Panchayat Raj Commissioner: ఉపాధిలో పెద్ద పనులను తనిఖీ చేయండి
ABN, Publish Date - Jun 04 , 2025 | 07:30 AM
ఉపాధి పథకంలో గతేడాది చేపట్టిన పెద్ద పనులను పంచాయతీరాజ్ కమిషనర్ జిల్లా కలెక్టర్లతో కలిసి తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. క్వాలిటీ కంట్రోల్ బృందాలతో పనుల గుణాత్మకత మరియు నిఘా చర్యలపై నివేదికలు సమర్పించాలని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్లకు పంచాయతీరాజ్ కమిషనర్ లేఖలు
అమరావతి, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): ఉపాధి పథకంలో భాగంగా రాష్ట్రంలో గతేడాది చేపట్టిన పెద్ద పనులను తనిఖీ చేసి నివేదిక పంపించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ జిల్లా కలెక్టర్లకు లేఖలు రాశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అత్యధిక అంచనా విలువ కలిగిన పనులను తనిఖీ చేసేందుకు క్వాలిటీ కంట్రోల్ డీఈఈ, సోషల్ ఆడిట్ ఎస్ఆర్పీ/డీఆర్పీ, డ్వామా ఏపీడీలతో బృందాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 7లోగా తనిఖీ చేయాల్సిన పనులను ఆయా బృందాలకు కేటాయించాలని కోరారు. ఇప్పటికే ఆయా పనులకు సంబంధించి నిఘా ఏజెన్సీలు చేపట్టిన తనిఖీలు, తీసుకున్న చర్యలపై నివేదికను ఈ నెల 9లోగా సమర్పించాలని కోరారు. ఆయా శాఖలకు సంబంధించిన ఎంబుక్లు, బిల్లులు, ఓచర్లు, పనివారి ఫైళ్లు తనిఖీ బృందాలకు అందుబాటులో ఉంచాలన్నారు. తనిఖీలు సకాలంలో పూర్తి చేయాలని ఆ లేఖల్లో సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీ చేయాల్సిన పనుల వివరాలను ఆయా జిల్లాలకు పంపారు. ఈ పనుల్లో ఎక్కువగా గతేడాది నిర్వహించిన ఇంటి స్థలాల లెవలింగ్ పనులున్నాయి. వాటితో పాటు ఉపాధి నిధులు, ఇతర శాఖల నిధులతో చేపట్టిన బీటీ రోడ్లు ఉన్నాయి.
Updated Date - Jun 04 , 2025 | 07:32 AM