స్నేహితుడు పిలిచాడని...
ABN, Publish Date - May 28 , 2025 | 01:13 AM
వారందరూ 20 ఏళ్లలోపు యువకులే.. ఏదొక విభిన్న రంగంలో నిష్ణాతులే.. ఒకరు గిటారు ప్లేయర్ అయితే.. మరొకరు కీబోర్డ్ ప్లేయర్, మరొకరు సింగర్.. ఇలా తమ తమ టాలెంట్ను చూపేవారే.. క్రాంతి, పాల్ ఇద్దరూ అన్నదమ్ము లు కాగా, వీరికి అభి, సాయి, నితీష్, మహేష్,
శుభకార్యానికి వెళ్లి విగతజీవులుగా మారిన కాకినాడ యువకులు..
పాల్ మృతదేహం లభ్యం, క్రాంతి కోసం వెతుకులాట
(కాకినాడ- ఆంధ్రజ్యోతి)
వారందరూ 20 ఏళ్లలోపు యువకులే.. ఏదొక విభిన్న రంగంలో నిష్ణాతులే.. ఒకరు గిటారు ప్లేయర్ అయితే.. మరొకరు కీబోర్డ్ ప్లేయర్, మరొకరు సింగర్.. ఇలా తమ తమ టాలెంట్ను చూపేవారే.. క్రాంతి, పాల్ ఇద్దరూ అన్నదమ్ము లు కాగా, వీరికి అభి, సాయి, నితీష్, మహేష్, రాజేష్, రోహిత్, కరుణకుమార్ వీళ్లందరూ క్రాంతి, పాల్ల తండ్రి సబ్బిత రఘు ఏలు కాకినాడ జగన్నాథపురం గోలీల పేటలో నిర్వహించే మెరిట్ మోరియా మినిస్ట్రీస్ చర్చికి వస్తుంటారు. క్రాంతి రిథమ్ ప్యాడ్ ప్లేయర్ కాగా, పాల్ మంచి గాయకుడు. క్రీస్తు కీర్తనల ఆలాపనలో దిట్ట. తల్లిదండ్రులకు పిల్లలంటే పంచ ప్రాణా లు. ఇక్కడకు వచ్చే పిల్లలను కూడా తమ పిల్లల్లాగే చూసుకునేవారు రఘు ఏలు. అం దరూ కలిసే భోజనం చేసేవారు. ఎక్కడికైనా సరదాగా వెళ్లేవారు. అలా ఈ యువకుల మధ్య స్నేహబంధం బలపడింది. ఈ నేపథ్యంలోనే తమ చర్చిలో తమతో పాటు ఉండే అభి అనే యువకుడి చెల్లి శుభకార్యానికి క్రాంతి, పాల్, దాసరి కరుణకుమార్లు కారులో కాకినాడ జగన్నాథపురం గోలీలపేట నుంచి బయల్దేరారు. ఉద యం 10.30 గంటలకు కారులో బయల్దేరిన వీరు.. అక్కడికి క్షేమంగా చేరుకున్నారు. సరదాగా గడిపారు.. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. అందరితో మంచిగా ఉండే పాస్టర్ కుటుంబంలో ఇలా జరగడం దారుణం అంటూ స్థానికులు కన్నీటిపర్యంతమవుతున్నారు. మరోవైపు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్ల లు ఇలా విగతజీవులుగా మారడంపై ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు.
ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు
గోదావరి నదిలో ఎనిమిది యువకులు గల్లంతు కాగా మంగళవారం సాయంత్రం వరకు ఏడుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. కాకినాడకు చెందిన పాస్టర్ సబ్బతి రమేష్ ఇద్దరు కుమారులు గోదావరిలో గల్లంతు కాగా ఇప్పటికే చిన్న కుమారుడు పాల్అభిషేక్ మృతదేహం లభ్యమైంది. పెద్దకుమారుడైన క్రాంతిమాన్యువల్ ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. ఇప్పటి వరకు లభ్యమైన ఏడు మృతదేహాల్లో క్రాంతి మాన్యువల్ ఆచూకీ మాత్రం ఇంకా లభ్యం కాకపోవడంతో అతని కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఇతర సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు.
ప్రమాదానికి కారణాలివే..
ముమ్మిడివరం, మే 27 (ఆంధ్రజ్యోతి): గోదావరి నదిలో ఎనిమిది యువకులు గల్లంతు ప్రమాదానికి అవగాహనా లోపం కొంత. ఇసుక తీసిన గోతులు కొంత కారణం. గౌతమీ గోదావరి నదీ పాయలో ఇసుక కోసం అక్రమ తవ్వకాలు సాగించడంతో వాటిని గమనించకుండా స్నానానికి దిగినవారు ప్రవాహ వేగంలో మునిగి మృత్యువాత పడుతున్నారు. ముమ్మిడివరం మండలం గేదెల్లంక ఉత్తరవాహిని పుష్కరవాహిని వద్ద, సలాదివారిపాలెం వద్ద నదీ పాయలో ఇసుకను తీసి అక్రమంగా తరలిస్తున్నారు. దీంతో పెద్దపెద్ద గోతులు ఏర్పడి నీటిలో స్నానానికి దిగినవారికి అవి కనిపించక ప్రవాహ వేగానికి కొట్టుకుపోతున్నారు. గోదావరి పాటు సమయంలో ఇవి కనిపించినా పోటు సమయంలో నీరు ఎక్కువగా ఉండడంతో గోతులు కనిపించవు. సోమవారం కమిని సమీపంలోని సలాదివారిపాలెంలో జరిగిన ప్రమాదానికి కూడా ఇది కొంత కారణంగా చెప్పవచ్చును. దూర ప్రాంతం నుంచి వచ్చిన ఆ యువకులకు గోదావరి లోతు గానీ, ప్రవాహ వేగంగా అంచనా లేకపోవడంతో ఒకరి తరువాత ఒకరు స్నానానికి దిగి గల్లంతవుతూ వచ్చారు. ఆ ప్రాంతంపై అవగాహన ఉన్నా అక్కడ ఉన్న స్థానికులు ఆ ప్రాంతం గురించి ముందుగా చెప్పి ఉన్నా ఇంత ప్రమాదం, ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదని పేర్కొంటున్నారు.
Updated Date - May 28 , 2025 | 01:13 AM