Chandrababu Naidu: డిమాండ్కు తగ్గట్టు సాగు
ABN, Publish Date - May 23 , 2025 | 05:33 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు పంటల సాగులో డిమాండ్ ఆధారిత ప్రణాళికపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. పొగాకు, కోకో, మామిడి రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రోత్సాహం ఇవ్వాలని, జీఎస్టీ తగ్గింపుకు కేంద్రం తో సమన్వయం అవసరం ఉందని తెలిపారు.
ఏ పంటలు వేయాలో ముందే చెప్పాలి
ప్రణాళికలపై వ్యవసాయ శాఖ దృష్టిపెట్టాలి
కోకో పంట నిల్వల కొనుగోలుకు చర్యలు
హెచ్డీ బర్లీ పొగాకుకు క్రాప్ హాలిడే
కేంద్ర మంత్రుల దృష్టికి రైతు సమస్యలు
కేబినెట్ సబ్ కమిటీతో సీఎం సమీక్ష
అమరావతి, మే 22(ఆంధ్రజ్యోతి): జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల డిమాండ్కు తగ్గట్టు రాష్ట్రంలో పంటల సాగు జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇందుకు అనుగుణంగా పంటల వారీగా సాగు ప్రణాళికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. రైతులు ఎదుర్కొంటున్న స్వల్ప, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం కేబినెట్ సబ్ కమిటీ కూడా దృష్టి పెట్టాలని సూచించారు. గురువారం ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి మంత్రులు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా పొగాకు, కోకో, మామిడి, ధాన్యం ధరలు, రైతు సమస్యలపై సీఎం సమీక్ష చేశారు. సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ పంట, ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలో రైతులకు ముందే చెప్పడం వల్ల డిమాండ్-సప్లై మధ్య సమతూకం ఉంటుందన్నారు. డిమాండ్ ఉన్న పంటల్ని మాత్రమే సాగు చేస్తే రైతులు నష్టపోకుండా ఉంటారని, పంట ప్రణాళిక అనేది పూర్తిగా శాస్త్రీయంగా జరగాలని అన్నారు. దిగుబడులను ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్, వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించాలని సూచించారు. రైతుల దగ్గర ఉన్న కోకో పంట నిల్వలను కిలో రూ.500కు కంపెనీలు కొనుగోలు చేసేలా చూడాలని ఆదేశించారు. అవసరమైతే ప్రభుత్వమే నేరుగా కొనుగోళ్లు జరుపుతుందన్నారు. రైతుల దగ్గరున్న 20వేల మిలియన్ కిలోల హెచ్డీ బర్లీ పొగాకు నిల్వలను కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,200 నుంచి 1,500 టన్నుల కోకో పంట నిల్వలు ఉండగా, 600 టన్నులు మాత్రమే రైతుల దగ్గర ఉన్నాయని, వాటిని మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉందని అధికారులు వివరించారు. డిమాండ్ లేనందున రైతులు నష్టపోకుండా ఈ ఏడాది హెచ్డీ బర్లీ పొగాకు రకానికి క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నట్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. రైతుల దగ్గర హెచ్డీ బర్లీ పొగాకు ఎంత నిల్వ ఉందో యాప్ ద్వారా కచ్చితమైన వివరాలు సేకరించాలని సీఎం సూచించారు. పొగాకు బోర్డులో సెల్ ఏర్పాటు చేసి, రోజువారీ కొనుగోళ్ల వివరాలు నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. హెచ్డీ బర్లీ, వైట్ బర్లీ రకాలను పొగాకు బోర్డులో చేర్చాల్సిందిగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రికి లేఖ రాశామని, ఈ వారం తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో రైతాంగ సమస్యలపై చర్చిస్తానని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రోత్సాహం
మ్యాంగో పల్ప్కు సంబంధించి ఆర్డర్లు రాకపోవడంతో మామిడి రైతులు ఆందోళన చెందకుండా తక్షణమే పల్ప్ ప్రాసెసింగ్ కంపెనీలు కొనుగోళ్లు జరిపేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. అయితే పాత నిల్వలు కంపెనీల దగ్గర మిగిలిపోవడంతో కొత్తగా కొనుగోళ్లు చేయడానికి ఆస్కారం లేకుండా పోయిందని, అలాగే పల్ప్ ప్రాసెసింగ్ కంపెనీలకు బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడం కూడా ఇందుకు కారణమైందని అధికారులు వివరించారు. ఈ సమస్య పరిష్కారానికి పల్ప్ ప్రాసెసింగ్ కంపెనీలకు బ్యాంకులు రుణాలిచ్చేలా అధికారులు చూడాలని సీఎం అన్నారు. ప్యూర్ జ్యూస్లపై సైతం కేంద్ర ప్రభుత్వం 40 శాతం జీఎస్టీ విధించడంతో మామిడి కొనుగోళ్లు మందగించాయని అధికారులు వివరించారు. ప్యూర్ జ్యూస్లపై జీఎస్టీ తగ్గించేలా కేంద్రంతో సంప్రదింపులు జరపాలని సీఎం నిర్ణయించారు. మ్యాంగో జ్యూస్ వినియోగం పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు మ్యాంగో జ్యూస్ ఇవ్వడంతో పాటు తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ మ్యాంగో జ్యూస్ అందించే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. వరి, టమాటా రైతుల సమస్యలపైనా చర్చించారు. రాష్ట్రంలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్లు పెరిగేలా ప్రోత్సహించి, రైతులకు ఆశించిన ధర వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ధాన్యం సేకరణలో ఎలాంటి సమస్యా లేదని, ఏ ప్రాంతాల్లో అయితే తడిసిన ధాన్యం ఉందో పరిశీలించి, దానిని కూడా కొనుగోలు చేస్తున్నామని అధికారులు చెప్పారు. సమీక్షలో మంత్రులు అచ్చెన్నాయుడు, మనోహర్, రవికుమార్, రామానాయుడు, కేశవ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత రాయబార కార్యాలయ సిబ్బందిని బహిష్కరించిన పాక్
For National News And Telugu News
Updated Date - May 23 , 2025 | 05:33 AM