CM Chandrababu: ఆ వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరం
ABN, Publish Date - Jul 09 , 2025 | 04:20 AM
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్రెడ్డి చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
మహిళలను అవమానించడం వైసీపీ డీఎన్ఏలోనే ఉంది
మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు
అమరావతి, జూలై 8 (ఆంధ్రజ్యోతి): కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్రెడ్డి చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రసన్న చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన మంగళవారం ఎక్స్ వేదికగా తీవ్రంగా ఖండించారు. మహిళలను దూషించడం, బూతులు తిట్టడం, కించపరచడాన్ని వైసీపీ రాజకీయ సిద్ధాంతంగా పెట్టుకుందని విమర్శించారు. మహిళలను అవమానపర్చడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం వైసీపీ డీఎన్ఏలోనే ఉందన్నారు. వారి ఘోర ఓటమికి ఇలాంటి పోకడలే కారణమని తెలిసినా వారి సహజ గుణంలో మార్పు రావడం లేదన్నారు. చెల్లి పుట్టుకపైనా వ్యాఖ్యలు చేసిన వారి నాయకత్వంలో పనిచేస్తున్న నేతలు అంతే దారుణంగా మాట్లాడుతూ నీచ సంస్కృతిని చాటుకుంటున్నారని ధ్వజమెత్తారు. మహిళలపై వ్యక్తిగత విమర్శలు చేసి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న వారు అసలు మనుషులేనా? ఇది రాజకీయమా అని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, మహిళా నాయకుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా, ప్రణాళికాబద్ధంగా వైసీపీ చేస్తున్న కుట్రలను ప్రతి పౌరుడూ గమనించాలన్నారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిపై చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Updated Date - Jul 09 , 2025 | 04:21 AM