కోకో గింజలకు లాభసాటి ధర కల్పించాలి
ABN, Publish Date - Apr 19 , 2025 | 12:59 AM
కోకో గింజలకు లాభసాటి కల్పించాలని కోరుతూ భారతీయ కిసాన్ సంఘ్ జిల్లాశాఖ ప్రతినిధుల బృందం శుక్రవారం అమలాపురం ఎంపీ గంటి హరీష్మాధుర్కు వినతిపత్రం అందజేశారు.
అమలాపురం టౌన్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): కోకో గింజలకు లాభసాటి కల్పించాలని కోరుతూ భారతీయ కిసాన్ సంఘ్ జిల్లాశాఖ ప్రతినిధుల బృందం శుక్రవారం అమలాపురం ఎంపీ గంటి హరీష్మాధుర్కు వినతిపత్రం అందజేశారు. బీకేఎస్ జిల్లా శాఖ అధ్యక్షుడు చేకూరి సూర్యనారాయణరాజు, కోకోరైతు సంఘం జిల్లా శాఖ అధ్యక్షుడు ఉప్పుగంటి భాస్కరరావులు కోకో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎంపీకి వివరించారు. గత ఏడాది కిలో కోకో గింజల ధర రూ.1040కు క్యాడ్బరీ సంస్థ కొనుగోలు చేసిందన్నారు. ఈఏడాది జనవరిలో మాత్రం కిలో రూ.650కు కొనగా నేడు రూ.550 మాత్రమే ధర చెల్లిస్తుందన్నారు. అంతర్జాతీయంగా కోకో గింజలకు ఎంతో మార్కెట్ ఉన్నప్పటికీ పండిచిన రైతులకు కనీసం గిట్టుబాటు ధర కూడా అందని పరిస్థితి ఏర్పడిందన్నారు. అంతర్జాతీయంగా కోకో గింజల ధర రూ.750 ఉన్నప్పటికీ రూ.550 మాత్రమే కోనసీమలో చెల్లిస్తున్నారని వివరించారు. కోకో రైతుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు, వ్యవసాయశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడుల దృష్టికి ఇప్పటికే తీసుకువెళ్లాల న్నారు. సకాలంలో గింజలను కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోకో రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కోకో గింజల ఇంపోర్టు డ్యూటీ తగినంత పెంచి రైతుల వద్దనున్న గింజలన్నీ కొనుగోలు చేయడంతో పాటు లాభసాటి ధర కల్పించాలని ఎంపీ హరీష్ను అభ్యర్థించారు. కోకో రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. రాష్ట్ర కోకో రైతు సంఘం సహాయ కార్యదర్శి కొప్పిశెట్టి ఆనందవెంకటప్రసాద్, బీకేఎస్ జిల్లా కార్యదర్శి వంకాయల స్వామిప్రకాష్, అడబాల రాజామోహన్, రైతు సంఘ అధ్యక్షుడు అప్పారి వెంకటరమణ, కొలిశెట్టి త్రిమూర్తులు పాల్గొన్నారు.
Updated Date - Apr 19 , 2025 | 12:59 AM