AP Rainfall: రాష్ట్రమంతటా రుతుపవనాలు
ABN, Publish Date - May 29 , 2025 | 05:59 AM
ఈసారి నైరుతి రుతుపవనాలు సాధారణ కాలంలో ముందే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో విస్తరించాయి. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడి, కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులతో మత్స్యకారులకు ఎಚ್ಚరికలు జారీ అయ్యాయి.
పక్షం రోజుల ముందే విస్తరించిన నైరుతి
విశాఖపట్నం, అమరావతి, మే 28 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు బుధవారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ విస్తరించాయి. సాధారణంగా మే 27కు అండమాన్కు రావాల్సి ఉండగా, ఈ ఏడాది మే 13నే వచ్చాయి. దేశంలోకి జూన్ 1కి వచ్చే రుతుపవనాలు ఈసారి మే 24నే కేరళను తాకాయి. రాయలసీమకు జూన్ 4న వచ్చి, రాష్ట్రమంతా జూన్ 13 నాటికి విస్తరించాల్సి ఉండగా, ఈ సారి మే 26నే రాయలసీమలోకి ప్రవేశించాయి. ఆపై జూన్ 13 నాటికి ఇచ్చాపురం వరకు వెళ్లాల్సి ఉండగా, 15 రోజుల ముందే రాష్ట్రమంతా విస్తరించాయి.
వర్షాలు.. ప్రమాదాలు.. జాగ్రత్త
మరోవైపు బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బుధవారం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. గురువారం నాటికి ఉత్తరంగా పయనించి వాయుగుండంగా బలపడనుంది. దీని ప్రభావంతో ఉత్తరకోస్తాలో ఎక్కువచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయి. ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీవర్షాలు కురుస్తాయని, వర్షాలు కురిసే సమయంలో గంటకు 50 నుంచి 60 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. విశాఖ ఆర్కే బీచ్లో సముద్రం ముందుకువచ్చింది. కురుసుర మ్యూజియం వద్ద తీరం కోతకు గురైంది.
Also Read:
మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు
బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్
For More Telugu And National News
Updated Date - May 30 , 2025 | 02:55 PM