ఆపసోపాలు!
ABN, Publish Date - Jun 18 , 2025 | 12:52 AM
అటు తల్లికి వందనం.. ఇటు అనర్హులకు గ్రీవెన్స్.. ఓ వైపు సచివాలయాల సిబ్బంది బదిలీలు.. మధ్యలో యోగాంధ్ర.. ఇంకోవైపు అన్నదాత సుఖీభవ.. ఇలా ముఖ్యమైన పనులన్నీ ఒకేసారి చుట్టుముట్టడంతో ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ యంత్రాంగం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
ఉద్యోగులకు ఊపిరి సలపని పని
ఒకవైపు తల్లికి వందనం గ్రీవెన్స్
ట్రాన్స్కో.. ఆర్డీవో ఆఫీస్ల వద్ద క్యూ
పోస్టల్ సిబ్బందిపైనా ప్రభావం
బ్యాంకుల్లో జనం కిటకిట
మరోవైపు యోగాంధ్ర నిర్వహణ
ప్రధాని బందోబస్తుకు పోలీసులు
20న అన్నదాత సుఖీభవ
సచివాలయ ఉద్యోగుల బదిలీలు
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
అటు తల్లికి వందనం.. ఇటు అనర్హులకు గ్రీవెన్స్.. ఓ వైపు సచివాలయాల సిబ్బంది బదిలీలు.. మధ్యలో యోగాంధ్ర.. ఇంకోవైపు అన్నదాత సుఖీభవ.. ఇలా ముఖ్యమైన పనులన్నీ ఒకేసారి చుట్టుముట్టడంతో ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ యంత్రాంగం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అధికారులు హైరానా పడుతూ సిబ్బందిని పరుగులు పెట్టిస్తున్నారు. కొందరు అర్ధరాత్రుల వరకూ సీట్లలో ఉండక తప్పని పరిస్థితి. ప్రాధాన్యతా క్రమాన్ని అనుసరించి నోడల్ అధికారులను నియమించినా.. చివరికి క్షేత్ర స్థాయిలో అన్నీ సిబ్బందిపైనే పడుతుండడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. పనిచేయలేక ఆపసోపాలు పడుతున్నారు.. ప్రభుత్వ ఉద్యోగులకు ఒత్తిడి తప్పడంలేదు.. వద్దన్నా ఉరుకులు పరుగులు పెడుతున్నారు.. రకరకాల సమస్య లతో ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు సమాధా నం చెప్పలేక తలలు పట్టుకుంటున్నారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి మొదటి విడత జాబితాలో లేని వారు ఉమ్మడి తూర్పులో సుమారు 1.50 లక్షల మంది ఉంటారు. కరెంటు బిల్లు ఏడాదికి సగటున 300 యూని ట్లు దాటిపోవడం, కారు ఉండడం, ఇన్కంట్యాక్స్ రిటర్ను లు వంటి కారణాలతో అనర్హతకు గురయ్యారు. వీళ్లంద రికీ ప్రభుత్వం గ్రీవెన్స్ పేరుతో ఈనెల 20వ తేదీ వరకూ సచివాలయాల్లో తమ గోడు వినిపించుకునే అవకాశం కల్పించింది. అంటే ఇక మిగిలింది కేవలం రెండు రోజులే.. ఈ నేప థ్యంలో ఆయా కార్యాలయాల వద్ద ప్రతిరోజూ వేల సంఖ్యలో జనం క్యూ కడుతున్నారు. తల్లికి వందనం సొమ్ములకు పాట్లు పడుతున్నారు. తల్లికి వందనం వినతులు సచివాల యాల్లో అప్లోడ్ చేయించాలి.. సం దట్లో సడేమియా అన్నట్టు సచివా లయ సిబ్బంది బదిలీలను తెరపైకి తెచ్చారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 12 వేల మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం సచివాలయాలకు వెళ్లినా బదిలీ మూడ్లో ఉన్న సిబ్బంది సమాధానం చెప్పేందుకు ఇష్టపడడం లేదు. దీంతో జనం గొడవపడుతున్నారు. మరోవైపు అన్నదాత సుఖీభవ జాబితాలు సిద్ధం కావాల్సి ఉంది. ఈనెల 20వ తేదీనే సాయం విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ సమయంలో సచివాలయ సిబ్బందిని బదిలీ చేయడమంటే సాహసమనే చెప్పాలి.
21న యోగాంధ్ర...
