యోగాంధ్ర విజయవంతం చేయండి
ABN, Publish Date - Jun 20 , 2025 | 01:17 AM
యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు.
రాజమహేంద్రవరం అర్బన్, జూన్ 19 (ఆంధ్రజ్యోతి) : యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు వీడీయో కాన్ఫరెన్స్లో కలెక్టర్లతో గురువారం యోగాంధ్ర కార్యక్రమంపై సమీక్షించారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే విషయంపైనా, రానున్న రెండు రోజులు మరింత సమర్థవంతంగా సమన్వయం చేసుకోవడంపైనా సీఎం కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో యోగాంధ్ర సాధన కార్యక్రమంలో 7,71,000 మందిని భాగస్వాములను చేయాలని లక్ష్యం నిర్ధేశించగా 8,61,979 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. జిల్లాలో 4,400 మంది యోగా శిక్షకలుగా పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉండగా 5,567 మంది నమోదు చేసుకున్నారని తెలిపారు. జిల్లా, నియోజకవర్గం, మండల, గ్రామ, సచివాలయాల పరిధిలో వేడుకగా యోగా సాధన కార్యక్రమం నిర్వహించడం కోసం ప్రత్యేక అధికారులు, ఇతర క్షేత్రస్థాయి అధికారులను, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలను సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు.
యోగా మాసోత్సవాలు
యోగా మాసోత్సవాలు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయని డీఆర్వో టి.సీతారామమూర్తి అన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల జీఎన్టీ రోడ్డులో జిల్లా క్రీడాసాధికారిత సంస్థ, జిల్లా ఆయుష్శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా సాధన కార్యక్రమంలో గురువారం పాల్గొన్నారు. ప్రస్తుతం చేపడుతున్న యోగా సాధన కేవలం ఇప్పటికే పరిమితం కాకుండా ప్రతిరోజూ దినచర్యగా అలవర్చుకోవాలన్నారు.జిల్లా వ్యవసాయాధికారి ఎస్.మాధవరావు, జిల్లా క్రీడా సాధికారత సంస్థ అధికారి డీఎంఎం శేషగిరి, ఆయుష్ వైద్యులు డాక్టర్ కేసీహెచ్ రమేష్, ఆయుష్ నోడల్ అధికారిణి కేజియా, డీఐవో కోమల, ప్రభుత్వ హోమియో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీవీఎస్ సత్యకుమార్ పాల్గొన్నారు.
Updated Date - Jun 20 , 2025 | 01:17 AM