Dual Certification: ఇంటర్లో డ్యూయల్ సర్టిఫికెట్
ABN, Publish Date - Jun 02 , 2025 | 06:12 AM
ఇంటర్మీడియట్ వృత్తి విద్యా కోర్సుల్లో డ్యూయల్ సర్టిఫికేషన్ విధానానికి జాతీయ వృత్తి విద్య, శిక్షణ మండలి ఆమోదం తెలిపింది. 2025-26 విద్యా సంవత్సరంలో ఈ కొత్త విధానం అమలులోకి వస్తుంది. దీని ద్వారా విద్యార్థులు ఇంటర్ బోర్డు మరియు ఎన్సీవీఈటీ రెండూ ఆమోదించిన సర్టిఫికెట్లు పొందగలుగుతారు.
ఉపాధి, ఉద్యోగాలకు మరింత ఊతం
2025-26 నుంచి ఒకేషనల్ కోర్సుల్లో అమలు
డ్యూయల్ విధానానికి ఎన్సీవీఈటీ ఆమోదం
త్వరలో మంత్రి లోకేశ్ సమక్షంలో ఒప్పందం
డ్యూయల్ సర్టిఫికెట్తో అదనపు ప్రయోజనాలు
ఈవీ, సోలార్ తరహా కొత్త కోర్సులు
అమరావతి, జూన్ 1(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ వృత్తి విద్యా కోర్సుల్లో డ్యూయల్ సర్టిఫికేషన్ విధానానికి ఆమోదం లభించింది. రాష్ట్ర ఇంటర్ బోర్డు ప్రతిపాదనకు జాతీయ వృత్తి విద్య, శిక్షణ మండలి(ఎన్సీవీఈటీ) అంగీకరించింది. త్వరలో మంత్రి లోకేశ్ సమక్షంలో ఇంటర్ బోర్డు, ఎన్సీవీఈటీ ఒప్పందం చేసుకోనున్నాయి. ఆ వెంటనే నూతన విధానం అమల్లోకి వస్తుంది. ఫలితంగా 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ఒకేషనల్ కోర్సుల్లో చేరేవారికి డ్యూయల్ సర్టిఫికేషన్ లభిస్తుంది. అంటే ఇంటర్ బోర్డు జారీచేసే సర్టిఫికెట్లోనే ఎన్సీవీఈటీ ఆమోదం కూడా కనిపిస్తుంది. రాష్ట్రంలో ఒకేషనల్ కోర్సులు చదువుతున్నవారు సుమారు 90 వేల మంది ఉన్నారు. వారికి మొదటి నుంచీ రాష్ట్ర ఇంటర్ బోర్డే సర్టిఫికెట్లు జారీచేస్తోంది. కానీ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో బయటి రాష్ర్టాల్లో ఉద్యోగాలకు, రాష్ట్రంలోని ప్రముఖ కంపెనీల ఉద్యోగాలకు ఎన్సీవీఈటీ సర్టిఫికెట్ అవసరం అవుతోంది.
జాతీయ స్థాయి గుర్తింపు
ఇంటర్మీడియట్ పూర్తయిన వెంటనే ఉద్యోగావకాశాలు పొందాలనుకునేవారే ఒకేషనల్లో చేరుతుంటారు. అలాంటివారికి రాష్ట్ర బోర్డు జారీచేసే సర్టిఫికెట్ కంటే ఎన్సీవీఈటీ సర్టిఫికెట్తో అదనపు ప్రయోజనాలుంటాయి. కేంద్ర ప్రాయోజిత పథకాల్లోనూ లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. దీనికోసం ఇంటర్ బోర్డు ఎన్సీవీఈటీతో కలిసి పనిచేస్తుంది. కరిక్యులమ్, బోధనా విధానం, శిక్షణ అంశాల్లో సహకారం తీసుకుంటుంది. ఎన్సీవీఈటీ గుర్తింపు పొందిన సర్టిఫికెట్లకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంటుంది. విద్యార్థుల నైపుణ్యాలను పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా పెంపొందిస్తారు. రెండేళ్ల కోర్సు అనంతరం విద్యార్థులకు ఇంటర్న్షిప్ చేసే అవకాశం కూడా లభిస్తుంది.
త్వరలో కొత్త కోర్సులు
డ్యూయల్ సర్టిఫికేషన్తో పాటు కొత్త కోర్సులు కూడా ప్రవేశపెట్టాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఎలక్ర్టిక్ వాహనాలకు సంబంధించిన కోర్సు, సోలార్ విద్యుత్ కోర్సును తీసుకురానున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 23 ఒకేషనల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, లైవ్ స్టాక్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ఎక్కువ మంది చేరుతున్నారు. టూరిజం ట్రావెల్ టెక్నీషియన్, హోటల్ ఆపరేషన్స్, ఫ్యాషన్-గార్మెంట్ మేకింగ్ కోర్సులకు ఆదరణ తగ్గిపోతోంది. దీంతో డిమాండ్ ఉన్న కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది.
లెవెల్తో సర్టిఫికెట్
డ్యూయల్ సర్టిఫికేషన్ ఖచ్చితత్వంతో ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఉదాహరణకు ఈవీ రంగంలో ఆ విద్యార్థి ఏ దశలో పనిచేయగలడు అనేది నిర్దేశించేలా ‘లెవెలింగ్’ సర్టిఫికెట్లో పొందుపరుస్తారు. ఇంటర్ ఒకేషనల్ పూర్తిచేసిన విద్యార్థులకు 3.5 లేదా 4 లెవెలింగ్తో సర్టిఫికెట్లు జారీ అవుతాయి. ఆ లెవెల్ శిక్షణ పొందినవారు ఏ దశలో పని చేయగలుగుతారనే అంచనా ఉంటుంది. దానివల్ల పరిశ్రమలు ఖచ్చితంగా ఫలానా స్థాయి సర్టిఫికేషన్ ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసుకునే వీలుంటుంది.
ఇవీ చదవండి:
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 02 , 2025 | 06:12 AM