కన్నీటి సాగు!
ABN, Publish Date - Jul 22 , 2025 | 12:40 AM
ఖరీఫ్ ప్రారంభంలోనే రైతులకు కష్టాలు ఆరంభమయ్యాయి. ఇప్పటి వరకు సరైన వర్షాలు లేక, కాలువల ద్వారా సక్రమంగా సాగునీరు అందక వరి నాట్లు వేసిన పొలాలు నెర్రలిచ్చి పైరు ఎండిపోయే స్థితికి చేరింది. ఇటువంటి పరిస్థితుల్లో గత మూడు, నాలుగు రోజులుగా ఎడ తెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు పంట పొలాలను ముంచెత్తుతున్నాయి. డ్రెయిన్లలో నీటి పారుదలకు అవకాశం లేక పైరు మునిగిపోతోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. డ్రెయిన్లలో గుర్రపు డెక్క, నాచు, కిక్కిసలను సకాలంలో తొలగించక పోవడంతో ఈ దుస్థితి ఏర్పడిందని, నవంబరు వరకు కురిసే వర్షాలకు ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందోననే భయం రైతులను వెంటాడుతోంది.
- జిల్లాలో కొద్దిపాటి వర్షానికే పొంగి పొర్లుతున్న డ్రెయిన్లు
- పామర్రు, పెదపారుపూడి మండలాల్లో నీట మునిగిన వరిపైరు
- మొక్కుబడిగా గుర్రపు డెక్క, నాచు, కిక్కిస తొలగింపు పనులు
- జిల్లాలో ఇప్పటి వరకు 65 వేల హెక్టార్లలో వరినాట్లు పూర్తి
-డ్రెయిన్లు ఇలా ఉంటే సాగు ఎలా అంటున్న రైతులు
ఖరీఫ్ ప్రారంభంలోనే రైతులకు కష్టాలు ఆరంభమయ్యాయి. ఇప్పటి వరకు సరైన వర్షాలు లేక, కాలువల ద్వారా సక్రమంగా సాగునీరు అందక వరి నాట్లు వేసిన పొలాలు నెర్రలిచ్చి పైరు ఎండిపోయే స్థితికి చేరింది. ఇటువంటి పరిస్థితుల్లో గత మూడు, నాలుగు రోజులుగా ఎడ తెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు పంట పొలాలను ముంచెత్తుతున్నాయి. డ్రెయిన్లలో నీటి పారుదలకు అవకాశం లేక పైరు మునిగిపోతోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. డ్రెయిన్లలో గుర్రపు డెక్క, నాచు, కిక్కిసలను సకాలంలో తొలగించక పోవడంతో ఈ దుస్థితి ఏర్పడిందని, నవంబరు వరకు కురిసే వర్షాలకు ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందోననే భయం రైతులను వెంటాడుతోంది.
ఆంధ్రజ్యోతి- మచిలీపట్నం :
జిల్లాలో 1.65 లక్షల హెక్టార్లలో ఈ ఏడాది వరి పంట సాగవుతుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. అయితే వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొని రైతులు 65 వేల హెక్టార్లలో ఇప్పటి వరకు వరి నాట్లు పూర్తి చేశారు. ఇంకా లక్ష ఎకరాల్లో సాగు వేసేందుకు సమాయత్తమవుతున్నారు. గత నాలుగు రోజులుగా వాతావరణం చల్లబడి వర్షం కురుస్తుండటంతో వ్యవసాయ పనులను వేగవంతం చేశారు. శివారు ప్రాంత భూముల్లో నారు మడులు పోస్తున్నారు.
గుర్ర పు డెక్క, నాచు తొలగింపు పనుల్లో ఆలస్యం!
