Visakhapatnam: స్టీల్ప్లాంటులో బొగ్గు బుగ్గి
ABN, Publish Date - Jul 08 , 2025 | 06:10 AM
స్టీల్ ప్లాంటులోని బాయిలర్ కోల్ యార్డులో గత ఐదు రోజులుగా బొగ్గు కాలిపోతోంది. అయినా యాజమాన్యం పట్టించుకోవడం లేదు. స్టీల్ప్లాంటులో థర్మల్ విద్యుత్ కేంద్రం నడపడానికి ఈ బాయిలర్ కోల్ను వినియోగిస్తారు.
బాయిలర్ కోల్ యార్డులో ఐదు రోజులుగా మంటలు.. సిబ్బంది తొలగింపుతో పర్యవేక్షణ లోపం.. పట్టించుకోని యాజమాన్యం
విశాఖపట్నం, జూలై 7(ఆంధ్రజ్యోతి): స్టీల్ ప్లాంటులోని బాయిలర్ కోల్ యార్డులో గత ఐదు రోజులుగా బొగ్గు కాలిపోతోంది. అయినా యాజమాన్యం పట్టించుకోవడం లేదు. స్టీల్ప్లాంటులో థర్మల్ విద్యుత్ కేంద్రం నడపడానికి ఈ బాయిలర్ కోల్ను వినియోగిస్తారు. ఇది అత్యధిక కెలోరిఫిక్ విలువ కలిగినది. అంటే దీన్ని మండిస్తే అత్యధిక వేడిని విడుదల చేస్తుంది. బూడిద శాతం తక్కువగా ఉంటుంది. ఎండలో వదిలేస్తే అధిక ఉష్ణోగ్రతకు దానంతట అదే మండుతుంది. అందుకే దీనిని నిల్వ చేసే రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంటులో ప్రత్యేకంగా పర్యవేక్షించడానికి కాంట్రాక్టు కార్మికులు ఉంటారు. వారు నిత్యం ఈ బొగ్గుపై నీటిని చిమ్ముతుంటారు. దానివల్ల ఎండలకు మండకుండా ఉంటుంది. అయితే యాజమాన్యం నిర్వహణ వ్యయం తగ్గించేందుకు ఇటీవల దాదాపు ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించింది. దాంతో యార్డుల్లో ఏమి జరిగినా చర్యలు చేపట్టేవారు కరవయ్యారు. వాస్తవానికి ఈ విలువైన బొగ్గును ఇలా ఆరుబయట వదిలేయకుండా షెడ్లు నిర్మించి, వాటిలో నిల్వ చేయాల్సి ఉంది. దానికి అనవసర వ్యయం ఎందుకంటూ బయట వదిలేస్తున్నారు. ఏ చిన్న తప్పు జరిగినా సంబంధిత ఉద్యోగులపై చర్యలు చేపడుతున్న స్టీల్ప్లాంట్ యాజమాన్యం ఇప్పుడు దీనికి ఏమి సమాధానం చెబుతుందని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. మంటలు పెద్దవి కాకముందే తగిన చర్యలు చేపట్టాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి వాటిని నిర్లక్ష్యం చేయకుండా తగినంత మంది సిబ్బందిని నియమించాలని కోరుతున్నాయి.
Updated Date - Jul 08 , 2025 | 06:11 AM