తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవు
ABN, Publish Date - May 07 , 2025 | 12:44 AM
ప్రభుత్వ బోధనాసుపత్రి వైద్యాధికారులు తీరుమార్చుకోవాలని కోరుతున్నాం. మార్చుకోకపోతే సాగనంపుతాం. నిర్లక్ష్యంగా ఉన్న వైద్యాధికారుల గురించి వైద్యశాఖ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడుతాం. చర్యలు తీసుకుంటాం అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు.
ఇష్టం లేకపోతే వెళ్లిపోండి.. ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవొద్దు
ప్రభుత్వ బోధనాసుపత్రి అధికారులపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి ఫైర్
ఆపరేషన్ థియేటర్లో కనీస సౌకర్యాలు లేవని వైద్యుల ఫిర్యాదు
రాజమహేంద్రవరం అర్బన్, మే 6 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ బోధనాసుపత్రి వైద్యాధికారులు తీరుమార్చుకోవాలని కోరుతున్నాం. మార్చుకోకపోతే సాగనంపుతాం. నిర్లక్ష్యంగా ఉన్న వైద్యాధికారుల గురించి వైద్యశాఖ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడుతాం. చర్యలు తీసుకుంటాం అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. మంగళవారం రాజమహేంద్రవరం ప్రభుత్వ బోధనాసుపత్రికి వచ్చిన ఆయన ఎంసీహెచ్ బ్లాకును తనిఖీ చేశారు. గర్భిణులు, డెలివరీ కోసం వచ్చిన మహిళలు, వారి సహాయకులతో మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళా వైద్యురాలు ఒకరు ఆపరేషన్ థియేటర్లో కనీస సదుపాయాలు లేవని, యూనిఫాం ఇవ్వడం లేదని, ఆరు నెలలుగా ఏసీ పనిచేయడం లేదని, ఇతర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు.
డాక్టర్ రాసిచ్చిన మందులు లేవని చెబుతున్నారని, పదిహేను రోజుల నుంచి తిరుగుతున్నా మందులు రాలేదని అంటున్నారని మరొకరు ఫిర్యాదు చేశారు. ఎంసీహెచ్ బ్లాకులో డెలివరీ కోసం వచ్చిన మహిళలకు ఓపీ రాయడానికి అక్కడికీ ఇక్కడికీ తిప్పుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇంకొకరు ఫిర్యాదు చేశారు. వీటన్నింటినీ తీవ్రంగా పరిగణించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ మీడియా సమావేశంలో ఆసుపత్రి వైద్యాధికారుల తీరుపై మండిపడ్డారు. తాను, కూటమి నాయకులు అనేకసార్లు ఆసుపత్రికి వచ్చిన సమయంలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను అధికారులకు తెలియజేసినా వాటిలో ఒక్కటి కూడా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి బాఽధ్యులెవరని ప్రశ్నించారు. ఇష్టం లేకపోతే వెళ్లిపోండి. ప్రభుత్వానికి చెడ్డపేరు తేవద్దని అన్నారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్లో మందులు లేకపోతే స్థానికంగా కొనుగోలు చేసే వెసులుబాటు ఉన్నా ఎందుకు కొనడంలేదని అన్నారు. మళ్లీ పదిహేను రోజుల తర్వాత తాను వస్తానని, అప్పటికీ పరిస్థితి మారకపోతే చర్యలు తప్పవని అన్నారు. ఎంసీహెచ్ బ్లాకులో 150 పడకలు సిద్ధంగా ఉన్నాయని, క్రిటికల్ కేర్ బ్లాకు జూన్ నెలాఖరుకు అందుబాటులోకి రానుందని అన్నారు. ఎమ్మెల్యే వెంట కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - May 07 , 2025 | 12:44 AM