TDP vs YCP Jail Row: అప్పుడలా.. ఇప్పుడిలా..
ABN, Publish Date - Jul 25 , 2025 | 02:58 AM
తమదాకా వస్తేగానీ వైసీపీ పెద్దలకు తత్వం బోధపడలేదు. నాడు టీడీపీ అధినేత చంద్రబాబును రాజమండ్రి జైలులో ఉంచిన స్నేహా బ్లాక్కే నేడు రూ.వేలకోట్ల మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి చేరుకున్నారు. ఏ సౌకర్యం ఇవ్వకుండా ఆనాడు చంద్రబాబును...
నాడు చంద్రబాబును హింసించారు
ఇప్పుడు మిథున్ కోసం కన్నీరు
బాబు కష్టాలకు స్నేహా బ్లాక్ మౌనసాక్ష్యం
ఇదే బ్లాక్లో ఇప్పుడు ఎంపీ మిథున్రెడ్డి
బాబు జైలులోకి వెళుతున్న దృశ్యాలు జగన్ మీడియాలో పదేపదే ప్రచారం.. పైశాచికం
రోజులపాటు గదిలో ఒక కుర్చీ మాత్రమే
ఒళ్లంతా దద్దుర్లు వచ్చినా చికిత్సలో నిర్లక్ష్యం
ములాఖత్లకు జైలు అధికారుల మెలికలు
కంటికి శస్త్ర చికిత్సపై నివేదికలూ మార్పు
మిథున్రెడ్డికి అన్ని సౌకర్యాలు
తాలిబన్లు..టెర్రరిస్టులు అప్పుడు గుర్తులేరా?
పెద్దిరెడ్డికి నెటిజన్లు, టీడీపీ శ్రేణుల కౌంటర్
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి): తమదాకా వస్తేగానీ వైసీపీ పెద్దలకు తత్వం బోధపడలేదు. నాడు టీడీపీ అధినేత చంద్రబాబును రాజమండ్రి జైలులో ఉంచిన స్నేహా బ్లాక్కే నేడు రూ.వేలకోట్ల మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి చేరుకున్నారు. ఏ సౌకర్యం ఇవ్వకుండా ఆనాడు చంద్రబాబును చాలారోజులు నరకయాతనను గురిచేశారు. కానీ, మిథున్రెడ్డికి తొలిరోజే జైలులో అన్ని సౌకర్యాలూ లభించాయి. అయినా...చంద్రబాబు ప్రభుత్వంపై మిథున్రెడ్డి తండ్రి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవేశపడిపోయారు. బుధవారం తన కుమారుడిని జైలులో కలిసి బయటకువచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వైసీపీ నేతల పట్ల ప్రభుత్వం తాలిబన్లు, టెర్రరిస్టుల మాదిరిగా వ్యవహరిస్తోంది.’’ అని అన్నారు. మరి... చంద్రబాబుపై కక్ష కట్టి అక్రమంగా స్కిల్ డెవల్పమెంట్ కేసులో అప్పటి ప్రభుత్వం జైలుకు పంపినప్పుడు.. పెద్దిరెడ్డికి తాలిబన్లు, టెర్రరిస్టులు గుర్తుకు రాలేదా? అని నెటిజన్లు, టీడీపీ శ్రేణులు నిలదీస్తున్నాయి.
అంతులేని దాష్టీకం..
14 ఏళ్లపాటు సీఎంగా సేవలందించి, సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగిన... 75 ఏళ్ల వయసున్న చంద్రబాబుపట్ల నాటి వైసీపీ సర్కారు క్రూరంగా వ్యవహరించింది. కోర్టుకు తీసుకెళ్లాల్సి వస్తే ‘పోలీసు వ్యానులోకి మెడ పట్టుకుని గెంటండి’ అని పోలీసు ఉన్నతాధికారి పీఎ్సఆర్ ఆంజనేయులు అనేవారు. అప్పట్లో జైలు లోపలకు వెళ్తున్న చంద్రబాబు వీడియోను నిబంధనలు అతిక్రమించి చిత్రీకరించడమే కాకుండా, జగన్ చానల్లో పదే పదే ప్రచారం చేసింది. ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న ఆయనను ఉంచిన స్నేహా బ్లాక్లో సౌకర్యాలు అరకొరే. బాత్రూమ్లో జగ్గు లేకుండా కేవలం ఒక చిన్న బకెట్ పెట్టారు. ఒళ్లంతా దద్దుర్లు వచ్చినా పట్టించుకోకుండా చంద్రబాబు నరకయాతన పడేలా చేశారు.