ఈనెల 21వ తేదీన యోగాంధ్రను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని జేసీ స్థాయి అధికారులను నోడల్ అధికారు లుగా నియమించారు. ప్రధాని మోదీ విశాఖ పర్యటన కూడా యోగాంధ్రను పురస్కరించుకునే చేస్తున్నారు. అం తటి ప్రాధాన్యం ఉండడంతో 25 రోజులుగా అధికారులు ఉరుకులు.. పరుగులు పెడుతున్నారు. ప్రతి రోజూ సా మూహిక యోగా సాధన, రెండు రోజుల కిందట ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. జిల్లాల్లోని ఏర్పాట్లు ఓ ఎత్తయితే విశాఖపట్నానికి సుమారు వెయ్యి బస్సుల వరకూ పంపించాలనే ఆదేశాలున్నాయి. తూర్పుగోదా వరి జిల్లా నుంచే 500 బస్సులు అక్కడికి వెళ్లాల్సి ఉంది. అయితే శనివారం పాఠశాలలకు సెలవు కాకపోవడంతో ప్రైవేటు పాఠశాలల బస్సుల ఏర్పాటుపై సంబంధిత శాఖల అధికారులు తలపట్టుకుంటున్నారు. ప్రధాని మోదీ విశాఖపట్నం పర్యటన పురస్కరించుకుని మూడు జిల్లాల నుంచీ పెద్ద సంఖ్యలో పోలీసులు తరలి వెళ్లారు. బందో బస్తుకు ఎస్పీలతో సహా అధిక సంఖ్యలో అధికా రులు, సిబ్బంది వెళ్లారు. మొత్తం ఉమ్మడి తూర్పు గోదా వరి జిల్లా నుంచి సుమారు 700 మంది విశాఖ బందో బస్తులో ఉన్నారు. 22న ఆదివారం కావడంతో 23వ తేదీ వరకూ అందుబాటులో ఉన్న సిబ్బందితోనే జిల్లాల్లోని అన్ని డ్యూటీలూ నెట్టుకురావాల్సిన పరిస్థితి ఉంది.
పోస్టల్ సిబ్బందికీ పనే..
ఇక తల్లికి వందనం డబ్బులు ఖాతాల్లో జమచేయడం మొదలు పెట్టిన దగ్గర నుంచీ బ్యాంకులు, పోస్టాఫీసులు కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే భారీ క్యూలు కడుతున్నారు. అకౌంట్లో సొమ్ములు పడిన వెంటనే విత్ డ్రా చేయడానికి జనం వెళుతున్నారు. డబ్బులు తీసుకోక పోతే వెనక్కి వెళ్లిపోతాయనే వదంతులతో జనం బ్యాం కులు, పోస్టాఫీసుల ఎదుట కిక్కిరిస్తున్నారు. రాజమండ్రి పోస్టల్ డివిజన్కి సంబంధించి ప్రధాన పోస్టాఫీసులో సాధారణ రోజుల్లో రోజుకు సుమారు రూ.15 లక్షల వరకూ పేమెంట్స్ ఉంటాయి. తల్లికి వందనం అమలు దగ్గర నుంచీ రోజుకు రూ.2 కోట్ల వరకూ చెల్లింపులు ఉంటున్నాయి. పోస్టాఫీసుల్లో చెస్ట్ (పెద్దఎత్తున డబ్బు నిల్వ ఉంచేది) ఉండదు. అందువల్ల పోస్టల్ డబ్బులను ఎస్బీఐలో ఉంచుతారు. విత్డ్రాలు ఒక్కసారిగా పెరగ డంతో బ్యాంకుల నుంచి పోస్టాఫీసులకు పెద్దఎత్తున డబ్బు సమకూర్చడం కష్టమవుతోందని చెబుతున్నారు. ఉమ్మడి తూర్పులోని వెయ్యి వరకూ ఉన్న పోస్టాఫీసు లతోపాటు కాకినాడ, అమలాపురం, రాజమండ్రి డివిజన్ల ప్రధాన పోస్టాఫీసుల్లో కూడా రద్దీ ఎక్కువగానే కనబ డుతోంది. రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం పోస్టల్ డివిజన్లలో చాలా మంది ఖాతాలు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)కి లింక్ కాకపోవడంతో పోస్టాఫీసులపై ఇప్పుడు ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో పోస్టల్, బ్యాంకు సిబ్బందికి విధుల్లో క్షణం తీరిక ఉండడం లేదు.
Updated Date - Jun 18 , 2025 | 12:55 AM