Excise Department : గుంటూరులో ఎండీఎంఏ డ్రగ్స్ కలకలం!
ABN, Publish Date - Feb 18 , 2025 | 05:09 AM
గతనెల 19న కొకైన్ మత్తుమందు వెలుగు చూడగా.. తాజాగా మిథైలీన్డైయోక్సీ- ఎన్- మెథాంఫెటమిన్ (ఎండీఎంఏ) దొరికింది.
13 గ్రాముల పట్టివేత.. అదుపులో 11 మంది నిందితులు?
గుంటూరు కార్పొరేషన్, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): గుంటూరు నగరంలో మరోమారు డ్రగ్స్ కలకలం రేగింది. గతనెల 19న కొకైన్ మత్తుమందు వెలుగు చూడగా.. తాజాగా మిథైలీన్డైయోక్సీ- ఎన్- మెథాంఫెటమిన్ (ఎండీఎంఏ) దొరికింది. ఇలా వరుసగా మత్తు మందులు దొరకడంతో స్థానికులు కలవరం చెందుతున్నారు. నిషేధిత ఎండీఎంఏపై సోమవారం సమాచారం అందడంతో గుంటూరు ఎక్సైజ్ శాఖ సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో గుంటూరు సమీపంలోని గోరంట్ల వద్ద 10 గ్రాములు, చుట్టుగుంట వద్ద 3 గ్రాములు ఎండీఎంఏ మత్తు మందుతోపాటు ఒక కిలో గంజాయి కలిగి ఉన్న 11 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఎండీఎంఏను ట్యాబ్లెట్ల రూపంలోకి మార్చి ఇక్కడికి తీసుకువచ్చారని అధికారులు గుర్తించినట్టు తెలిసింది. ఇది ఎక్కడ నుంచి వచ్చింది?. దీని వెనక ఎవరెవరు ఉన్నారు? అనే దానిపై ఎక్సైజ్ శాఖ అధికారులు కూపీ లాగుతున్నారు.
Updated Date - Feb 18 , 2025 | 05:09 AM