జారిపోతున్నారు!
ABN, Publish Date - May 22 , 2025 | 01:08 AM
ఇసుక చాలా ప్రమాదం.. ఎలా జారిపోతామో తెలియదు.. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో అలాగే జరుగుతుంది. వాహనదారులు వెళుతూ వెళుతూ పడిపోతే ఆ వెనుక వచ్చే వాహనాలు వారిపైనుంచి వెళ్లిన సంఘటనలు ఇటీవల కోకొల్లలు..
ప్రమాదాలకు గురవుతున్న జనం
లారీలపై పరిమితి మించి తరలింపు
ధవళేశ్వరం, కొవ్వూరులో ఇంతే
నిబంధనలు గాలికొదిలేసిన వైనం
పట్టని అధికార గణం
ధవళేశ్వరం,మే 21 (ఆంధ్రజ్యోతి): ఇసుక చాలా ప్రమాదం.. ఎలా జారిపోతామో తెలియదు.. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో అలాగే జరుగుతుంది. వాహనదారులు వెళుతూ వెళుతూ పడిపోతే ఆ వెనుక వచ్చే వాహనాలు వారిపైనుంచి వెళ్లిన సంఘటనలు ఇటీవల కోకొల్లలు.. ధవళేశ్వరంలో చూస్తే ఇటీవల ఒక కానిస్టేబుల్ కుమార్తెను బైక్పై ఎక్కించుకుని రోడ్డు పక్కగా వెళుతున్నాడు.. ఇసుకలో బైక్ టైర్ జారింది.. అంతే అతను వెళ్లి బస్ వెనుక చక్రాల కింద నలిగి మృతిచెందాడు.. మరో ఘటనలో ధవళేశ్వరం సాయిబాబా గుడి వద్ద ఒక యువకుడు ఇసుకలో జారిపడ్డాడు.. ఆ వెనుక వచ్చే లారీ అతని మీద నుంచి వెళ్లిపోవడంతో నుజ్జునుజ్జయిపోయాడు.. సీతానగరం మండలంలోనూ అలాగే జరిగింది. అయినా అధికారుల్లో మాత్రం చలనం లేదు.. చూస్తూ ఊరుకోవడం తప్ప.. లారీలను అదుపుచేసే చర్యలు మాత్రం కానరావడంలేదు.. దీంతో ఏ రోడ్డు చూసినా ఇసుక మయమే!ఇసుక లారీలకు అడ్డూ అదుపూలేకుండా పో తోంది.. 40 టన్నుల లారీలపై కొండలా ఇసుక వేసుకుని రోడ్డంతా చిమ్ము కుంటూ వెళ్లిపోతున్నారు..అయినా అడిగే నాథుడు లేడు... టార్ఫాలిన్లు కప్పా లని నిబంధనలు ఉన్నా కనీసం పట్టించుకోవడంలేదు. అయినా ఆయా వాహనాలను ఆపి ఎక్కడా కేసులు నమోదు చేసిన ఘటనలూ లేవు. దీంతో ఆయా వాహనాల డ్రైవర్లు రెచ్చిపోతున్నారు.లారీ కేబిన్లపై సైతం ఇసుక వేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసు కోవచ్చు. జిల్లాలో ధవళేశ్వరం గాయత్రీ రేవు నుంచి యథేచ్ఛగా ఇసుక రవాణా జరుగుతోంది. ఆ రేవు దిగువ భాగంలో అటు రాజ మహేం ద్రవరం ఇటు ధవళేశ్వరం వైపునకు వెళ్లేందుకు మార్గం ఉంటుంది. భారీ ఇసుక లోడుతో దిగిన లారీలు ఇసుకను రోడ్డుపై చిమ్ముకుంటూ వెళుతు న్నాయి. గాయత్రి ర్యాంపు దిగువభాగంలో అయితే కిలోమీటర్ల లెక్కన ఇసుక పేరుకుపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. క్వాయర్బోర్డు నుంచి కాటన్ బ్యారేజ్ వరకు రోడ్డుకు ఇరుపైపులా సుమారు 4 అడుగుల మేర ఇసుక పోగుబడి ఉండడంతో రద్దీ సమయంలో ద్విచక్రవాహనదారులు ప్రయాణించడం కష్టంగా మారింది. ఇసుకలో తరచూ ద్విచక్రవాహనదారులు జారి పడిపోతున్నారు. ధవళేశ్వరం సెంటర్, బొమ్మూరు సెంటర్, ఐఎల్టీడీ ఫ్లయ్ ఓవర్, రైతు బజార్ ఇలా ఎక్కడపడితే అక్కడ రోడ్లపై ఇసుక పేరుకుపోయి ప్రమాదాలకు గురవుతున్నారు. జాతీయ రహదారిపై సైతం ఇసుక మేటలు కనిపిస్తున్నాయి. కొవ్వూరు వైపు ఇదే పరిస్థితి ఉంది. కొవ్వూరు గోష్పాదక్షేత్రం, వాడపల్లి ర్యాంపు, తాళ్లపూడి వైపు ఎక్కడపడితే అక్కడ ఇసుక రోడ్లపై పేరుకుపోయింది. కడియం మండలం బుర్రిలంక ర్యాంపు వద్ద జాతీయరహదారిపై ఇసుక పోగుబడిపోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక రవాణా వాహనాలపై కఠినంగా వ్యవహరించాల్సి ఉంది.
Updated Date - May 22 , 2025 | 01:08 AM