వేసవిలోనే జిల్లాలోని ప్రధాన డ్రెయిన్లలో పెరిగిన గుర్రపు డెక్క, నాచు, కిక్కిలను తొలగించా లని రైతులు, శాసన సభ్యులు కోరారు. గత నెలలో జరిగిన సాగునీటి సలహా మండలి సమావేశంలో ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, వర్ల కుమార్రాజా, కాగిత కృష్ణప్రసాద్ ప్రఽధాన డ్రెయిన్లలో పూడిక తీయకుంటే రైతులు పడే ఇబ్బందులను కలెక్టర్ బాలాజీ, నీటిపారుదల, డ్రైనేజీ విభాగం అధికారులకు వివరించారు. అయినా పనులు చేయకుండా కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం ప్రదర్శించారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పామర్రు మండలం కొరిమెర్ల, యలకుర్రు, నిమ్మలూరు తదితర ప్రాంతాల్లో డ్రెయిన్లు పొంగి ప్రవహిస్తున్నాయి. సకాలంలో పూడిక తీయకపోవడంతో కొద్దిపాటి వర్షానికే యలకుర్రు డ్రెయున్, దానికి అనుబంధంగా ఉన్న డ్రెయిన్లు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ గ్రామాల్లో వరినాట్లు పూర్తి చేసిన 600 ఎకరాల్లో వరిపైరు ప్రస్తుతం నీట మునిగింది. మరో నాలుగైదు రోజులపాటు వర్షాలు కురుస్తాయనే వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో వరిపైరు చనిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పెదపారుపూడి మండలం పటమట పొలంలో 200 ఎకరాలకు పైగా వరిపైరు నీటి మునిగింది. ఈ గ్రామంలోని డ్రెయిన్లో పూడిక తీయకపోవడంతో పొలాలు నీటమునిగాయి. మోపర్రు వద్ద బుడమేరుతో పాటు చంద్రయ్య కాలువ, పాలకోడు డ్రెయున్లలో గుర్రపు డెక్క, నాచులను సక్రమంగా తొలగించకపోవడంతో ఈ డ్రెయిన్లు పొంగి ప్రవహిస్తున్నాయి. మరింతగా వర్షం పడితే వర్షపు నీరు పొలాల్లో ఉండిపోయి వరిపైరు కుళ్లి పోతుందని రైతులు వాపోతున్నారు.
గుండేరు డ్రెయిన్లో పేరుకుపోయిన నాచు
ఘంటసాల, మొవ్వ, చల్లపల్లి, మచిలీపట్నం మండలాల్లోని పంట పొలాల నుంచి మురుగు నీటిని సముద్రంలో కలిపే గుండేరు డ్రెయిన్ ప్రస్తుతం పొంగి ప్రవహిస్తోంది. మచిలీపట్నం-చిన్నాపురం రహదారి వెంబడి గుండేరు డ్రెయిన్పై ఉన్న వంతెన వద్ద తూడు, గుర్రపు డెక్క, నాచు నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారాయి. ఈ వంతెన వద్ద అర కిలోమీటరు మేర పెరిగిన తూడు తొలగించే పనులు చేయకుండా జాప్యం చేస్తున్నారు. దీంతో నాలుగు మండలాల్లో వరి నాట్లు వేసిన పొలాల్లోని వరిపైరు నీటమునిగే ప్రమాదం పొంచి ఉంది. మచిలీపట్నం మండలంలోని గుండుపాలెం గ్రామం పక్కనే ఉన్న డ్రెయిన్లో కిక్కిసను ఒకవైపున మాత్రమే తొలగించారు. దీంతో తొలగించిన ప్రాంతంతో పాటు డ్రెయిన్కు మరోవైపున ఉన్న కిక్కిస మరింతగా పెరిగి నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారిందని స్థానిక రైతులు చెబుతున్నారు. చల్లపల్లి మండలం మాజేరు గ్రామం సమీపంలోని లింగన్నకోడు వంతెన వద్ద, ఘంటసాల మండలం దేవరకోట తదితర ప్రాంతాల్లో గత రెండు రోజులుగా డ్రెయిన్లలో గుర్రపు డెక్కను తొలగించే పనులను చేస్తున్నారు. ఇప్పుడు పనులు చేస్తే ఎంతమేర ప్రయోజనం ఉంటుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. వర్షాలు కురిసే సమయంలో యంత్రాల ద్వారా పనులు చేయడం సాధ్యం కాని సమయంలో పనులు ప్రారంభించి మమ అనిపించే ప్రయత్నాలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
Updated Date - Jul 22 , 2025 | 12:41 AM