MP kalisetti Appala Naidu: పంటల బీమా బకాయిలు రూ.2,565 కోట్లు
ABN, Publish Date - Jul 23 , 2025 | 06:10 AM
దేశవ్యాప్తంగా ఉన్న పంటల బీమా బకాయిల్లో అత్యధికంగా 40 శాతం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చెప్పారు.
30 లక్షల మంది రైతుల ఎదురుచూపులు
రైతులను మోసం చేసిన వైసీపీ: ఎంపీ కలిశెట్టి
న్యూఢిల్లీ, జూలై 22(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ఉన్న పంటల బీమా బకాయిల్లో అత్యధికంగా 40 శాతం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చెప్పారు. మొత్తం రూ.6,604 కోట్లలో ఏపీ రైతులకే రూ.2,565 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలుపై పార్లమెంట్లో ప్రశ్నించగా కేంద్రం ఈమేరకు సమాధానం ఇచ్చిందని, మంగళవారం ఆయన మీడియా సమావేశంలో చెప్పారు. 2022-2024 సంవత్సరాల్లో పంట నష్టపోయిన సుమారు 30 లక్షల మంది రైతులు బీమా కోసం ఎదురుస్తున్నారని తెలిపారు. కర్నూలు జిల్లాలో 4లక్షలు, అనంతపురంలో 3 లక్షలు, కడపలో 2 లక్షలు, సత్యసాయి జిల్లాలో 2లక్షల మంది రైతులకు బీమా అందాల్సి ఉందన్నారు. కాగా, ఢిల్లీలో టీడీపీ కార్యాలయం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కేంద్ర పట్టణాభివృద్థి శాఖ మంత్రిని కోరినట్లు కలిశెట్టి చెప్పారు. పార్టీ కార్యాలయం కోసం గతంలో స్థల పరిశీలన జరిగిందని, ఢిల్లీలో కార్యాలయం నిర్మిస్తామని అన్నారు.
Updated Date - Jul 23 , 2025 | 06:10 AM