ఈ ఏడాది చివరికి టిడ్కో గృహాలిస్తాం
ABN, Publish Date - Jun 28 , 2025 | 12:55 AM
ఈ ఏడాది చివరి నాటికి లక్ష టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందించేం దుకు చర్యలు తీసుకుంటున్నామని టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్కుమార్ తెలిపారు.
గృహాలకు వైసీపీ హయాంలో డ్యామేజ్
బాగు చేయించడానికే రూ.4 వేల కోట్లు
కొవ్వూరు, జూన్ 27 (ఆంధ్రజ్యోతి) : ఈ ఏడాది చివరి నాటికి లక్ష టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందించేం దుకు చర్యలు తీసుకుంటున్నామని టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్కుమార్ తెలిపారు. అన్నవరం వెళుతూ మార్గమధ్యంలో మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు నివా సానికి వెళ్లారు. వైసీపీ ప్రభుత్వం టిడ్కో గృహాలకు చేసిన డ్యామేజీ సంవత్సరంలో పూరించేది కాదన్నారు. టిడ్కో లబ్ధిదారుల పేరు మీద తీసుకున్న రుణాలకు సంబంధించి 2025 మే 31 వరకు బ్యాంకులకు చెల్లించాల్సిన ఇన్స్టాల్మెంట్స్ బకాయిలు జూన్ నెలాఖరు నాటికి దశలవారీగా రూ.185 కోట్లు ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ఇటీవల కాకినాడ కలెక్టర్ జిల్లాకు సంబంధించి మొత్తం చెల్లించామని తెలియజేశారన్నారు. లబ్ధిదారులకు ఈ ఏడాదిలోనే గృహాలను అప్పగించాలని ఆలోచన చేస్తున్నామన్నారు. ముందుగా 365, 430 చదరపు అడుగుల గృహాలను ఇస్తామన్నారు. ఒక్కొక్క ఇంటికి రూ.60 వేల నుంచి రూ. 70 వేలు మళ్లీ అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుందన్నా రు. సుమారు రూ.4 వేల కోట్లు ఖర్చవుతుందన్నారు. ఇప్పటికి ప్రభుత్వం రూ.16,250 కోట్లు ఖర్చు చేసిందన్నారు. అంత ఖర్చుచేసిన గృహాలను గత ఐదేళ్లు నిరుపయోగంగా వదిలేయడం బాధాకరమన్నారు. గతంలో టిడ్కో గృహం మంజూరై ప్రస్తుతం వయసు పరిమితి దాటిన వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా (కో అప్లిక్లెంట్) వారి పిల్లలకు ఇల్లు అందించేలా ఇప్పటికే ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి జనసేనాని పవన్ కల్యాణ్ ఆవిరళ కృషే కారణమన్నారు.పదవులు రాలేదని పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు. రెండు నెలల్లో పార్టీ కమిటీలు నియమిం చడం జరుగుతుందన్నారు.స్థానిక సంస్థల ఎన్నికలు వస్తు న్న తరుణంలో పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలన్నారు.కార్యక్రమంలో జనసేన కొవ్వూరు ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే టి.వి. రామారావు, నామాన బూరయ్య, సిద్ధా రామకృష్ణ, కల్లూరి సుబ్రహ్మణ్యం, చేవ్వూరి రాము, రాగు వీర్రాజు, బోడెం వెంకట సుబ్రహ్మణ్యశర్మ, విజయభాస్కర్, తాతారావు, ఊలపల్లి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 28 , 2025 | 12:55 AM