రెండు రోజులు కంటిపై కునుకులేదు..
చంద్రబాబుకు అప్పట్లో రెండురోజులపాటు కంటిమీద కునుకులేకుండా చేశారు. 2023 సెప్టెంబరు 8న అర్ధరాత్రి తర్వాత 2.30గంటల ప్రాంతంలో అప్పటి సిట్ చీఫ్, ఇంటెలిజెన్స్ డీఐజీ రఘురామిరెడ్డి, డీఎస్పీ ధనుంజయుడు నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేశారు. ఉదయం 7.40గంటలకు రోడ్డు మార్గాన విజయవాడకు బయలుదేరారు. 10వతేదీ తెల్లవారుజామున ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం మళ్లీ సిట్ కార్యాలయానికి తీసుకెళ్లి సరిగ్గా ఉదయం ఆరు గంటలకు ఏసీబీ కోర్టులో జడ్జి హిమబిందు ముందు హాజరుపర్చారు. రిమాండుపై ఆరు గంటలపాటు విచారణ జరిగింది. చంద్రబాబుకు జ్యుడిషియల్ రిమాండు విధిస్తూ సాయంత్రం 6.45 గంటలకు తీర్పు వెలువడింది. ఆ తర్వాత రిమాండ్ను గృహనిర్బంధంగా మార్చాలనే పిటిషన్పై వాదనలు జరిగాయి. దీంతో రాత్రి9.45 గంటల వరకూ చంద్రబాబు కోర్టుఆవరణలోనే ఉన్నారు. ఆ తర్వాత రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. అర్ధరాత్రి 1.20గంటలకు ఆయన జైలులోకి వెళ్లారు. ఇలా రెండు రోజులపాటు కంటిపై కునుకు లేకుండా చేశారు.
నివేదికలు తారుమారు..
చంద్రబాబుకు ఆరోగ్య కారణాల రీత్యా చల్లటి వాతావరణం అవసరం. కానీ గదిలో ఫ్యాను మాత్రమే ఉండేది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకూ ఉండడంతో తీవ్రమైన ఉక్కపోత, వేడితో ఒళ్లంతా బొబ్బలెక్కేది. అప్పుడు వైద్యం అందించడంలోనూ అలసత్వం వహించారు. ఆ తర్వాత కోర్టు ఆదేశంతో టవర్ ఏసీ బిగించారు. కంటికి ఆపరేషన్ అవసరమని వైద్య నిపుణులు తేల్చగా.. కొద్ది గంటల్లోనే ఇప్పుడే అవసరం లేదంటూ వైద్యుడితో ఆ నివేదికను మార్పించారు.
డెంగీ భయాల మధ్యే..
జైలులో చంద్రబాబు భద్రత, ఆరోగ్యంపై ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే అడుగడుగునా చంద్రబాబును ఇబ్బంది పెట్టాలనే చూశారు. ‘పైనుంచి’ ఎప్పటికప్పుడు అందుతున్న మౌఖిక ఆదేశాల ఆధారంగా జైలు అధికారులు నడుచుకున్నారు. ఆయన గదిలో కేవలం ఒక కుర్చీ ఉంచారు. భోజనం క్యారేజీ బాక్సులను కింద పెట్టుకొని కుర్చీలో ఆయన కూర్చొని, కిందికి వంగి కష్టంగా కంచంలో పదార్థాలు వేసుకోవాల్సి వచ్చేది. బాత్రూమ్ ఇండియన్ టైప్ కాగా..చిన్న బకెట్ ఇచ్చారు. చాలా రోజులు ఇలాగే ఇబ్బంది పెట్టారు. కిటికీలకు తెరలు కూడా లేకపోవడంతో దోమలతో చంద్రబాబు ఇబ్బంది పడేవారు. ఆ సమయంలో జైలులోని ఒక ఖైదీకి డెంగీ వచ్చింది. చంద్రబాబును ములాఖత్ ద్వారా కలిసిన లోకేశ్ ఆ విషయం తెలుసుకుని భయాందోళనకు గురయ్యారు. జైల్లోనే బాబును అంతం చేసే కుట్ర జరుగుతోందని ఆవేదనతో మీడియాకు తెలిపారు.
Updated Date - Jul 25 , 2025 | 09:52 AM