జోరుగా వరి నాట్లు
ABN, Publish Date - Jul 08 , 2025 | 01:28 AM
ప్రస్తుతం ఖరీఫ్ (తొలకరి) వరిపంట కోసం రైతులు విత్తనాలు వేసుకుని నారుమళ్లు పెంచుకుంటున్నారు. కొంత శాతం నాట్లు వేస్తున్నారు. కడియం మండలంలో 5,278 ఎకరాల్లో రైతులు వరిసాగు చేస్తుండగా, 50 శాతం మేర నాట్లు వేశారు. ఈ నెలాఖరు నాటికి పూర్తిగా రైతులు వరిపంట నాట్లు వేయడం జరుగుతుంద న్నారు.
కడియంలో 5,278 ఎకరాల్లో సాగు
ఎంటీయూ 7029, ఎంటీయూ 1318 రకాల వైపు రైతుల మొగ్గు
50శాతం మేర నాట్లు పూర్తి
కడియం, జూలై 7(ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం ఖరీఫ్ (తొలకరి) వరిపంట కోసం రైతులు విత్తనాలు వేసుకుని నారుమళ్లు పెంచుకుంటున్నారు. కొంత శాతం నాట్లు వేస్తున్నారు. కడియం మండలంలో 5,278 ఎకరాల్లో రైతులు వరిసాగు చేస్తుండగా, 50 శాతం మేర నాట్లు వేశారు. ఈ నెలాఖరు నాటికి పూర్తిగా రైతులు వరిపంట నాట్లు వేయడం జరుగుతుంద న్నారు. ఇందులో 3,680 ఎకరాల్లో ఎంటీయూ 7029 రకం, 1598 ఎకరాల్లో ఎంటీయూ 1318 రకం వరిపంటను రైతులు సాగు చేస్తున్నారు. నారుమడి దశలో రైతులు చేపట్టవలసిన చర్యలను వ్యవసాయాధికారి పద్మలత వివరించారు.
విత్తనశుద్ధి..
నారుమడి వేసుకునే ముందు రైతులు విత్తనశుద్ధి కోసం కిలో విత్తనాలకు కార్బండిజం 25శాతం, మాంకోజెబ్ 20శాతం, మిశ్రమ శిలీంద్రనాశిని నీటిలో కరిగించి విత్తనానికి పట్టించాలి. ఈ శిలీంధ్రనాశినిని తడి విత్తనశుద్ధికి అయితే కిలో విత్తనాలకు 2 గ్రాములు, పొడివిత్తన శుద్ధికి అయితే 4 గ్రాములు వాడాలి.
నారుమడి యాజమాన్యం
ఆకుమడి దశలో 5 సెంట్లు నారుమడికి గాను యూరియా 1.5 కిలోలు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ (ఎంవోపీ) కిలో, డీఏపీ 1.5 కిలో వేయాలి. అలానే జింకు లోపాన్ని గమనిస్తే లీటరు నీటికి 2.0గ్రాముల జింక్ సల్ఫేట్ పిచికారీ చేయాలి.
పురుగుమందుల పిచికారీ
ఆకుమడి దశలో కాండం తొలిచే పురుగు లక్షణాలు కనిపిస్తే పంటకు కొర్బోఫ్యూరాన్ 3జీ గుళికలు కిలో వేయాలి. నారుమడిలో కాండం తొలిచే పురుగు, గుడ్లు కనిపిస్తే పైసస్యరక్షణ చర్యలతో పాటు నాట్లు వేసేముందు నారు కొసలు తుంచి నాటుకోవాలి.
Updated Date - Jul 08 , 2025 | 01:28 AM