానీ... 48 గంటలపాటు... అంటే ఈనెల 2వ తేదీ ఉదయం వరకు సర్వర్లు పని చేయలేదు. ఆ తర్వాతే దరఖాస్తుల స్వీకరణ తిరిగి మొదలైంది. అంటే... అప్పటికే ‘అస్మదీయ కాంట్రాక్టర్’లకు లీజు ఖరారైపోయినట్లే!
అధికారులే ఎర్రర్ సృష్టికర్తలు
కొన్ని ప్రాంతాలు... ప్రత్యేకించి గుంటూరు, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, ఎన్టీఆర్, కృష్ణా, అన్నమయ్య, గోదావరి జిల్లాల పరిధిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే ‘అసలు సమస్య’ ఏమిటో బయటపడింది. గనుల శాఖలోని దిగువస్థాయి అధికారులే సాఫ్ట్వేర్, సర్వర్ సమస్యలను సృష్టించారని తెలిసింది. లీజులకు డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో కాంట్రాక్టర్లతో కుమ్మక్కయి... వారి దరఖాస్తులే ముందుగా ఆన్లైన్లో అప్లోడ్ అయ్యేలా, మిగతా వారు వెనకబడి పోయేలా వ్యూహాత్మకంగానే సాంకేతిక సమస్యలు సృష్టించారని తెలిసింది. తమకు టాస్క్ ఇచ్చిన వ్యక్తులు గ్రావెల్, రోడ్మెటల్, ఇతర ఖనిజాల కోసం వందలాది హెక్టార్లలో లీజులు కోరుతూ దరఖాస్తులు ముందుగానే సమర్పించేలా ఏర్పాటు చేసి.. వారి పనిపూర్తికాగానే సాంకేతిక సమస్యలు తలెత్తేలా వ్యవహరించినట్లు స్పష్టమైంది. ఉదాహరణకు చిత్తూరు జిల్లా సత్యవేడు పరిధిలోని ఓ గ్రామంలోని రెండు సర్వే నెంబర్ల పరిధిలోని రోడ్మెటల్, గ్రావెల్కోసం ఓ కంపెనీ ప్రతినిధి జూన్ 30వ తేదీనే దరఖాస్తు చేశారు. ఒకేసారి 120 హెక్టార్ల లీజుకు దరఖాస్తు చేశారు. ఆ తర్వాత రెండు రోజుల పాటు ఇతరులెవ్వరూ ఆన్లైన్లో దరఖాస్తు చేయలేకపోయారు. ఈనెల 1వ తేదీ మంగళ వారం అర్ధరాత్రి తర్వాత సర్వర్ పనిచేసింది. తిరుపతి జిల్లాలోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. గ్రావెల్, ఇతర ఖనిజాల కోసం ఒకే వ్యక్తి 116 హెకార్లలో లీజులు కోరుతూ దరఖాస్తులు ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. ఆ తర్వాత సర్వర్ సమస్యను తెరమీదకు తీసుకొచ్చారు. ఇతరులు దరఖాస్తులు అప్లోడ్ చేయలేకపోయారు. దీంతో నాలుగు లీజులకు సంబంధించి తొలి దరఖాస్తుదారుగా ఆ ఒక్క వ్యక్తే నిలిచారు. ఆయన వైసీపీ నేతకు అత్యంత సన్నిహితుడు కావడం విశేషం. సత్యవేడులోనూ ఇదే జరిగింది. అక్కడ కూడా వైసీపీ నేత ముఖ్య అనుచరుడే తొలి దరఖాస్తుదారుగా ఉన్నారు. చిత్తూరు జిల్లాలోని ఒక కీలక మండలంలోని ఆరు లీజులకు ఒక్కరే తొలి దరఖాస్తుదారుగా ఉన్నారు. ఆయన వైసీపీ మాజీ మంత్రి ప్రధాన అనుచరుడే. మొత్తం 230 ఎకరాల్లో లీజులకు తొలి దరఖాస్తుగా ఉన్న ఆయన... వైసీపీ ప్రభుత్వంలోనూ మైనింగ్ కింగ్గా చెలామణి అయ్యారు.
ఇద్దరు కీలకం..
గనుల శాఖలోని ఇద్దరు కింది స్థాయి అధికారులే... ‘సర్వర్’ సమస్య సృష్టికర్తలని తెలిసింది. గతంలోనూ వాళ్లు కీలకమైన విభాగాన్ని ఉపయోగించి అస్మదీయ కాంట్రాక్టర్లు, కంపెనీలకు మేలు చేశారన్న ఆరోపణలున్నాయి. ‘ఫస్ట్ కమ్ ఫస్ట్’ విధానంలో పారదర్శకంగా లీజుల విధానం ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యాలను తమ స్వార్థం కోసం భ్రష్టుపట్టించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామాలపై విచారణ జరిపి బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్లు, లీజుదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Updated Date - Jul 07 , 2025 | 05:23 AM