80 అడుగులతో బండారులంక రోడ్డు
ABN, Publish Date - May 24 , 2025 | 01:01 AM
అమలాపురం నుంచి అంబాజీపేటవైపు వెళ్లే ఏజీ రోడ్డును 80 అడుగులతో అభివృద్ధి చేసేలా మాస్టర్ ప్లాన్ ఆమోదించారు.
అమలాపురం రూరల్, మే 23(ఆంధ్రజ్యోతి): అమలాపురం నుంచి అంబాజీపేటవైపు వెళ్లే ఏజీ రోడ్డును 80 అడుగులతో అభివృద్ధి చేసేలా మాస్టర్ ప్లాన్ ఆమోదించారు. దాంతో అమలాపురం అర్బన్ డెవలెప్మెంట్ అథారిటీ అమలాపురం పట్టణాన్ని ఆనుకుని ఉన్న పది గ్రామాలకు రోడ్ల అభివృద్ధిపై నోటీసులు జారీ చేసింది. 60రోజుల పాటు సంబంధిత మాస్టర్ ప్లాన్ ప్రతులను గ్రామాల వారీగా ఆయా పంచాయతీ కార్యాలయాల వద్ద నోటీసు బోర్డుల్లో ప్రదర్శనకు ఉంచారు. దీనిలో భాగంగా బండారులంక రోడ్డును ఈదరపల్లి వంతెన వద్ద నుంచి అంబాజీపేట వరకు 80అడుగుల మేర అభివృద్ధి చేసేలా ప్రతిపాదించారు. ప్రస్తుతం ఈరోడ్డు 30అడుగుల వెడల్పుతో మాత్రమే ఉంది. దాంతో మరో రెండు రెట్లు మేర రోడ్డును అటూ ఇటూ అభివృద్ధి చేయాల్సి ఉందని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఈదరపల్లి నుంచి బండారులంక మీదుగా అంబాజీపేట వెళ్లే రోడ్డును ఆనుకుని ఆక్రమణలు జరిపి పలువురు పక్కా కట్టడాలను సైతం నిర్మించారు. కొందరైతే వ్యాపార కూడళ్లుగా మార్చేశారు. రోడ్డును సైతం ఆక్రమించుకున్న పరిస్థితులు పలుచోట్ల కనిపిస్తున్నాయి. అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, వైస్చైర్మన్, జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి మాస్టర్ ప్లాన్ అమలుచేసేలా నోటీసులు జారీ చేయడంతో ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అమలాపురం పట్టణాన్ని ఆనుకుని ఉన్న పది గ్రామాల్లో రోడ్డును 40అడుగుల నుంచి సుమారు వంద అడుగుల వరకు అభివృద్ధి చేసేలా ప్రణాళికలను సిద్ధం చేశారు. ప్రధానంగా ఏజీ రోడ్డును ఆనుకుని ఆక్రమణలు జరగడంతో ఆయా స్థలాలను, నిర్మించిన షాపులను కొందరు వ్యాపారాత్మకంగా ఏటా లీజులకు ఇస్తున్నారు. మరికొందరైతే లక్షలాది రూపాయలతో విక్రయాలు జరుపుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇదిలా ఉండగా 80అడుగుల మేర రోడ్డును అభివృద్ధి చేసే ఈదరపల్లి నుంచి అంబాజీపేట వరకు పలువురు గృహాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. దాంతో ఇప్పటికే సమాచారం తెలుసుకున్న బాధితులు లబోదిబో మంటున్నారు. 60రోజులు గడువు ఇచ్చి అభ్యంతరాలు తెలపాలని అముడా ప్రకటించిన నేపథ్యంలో పలువురు అభ్యంతరాలు తెలిపేందుకు ప్రయత్నిస్తుంటే మరికొందరు ప్రత్యామ్నాయ మార్గాలవైపు దృష్టి సారించారు. కొందరు నాయకులైతే ప్రజా ప్రతినిధులను కలిసి తమగోడును వెల్లబోసుకున్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే మాస్టర్ ప్లాన్ను ఆమోదించడం జరిగిందని ప్రజాప్రతినిధులు స్పష్టం చేయడంతో ఆయా నాయకులు వెనుదిరిగా.
మాస్టర్ ప్లాన్ మేరకే అనుమతులు
మాస్టర్ ప్లాన్ నిబంధనల మేరకే భవన నిర్మాణాలకు, లేఅవుట్లకు అనుమతులు జారీ చేస్తామని అముడా చైర్పర్సన్ అల్లాడ స్వామినాయుడు ప్రకటించారు. గ్రామ పంచాయతీల పరిధిలో 300 చదరపు మీటర్లలోపు స్థలంలో వ్యక్తిగత నివాస భవనాల అనుమతులు సైతం మాస్టర్ ప్లాన్కు లోబడే జరుగుతాయన్నారు. మాస్టర్ ప్లాన్ ప్రతిపాదిత రోడ్ల మార్గంలో ఏవిధమైన అనుమతులు ఇవ్వరాదని సూచించారు. పట్టణాన్ని ఆనుకుని ఉన్న 10గ్రామాలకు ఇవే నిబంధనలు వర్తిస్తాయన్నారు. మెట్రో పాలిటెన్ రీజియన్అండ్అర్బన్ డెవప్మెంట్ అథారిటీస్ యార్డు 2016ను అనుసరించి ప్రతిపాదిత రోడ్ల ప్రకారం నిర్మాణాలకు అనుమతులిస్తామన్నారు.
Updated Date - May 24 , 2025 | 01:01 AM