తీరానికి తల‘పోటు’
ABN, Publish Date - Jun 18 , 2025 | 01:46 AM
కోనసీమ డ్రెయిన్లలో ఉప్పునీరు పోటెత్తడం పెనుముప్పుగా మా రింది. సాధారణంగా ఏడాదికి ఒకసారి మే నెలలో కర్తరి పోటుకు సముద్ర జలాలు పోటెత్తి పొలాల్లోకి ప్రవహించడం సాధారణమే.
ఉప్పలగుప్తం, జూన్ 17(ఆంధ్రజ్యోతి): కోనసీమ డ్రెయిన్లలో ఉప్పునీరు పోటెత్తడం పెనుముప్పుగా మా రింది. సాధారణంగా ఏడాదికి ఒకసారి మే నెలలో కర్తరి పోటుకు సముద్ర జలాలు పోటెత్తి పొలాల్లోకి ప్రవహించడం సాధారణమే. అయితే ఈ ఏడాదంతా ఉప్పునీరు పొలాల్లోకి ఎగదన్నడం రైతులకు శాపంగా మారింది. ఉభయగోదావరి జిల్లాల్లోని మలికిపురం, అల్లవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన, ఐ.పోలవరం, తాళ్లరేవు తోపాటు పశ్చిమగోదావరి జిల్లాలోని పలు మండలాల్లో చాలాకాలంగా రైతులు ఉప్పునీటి పోటు సమస్యను ఎదుర్కొంటున్నారు. సమస్య పరిష్కారానికి ఎప్పటికప్పుడు తాత్కాలిక చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. అయితే ఫలితం శూన్యం. ఏటా సార్వా సాగు చేయడం, ఉప్పునీటికి బలవ్వడం అన్నదాతకు ఆనవాయితీగా మారింది. అలాగే కొబ్బరి చెట్లు చనిపోవడంతో భారీగా నష్టం వాటిల్లుతోంది. ఈ ఏడాది సముద్ర జలాల పోటుపై రైతుల్లో మరింత ఆందోళన పెరిగింది. దీంతో కోనసీమ వ్యాప్తంగా నీటి వినియోగదారులు సంఘాలు ఉన్నతాధికారులను కలిసి పోటు సమస్యకు పరిష్కారం చూపించాలని కోరుతున్నారు. కోనసీమలో పోటు సమస్య పరిష్కారానికి జిల్లా కలెక్టర్ ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. కోనసీమలోని ప్రధాన మేజర్ డ్రెయిన్లలో ఒకటైన కూనవరం డ్రెయిన్లో ప్రస్తుతం ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. అంతకుముందు రంగరాజుకోడుతో సహా పలు డ్రెయిన్లలో మేటలు తొలగించారు. అయినా పరిస్థితిలో మార్పు లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి డ్రెయిన్లలో పూడికతీత పనులు చేపడుతున్నా ప్రయోజనం లేకపోవడం గమనార్హం. సార్వా సాగుకు ఇప్పటికే జాప్యం జరిగింది. ఇప్పుడు నారుమళ్లు పోయాలంటే పొలాల్లో ఉప్పునీరు తిష్టవేసింది. అది బయటకు పోయేదెప్పుడు? నారు పోసేదెప్పుడు? నాట్లు పడేదెప్పుడు? వీటికి జవాబు దొరక్క రైతులు సందిగ్దంలో పడ్డారు.
Updated Date - Jun 18 , 2025 | 01:46 AM